కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడు చూసినా ఒకే రకమైన అందంతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. మరికొన్ని పర్యాటక ప్రాంతాలు మాత్రం కొన్ని ప్రత్యేక సమయంలో మరింత అందంగా తయారయ్యి పర్యాటకులకు పచ్చని తివాసి పరుస్తుంటాయి. అంటువంటి కోవకు చెందినదే రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వత ప్రాంతం.
సాధారణంగా రాజస్థాన్ అన్న తక్షణం ఎర్రటి ఇసుక దిబ్బలతో కూడుకొన్న ఎడారి ప్రాంతమే కనుల మందు కనిపిస్తుంది. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబు. ఈ మౌంట్ అబు చుట్టు పక్కల ఎన్నో ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.
అయితే జులై, ఆగస్టు నెలల్లో పడే వర్షం వల్ల ఆరావాళి పర్వతప్రాంతంలోని మౌంట్ అబు కనుచూపు మేర పచ్చదనాన్ని సంతరించుకొంటూ ఉంటుంది. సముద్ర మట్టానికి 1220 మీటర్ల ఎత్తులో ఉండే మౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల వివరాలు మీ కోసం...
నక్కీ లేక్
P.C: You Tube
మౌంట్ అబు లోని నక్కీ సరస్సు భారత దేశంలోని అందమైన ఐదు సరస్సుల్లో ఒకటి. ఈనక్కీ సరస్సును పరమ పవిత్రమైన సరస్సుగా కూడా భావిస్తారు. ఈ సరస్సులో బోటింగ్ మీకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మౌంట్ అబుకు వెళ్లిన చాలా మంది మొదట సందర్శించే ప్రదేశాల్లో నక్కీ సరస్సే ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. బోట్ రైడింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేస్తారు.
ట్రెక్కింగ్
P.C: You Tube
ప్రకృతి అందాలకు చిరునామాగా భావించే ఆరవళి పర్వతాల్లోని మౌంట్ అబూలో మీ మనసుకు నచ్చినవారుచెంతన ఉండగా ట్రెక్కింగ్ చేస్తూ చెట్లను, చేమలను పలకరించుకొంటూ ముందుకు వెళ్లడం ఎంత బాగా ఉంటుందో కదా? ఊహించుకొంటూ ఉంటూనే మనస్సుకు ఆహ్లాదంగా అనిపిస్తోందో కదా? మరి వర్షాలు పడి అక్కడి పచ్చదనం పరుచుకొన్న సమయంలో నిజంగా అక్కడ ట్రెక్ చేయడం ఎంత ఆనందం అనిపిస్తుందో కదా. ట్రెక్కింగ్ ప్యాకేజీ రూ.2,700 నుంచి ప్రారంభమవుతుంది.
దిల్వార దేవాలయాలు
P.C: You Tube
మౌంట్ అబు లో చూడదగిన పర్యాటక కేంద్రాల్లో దిల్వార జైన దేవాలయం మొదటి వరుసలో ఉంటాయి. పూర్తిగా చలువరాతితో నిర్మించిన ఈ దేవాలయంలోని శిల్ప సంపద అందాలను చూస్తూ ఉంటే సమయం ఇట్టే గడిచి పోతూ ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ దేవాలయ సందర్శనను జైనులు పరమ పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఈ దేవాలయ సందర్శనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 5 వరకూ అనుమతిస్తారు.
అరుదైన జంతువుల వీక్షణ
P.C: You Tube
మౌంట్ అబు అభయారణ్యంలో అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో జంతువులు, పక్షులను మనం చూడవచ్చు. ముఖ్యంగా కొన్ని జాతులు ఎలుగుబంట్లు, చిరుతలు, కోతులు ఇక్కడ ప్రత్యేకం. వర్షాలు పడే సమయంలో ఈ అభయారణ్యం పచ్చదనం సంతరించుకొంటుంది. ఆ పచ్చదనం మధ్య పక్షుల కువ కువలు వింటూ సేదదీరడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ప్రవేశ రుసుం లేదు. అయితే జీప్ సఫారీ కోసం రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5వ గంటల వరకూ సందర్శనకు అనుమతిస్తారు.
గురు శిఖర్
P.C: You Tube
మౌంట్ అబులో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో గురుశిఖర్ కూడా ఇక్కడి. అత్యంత ఎతైన ఈ పర్వత శిఖర ప్రాంతం నుంచి చుట్టు పక్కల ఉన్న అందాలను చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. మౌంట్ అబు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక కేంద్రాన్ని తప్పక చూడాల్సిందే.
సన్ సెట్ పాయింట్
P.C: You Tube
అప్పుడే వర్షం పడి నిలిచిపోయింది. ఇక సూర్యుడు మీకు టాటా చెబుతూ పడమటన అస్తమిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కనబడే సప్త రంగుల అందాలను ఆస్వాధించాలనుకుంటే మౌంట్ అబులోని సన్ సెట్ పాయింట్ ను తప్పక వీక్షించాల్సిందే. ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో ఈ సన్నివేశ: చాలా బాగా చూపించారు.