సందర్శకులు మెచ్చే పర్యాటక మణిహారం.. కాకినాడ తీరం!
ఎటుచూసినా పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే వరిచేలు.. గలగల పారే సెలయేర్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తూ తలూపే కొబ్బరిచెట్లు.. ఆప్యాయత, అనురాగాలతో అక్కున చేర్చుకునే కోనసీమ జిల్లా ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రకృతిసిద్ధమైన ప్రాంతంలో చేసే విహార యాత్ర జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను అందిస్తుందనడంలో సందేహమే లేదు. మరెందుకు ఆలస్యం కోనసీమలో దాగిన కాకినాడ పర్యాటక అందాలను చూసొద్దాం రండి.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ ప్రధాన ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. సహజసిద్ధమైన ఓడరేవుగా వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న దీన్ని మినీ ముంబయి అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన సాగర తీరాలు పర్యాటకుల మనసును హత్తుకుంటాయి. అలాగే, కాకినాడ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేవి గొట్టం కాజాలు. దీంతోపాటు ఇక్కడి అరటి ఆకులోని భోజనం పర్యాటకులకు చాలా నచ్చుతుంది. కాకినాడ వెళ్లినప్పుడు అక్కడి అనేక సాంప్రదాయ వంటలను మనసారా రుచి చూడవచ్చు. ఇక్కడికి సమీపంలో ఉన్న మరిన్ని పర్యాటక ప్రదేశాలను పలకరిద్దాం.
హోప్ ఐల్యాండ్..
హోప్ ఐల్యాండ్ కారణంగానే కాకినాడ తీర ప్రాంతం పరిరక్షించబడుతోంది అనేది పర్యావరణవేత్తల అభిప్రాయంగా చెప్పొచ్చు. ఈ ద్వీపం సహజసిద్దంగా ఐదు వందల ఏళ్ల క్రితం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. ఈ ద్వీపం కారణంగా బంగాళాఖాతం నుంచి వచ్చే ఆటుపోట్ల నుంచి తీరం కోతకు గురికాకుండా కాపాడుతుంది.
ఈ ద్వీపం కారణంగా తీరంలో ఓడకు లంగరు వేసినప్పుడు అవి స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ హోప్ ఐల్యాండ్ సాగర తీరంకు మధ్యలో ఉండి తీరానికి రక్షణ కవచంగా ఉంటుంది. హోప్ ఐల్యాండ్ సందర్శన పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. సుమారు 23 కిలోమీటర్ల మేర తీరం వెంబడి హోప్ ఐల్యాండ్ ద్వీపం విస్తరించి పర్యాటకులకు ఆహ్లాదాన్ని చేరువచేస్తుంది. కాకినాడ తీరం నుండి హోప్ ఐల్యాండ్ మధ్య ఉండే ప్రాంతాన్ని కాకినాడ బే అని పిలుస్తారు.
కోరంగి అభయారణ్యం..
కాకినాడ పట్టణం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కోరంగి అభయారణ్యం ఉంది. ఈ కోరంగి అభయారణ్యం ఉప్పెనల నుంచి కాకినాడ తీర ప్రాంతాన్ని కాపాడడానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతోంది. ఇక్కడి అడవి ప్రాంతాన్ని 1998లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ అడవి ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, చెక్క వంతెనలు, పార్కులు, బోటు షికారు వంటివి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ప్రాంత సందర్శనలో మనం అనేక జంతు జీవ జలాన్ని, పక్షి జాతులను చూడవచ్చు. కాకినాడలో తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది.
రావణబ్రహ్మ గుడి..
కాకినాడకు అనిసమీపంలో ఉన్న ఉప్పాడ తీరప్రాంతంలో మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ దేవాలయాన్ని రావణబ్రహ్మ గుడి అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రావణుడికి పూజలు జరిగే ఏకైక ప్రదేశంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ దేవస్థానంతో పాటు పాదగయ క్షేత్రం, కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, బిక్కవోలు దేవాలయం ఇలా ఎన్నో దేవాలయాలు ఇక్కడి చుట్టుపక్కల చూడవచ్చు.