గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
విజయనరం జిల్లా! అది మహాకవి గురజాడ నడిచిన నేల. ఆయన మదిలో మెదిలిన ఎన్నో భావాలు కావ్యరూపం దాల్చిన గురుతులు నేటికీ ఆ గృహంలో పదిలంగా ఉన్నాయి. వాటితోపాటు నాటి తెల్లదొరలను గుర్తుచేసే మరెన్నో కట్టడాలకు నిలయం ఈ ప్రాంతం. చారిత్రక కట్టడాలు శిథిలమైపోవచ్చు. కానీ, వాటి చరిత్ర శాశ్వతం. అలాంటి చరిత్రను తెలుసుకోవడానికి విజయనగరం వెళ్లొద్దాం పదండి!
విజయనగరం ఆర్ టిసి బస్ స్టాండ్ నుంచి గురజాడ అప్పారావు వీధిని చేరుకునేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆటో చార్జీ ఒక్కొక్కరికీ పది రూపాయలు తీసుకున్నారు. ఆ రోడ్డులో దిగాక రెండు అడుగులు వేశాం. ఆధునిక సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుని, మహా కవిగా మరో ప్రపంచానికి దారిచూపిన గురజాడ అప్పారావు నివాసం ఎదురైంది.
ఆ ఇంటిని చూస్తే, గురజాడ రచించిన కన్యాశు ల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక తదితర నాటక రచనలు గుర్తుకొచ్చాయి. లోపలికి అడుగుపెట్టగానే విశాల దృక్పధం ఉండాలేగానీ, చిన్న ఇళ్లయినా సరిపోతుంది అనిపించింది. మంచి చెడ్డలు మనుషులందన... యెంచి చూడగ రెండు రకాలు, మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అంటూ గురజాడ ప్రవచించిన అనేక అంశాలు వేలాడుతున్న చార్టులల్లో సందర్శకులను జాగృత పరుస్తున్నాయి.
స్వదస్తూరితో ఉన్న దేశభక్తి గేయాలు
ఈ ఇంటిలోనే గురజాడ అనేక గ్రంథాలను రాసి, సాహితీరంగానికి మార్గదర్శకుడయ్యారు. అప్పట్లో విజయనగరం రాజులు ఈ గృహాన్ని ఉదారంగా ఇస్తానంటే ఆత్మాభిమానమే ఆయుధంగా ధరించిన గురజాడ అప్పారావు రూ.250 ఇచ్చి కొనుకున్నాడని ప్రస్తుతం ఇక్కడున్న గురజాడ మునిమనుమడు వెంకటప్రసాద్ చెప్పుకొచ్చారు. అన్నట్టు ఇంటి మేడపై ఉన్న చిన్నపాటి గదిలో అప్పారావు రచించిన గ్రంథాలతోపాటు ఆయన వినియోగించిన రెండు కుర్చీలు, ఒక టేబుల్, కళ్లజోడు, రబ్బరు స్టాంపు ఇప్పటికీ ఆ మహనీయుని సాక్షాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గురజాడ స్వదస్తూరితో ఉన్న దేశభక్తి గేయాలను చూసే అవకాశం కూడా ఉంది.
అలనాటి చారిత్రక సాక్ష్యం
గురజాడ ఇంటి సందర్శన పూర్తయ్యాక ఎన్నో జ్ఞాపకాలతో బయటకు అడుగుపెట్టాం. అలా ముందుకు
కదలగానే ఎదురుగా విజయనగరం పెద్దచెరువు పలకరించింది. ఎడమచేతి వైపు పట్టణం గుర్తింపునకు మరో చిహ్నంగా ఉన్న గంటస్తంభం ఎదురైంది. మా వాళ్లంతా వింతగా కనిపిస్తున్న గంటస్తంభం వైపే మొగ్గుచూపారు. రెండు నిమిషాల నడకతో చేరుకున్నాం. 1885లో విజయనగరం సందర్శనకు బ్రిటీష్ పాలకులు వచ్చినందుకు గుర్తుగా అరవైఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సుందర స్తంభం ప్రస్తుతం పట్టణానికి నడిబొడ్డున ఉండడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.
శంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు..
అప్పట్లో గడియారాలు పెద్దగా లేక పోవడంతో పట్టణ వాసులకు కాలగ మనాన్ని గుర్తు చేసేందుకు గడియారాన్ని కూడా అమర్చారు. దానికి సైరన్ అమర్చారు. అప్పట్లో ప్రతి గంటకూ సైరన్ కొట్టేదట. ప్రస్తుతం ఉదయం ఆరు, ఎనిమిది మధ్యాహ్నం 12, రాత్రి ఎనిమిది గంటలకోసారి సైరన్ మోగుతుంది. మేం అక్కడ ఉన్నప్పుడే సైరన్ తన పని మొదలుపెట్టింది. అప్పటికే మాతో ఉన్న మరికొందరు సందర్శకులు వింతగా చూస్తూ వింటున్నారు. స్థానికులు మాత్రం ఎవరి పనులు వారు చక్కబెట్టుకుంటున్నారు.
మొత్తం మీద గంటస్తంభాన్ని చూసిన మావాళ్లంతో ఎంతో శంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అన్నట్టు దీనికి అనుకుని పిడబ్ల్యూడి మార్కెట్ ఉంది. ఇది జిల్లాకే ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రం. ఇక్కడ అన్నిరకాల వస్తువులు, సరుకులూ అందుబాటులో ఉంటాయి. పనిలో పనిగా మేం కూడా షాపింగ్ చేశాం. మరెందుకు ఆలస్యం మీరూ మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.