భిన్నమైన ఆచారాలను పాటించే కొన్ని ఆలయాలు
భారతదేశం అంటేనే దేవలుకొలువు దీరిన నేలగా భావిస్తారు. అలాంటి ఈ నేల ఎందరో దేవతల నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో అన్వేషించదగిన పవిత్ర నగరాలు మరియు పుణ్యక్షేత్రాలు తారసపడతాయి.
అయితే, వాటిలో కొన్ని వింతగా, అసాధారణంగా భిన్నమైన రీతిలో దర్శనమిస్తాయి. అలాంటి విచిత్రమైన ఆచారాలను కలిగి ఉన్న కొన్ని ఆలయాలను చూసొద్దాం.

మహేందిపూర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్
అతీంద్రియ విషయాలపై నమ్మకం లేనివారు, ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. ఎందుకంటే, ఇది సైన్స్పై ఉన్న విశ్వాసాలను తలకిందులు చేస్తుంది. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది ఈ ఆలయం. ఇప్పటికీ పూజారులు భూతవైద్యం చేసే ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పొచ్చు. దుష్టశక్తులు, దెయ్యాల నుండి ప్రజలను విముక్తి చేయబడే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పైకప్పునకు కట్టి వేలాడదీయడం, వేడినీటితో శరీరంపై పోయడం, నాలుగు గోడల మధ్య బంధించడం వంటి వివిధ కఠిన పద్ధతులను అనుసరించడం ద్వారా దేహం నుండి చెడులను పారదోలేందుకు ఉపయోగిస్తారు. ఈ ఆలయంలో నైవేధ్యం తీసుకోరు, ఇవ్వరు.

కామాఖ్య దేవి ఆలయం, అస్సాం
గౌహతిలోని నీలాచల్ కొండ పైభాగంలో ఉన్న కామాఖ్య దేవి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన ఇంకా రహస్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది ఒక శక్తి పీఠం. ఇది యోని ఆకారపు ఆకృతిలో ఉండటమే కాకుండా ఇక్కడ పూజించడానికి విగ్రహం లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అమ్మవారికి రుతుక్రమం వస్తుందని చెబుతారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ కారణంగా ఆలయం మూడు రోజుల పాటు మూసివేయబడి ఉంటుంది. ఆలయంలోని గదిలో ప్రవహించే భూగర్భ బుగ్గ ఆ మూడు రోజుల్లో ఎర్రగా మారడం కూడా గమనించబడింది. ఆ రోజుల్లో రాతి యోనిని కప్పడానికి ఉపయోగించే ఎర్రటి వస్త్రాం యొక్క ముక్కను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

దేవ్జీ మహారాజ్ మందిర్, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని దేవ్జీ మహారాజ్ ఆలయం భారతదేశంలోని మరొక విచిత్ర స్థలం. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి నాడు దెయ్యాలు మరియు దుష్టశక్తులను వదిలించుకోవడానికి ప్రజలు వస్తారు. కర్పూరం ముక్కలను అరచేతులపై వెలిగించడం, ఆత్మలు శరీరం నుండి బయటకు వెళ్లేలా చేయడం ఇక్కడ సర్వసాధారణంగా కనిపస్తాయి. దుష్టశక్తులను శాంతింపజేసేందుకు ఆలయ ప్రాంగణంలో దెయ్యాల జాతర నిర్వహిస్తారు. ఇది నిజంగా ఒక రహస్య ప్రదేశంగా చెప్పొచ్చు. మత విశ్వాసాలను కలిగినవారికి ఇదోక పవిత్ర స్థలంగా చెప్పొచ్చు.

కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ
కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి సంవత్సరం ఏడు రోజుల విచిత్రమైన పండుగను జరుపుకుంటారు. దీనిని భరణి ఉత్సవం అని పిలుస్తారు. అందరూ ఎర్రటి దుస్తులు ధరించి, ఈ ఆలయంలో కత్తులతో తూలుతూ తిరుగుతారు. ఆ కత్తులతో రక్తం వచ్చేలా తలపై కొట్టుకుంటారు. అంతేకాదు, అందరూ దేవి గురించి అసభ్యకరమైన పాటలు పాడుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ జంతుబలులు నిషేధించబడ్డాయి.

స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి సమీపంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అరేబియా సముద్రపు తీరంతో తన ఆలయాన్ని పంచుకుంటుంది. శివుడు ఇక్కడ నివసిస్తున్నాడని, ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ధైర్యం చేసే వారిని ఆశీర్వదిస్తాడని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ ఆటుపోట్ల సమయంలో మాత్రమే దీనిని సందర్శించవచ్చు. ఆటుపోట్ల సమయంలో, ఆలయం పూర్తిగా సముద్రంచే కప్పబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications














