ప్రపంచ వారసత్వపు సాగునీటి నిర్మాణాల సిగలో ధవళేశ్వరం బ్యారేజ్!
పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అలాంటి గుర్తింపుతో ప్రపంచ వారసత్వపు నిర్మాణాల సిగలో చేరింది ధవళేశ్వరం బ్యారేజ్. 160 సంవత్సరాలుగా దేశ ధాన్యాగారంగా గోదావరి డెల్టాను నిలిపి.. నేటికీ అవిరామంగా సేవలందిస్తొన్న ధవళేశ్వరం బ్యారేజ్ విశేషాలు తెలుసుకుందాం.
మనదేశంలోని పురాతన కాలంనుంచి సాగునీటితోపాటు తాగునీరు అందించే కట్టడాలను ప్రపంచవారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసిఐడి(ఇంటర్ నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రయినేజ్) గుర్తిస్తుంది. ఈ సారి ఆడిలైడ్లో జరుగుతోన్న 24వ కాంగ్రెస్లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్ట్లను గుర్తించగా, ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్ట్లకు స్థానం దక్కింది. వీటిలో ఏపీకీ చెందిన ధవళేశ్వరం ప్రాజెక్ట్, తమిళనాడులోని లోయ ఆనకట్ట, ఒడిశాలోని బైతరని రుషికుల్యా ప్రాజెక్ట్లు ఉన్నాయి.
ధవళేశ్వరం బ్యారేజ్ నేపథ్యం..
ఏపీలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ధవళేశ్వరం బ్యారేజ్. ఈ బ్యారేజీని బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ నిర్మించారు. బ్యారేజ్ నిర్మాణం 1850లో పూర్తయింది. ఈ బ్యారేజీ ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి ముందు, ఈ ప్రాంత ప్రజలు వేసవిలో కరువు మరియు వర్షాకాలంలో వరదలతో కష్టాలతో జీవితం నెట్టుకొచ్చేవారు.
బ్యారేజీ నిర్మాణ అనంతరం నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉభయ గోదావరి జిల్లాలకు నిరంతర నీటి సరఫరాను అందిస్తోంది. ధవలేశ్వరం బ్యారేజీ 15 అడుగుల ఎత్తు, 3.5 కిలీమీటర్ల పొడవు, వరదను నియంత్రించేందుకు 175 క్రెస్ట్ గేట్లు ఉన్నాయి. బ్యారేజీ పూర్తిస్థాయి రిజర్వాయర్ మట్టం 14 మీటర్ల ఎంఎస్ఎల్, 2.93 టీఎంసీల స్థూల నిల్వ సామర్థ్యం. ఈ ఆనకట్ట అమరిక రెండు ద్వీపాల మధ్య గంభీరంగా కనిపిస్తున్నట్లు ఉంటుంది.
సందర్శనీయ ప్రదేశంగా..
ధవళేశ్వరం బ్యారేజ్ చుట్టపక్కల ప్రాంతం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు నిత్యం తారసపడుతూ ఉంటారు. గతంలోనే సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియాన్ని పర్యాటకుల సందర్శనార్ధం ఏర్పాటు చేశారు. ఇందులో ఆనకట్ట పని తీరును వివరించే చిత్రాలు మరియు ఆనకట్ట నిర్మాణ సమయంలో ఉపయోగించిన పనిముట్ల ప్రదర్శనకు ఉంచుతారు.
బ్యారేజీ నిర్మాణ సమయంలో ఉపయోగించిన వివిధ రకాల యంత్రాల నుండి సేకరించిన అనేక నమూనాలు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. సందర్శకుల కోసం గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉంది. ఇక్కడి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కాటన్ విగ్రహాలు దారిపొడవునా దర్శమిస్తూనే ఉంటాయి. తెలుగు ప్రజలు అభిమానిస్తే.. వారి అభిమానానికి అవధులు ఉండవనేందుకు గోదావరి జిల్లాల్లో కనిపించే కాటన్ విగ్రహాలే నిదర్శనంగా చెప్పొచ్చు.
సుందర దృశ్యాన్ని ఆస్వాదించేందుకు..
బ్యారేజ్కు దగ్గరలో హాయిగా విహరించేందుకు గోదావరిలో బోటింగ్ అందుబాటులో ఉంటుంది. పిల్లగాలులకు తేలియాడే చిన్ని కెరటాల మధ్య ఆనందమయమైన బోటు షికారు పర్యాటకులకు అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రపు సమయాన ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించేందుకు స్థానికులతోపాటు సందర్శకులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు.