విశాఖ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్లో.. అరుదైన చేపల సందడి!
విశాఖలో ఏర్పాటు చేసిన ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు రెండు వేల రకాల చేపలను ఇందులో చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలేట్గా నిలుస్తాయి. మూడు నెలలపాటు ఈ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ముచ్చటగొలిపే రంగు రంగుల వెలుగులో వయ్యారాలుపోయే అందమైన చేపలను దగ్గరగా చూసేందుకు ఈ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ ఆహ్వానం పలుకుతోంది.
విశాఖపట్నంలో సందర్శకులను ఆకట్టుకుంటోన్న టన్నెల్ ఫిష్ అక్వేరియంలో సముద్ర, మంచినీటి పర్యావరణంలో సంచరించే అనేక రకాల అందమైన చేపలను చూసే అవకాశం ఉంది. ఇటీవల బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్లో ప్రారంభించిన అండర్వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ చూసేందుకు దూర ప్రాంతాలనుంచి కూడా సందర్శకులు వస్తూ ఉన్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా క్యాంప్ చేసిన ఈ ఎక్స్పోను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్ మరియు హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి.
తమతోపాటు ప్రయాణిస్తున్న అనుభూతి
అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని చూసేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో వారు ఎక్కడా చూడని చేపలు, భవిష్యత్తులో చూడలేని చేపల్ని కూడా ఇక్కడ ఒకేసారి చూడొచ్చు. గతంలో అక్వేరియంలు చూసినవారు కూడా ఈ టన్నెల్ ఆకారంలో ఉన్న అక్వేరియంలో నడచి వెళ్తూ, తమ పైనుంచి చేపలు వెళ్తున్నట్టు, పక్కనుంచి తమతోపాటు ప్రయాణిస్తున్నట్టు ఉన్న అనుభూతితో మైమరచిపోతున్నారు. ఈ సొరంగం అక్వేరియం రోజుకు కనీసం 25,000 మంది సందర్శకులు చూసేందుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక్కడి ఎక్స్పోలో చేనేత స్టాల్స్ కూడా ఉన్నాయి. నీటి అడుగున సొరంగంలో ఇలాంటివి సింగపూర్లో ప్రసిద్ధి చెందాయి. అయితే, సింగపూర్లోని ఫిష్ టన్నెల్ అక్వేరియం స్థిరమైనది. ప్రస్తుతం వైజాగ్లో ఉన్న టన్నెల్ అక్వేరియం మాత్రం వివిధ ప్రాంతాలకు తరలించవచ్చు.
రెండు వందల అడుగుల పొడవు
నీటి అడుగున సొరంగంలో సుమారు 500 రకాల చేపలను ప్రదర్శించారు. ఈ జాతులు చాలా వరకు సింగపూర్ మరియు మలేషియాతోపాటు కేరళ నుండి సేకరించబడ్డాయి. ఇక్కడ పెద్ద ఎత్తున సంతానోత్పత్తి జరుగుతుంది. సొరంగం వెలుపల అదనంగా 44 అక్వేరియంలను ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియంలలో అదనంగా 500 రకాలను ప్రదర్శిస్తున్నట్లు అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్ యజమాని రాజా రెడ్డి చెబుతున్నారు.
4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశీయంగా నిర్మించిన ఈ టన్నెల్ అక్వేరియం రెండు వందల అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని ఎనిమిది ముక్కలుగా చేసి ఎనిమిది లారీ ట్రైలర్స్పై తీసుకెళ్లవచ్చు.
అమెజాన్ ఫిష్ స్పెషల్ అట్రాక్షన్
ప్రతిరోజూ సాయంత్రం పది గంటలనుంచి అక్వేరియంలోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇలాంటి అక్వేరియంలు ఎక్కువగా కేరళలో ఉంటాయి. కేరళనుంచి కూడా కొన్ని చేపల్ని ఇక్కడకు తీసుకొచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాలనుంచి కూడా కొన్ని చేపల్ని తెచ్చారు.
అమెజాన్ ప్రాంతంలో మాత్రమే కనపడే అమెజాన్ ఫిష్ ఈ అక్వేరియంకు స్పెషల్ అట్రాక్షన్. చేపలు, నోరు, కళ్లు... అసలు ఏమాత్రం బయటకు కనపడని హనీమూన్ ఫిష్ కూడా ఇక్కడ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తానికి విశాఖవాసులకు ఈ అండర్ వాటర్ టన్నెల్.. సరికొత్త అనుభూతిని కలిగిస్తోందని మాత్రం చెప్పొచ్చు.