పర్యాటక ప్రదేశం : పిల్లలమర్రి
జిల్లా : మహబూబ్ నగర్ (పాలమూరు జిల్లా)
రాష్ట్రం : తెలంగాణ
ప్రధాన ఆకర్షణ : 700 సంవత్సరాల క్రితం నాటి మహా వృక్షం - మర్రి చెట్టు
మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు.
సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.

మహా వృక్షం
పిల్లలమర్రి లో మహా మర్రివృక్షం కనిపిస్తుంది. కనీసం 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది. చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి సుమా! సందర్శించు సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
చిత్రకృప : C.Chandra Kanth Rao

అద్భుత అనుభవం
పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్భుత అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిని తప్పక చూడాలి. పిల్లల మర్రి నీడలో దర్జాగా వెయ్యిమంది కూర్చోవచ్చునన్నది నిజంగానే నిజమైన నమ్మలేని నిజం.
చిత్రకృప : Kishore Mannadi

మూడెకరాల్లో
ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది.
చిత్రకృప : Kishore Mannadi

సౌకర్యాలు
పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియం ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి. పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్, అక్వేరియం చూపురులకు ఆకట్టుకొంటున్నాయి.
చిత్రకృప : C.Chandra Kanth Rao

మ్యూజియం
పిల్లల మర్రి మ్యూజియంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను ఉంచారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి.
చిత్రకృప : C.Chandra Kanth Rao

ఆటస్థలం, జింకల పార్కు, మినీ జూ
విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. సమీపంలో రాజరాజేశ్వరి మాత ఆలయం దర్శించదగ్గది. వసతి సదుపాయాల కొరకు దగ్గరలోని మహబూబ్ నగర్ టౌన్ సూచించదగినది.
చిత్రకృప : C.Chandra Kanth Rao

పిల్లలమర్రి ఎలా చేరుకోవాలి ?
విమానాశ్రయం : పిల్లలమర్రి సమీపాన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో పిల్లలమర్రి చేరుకోవచ్చు.
రైలు మార్గం : పిల్లలమర్రి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కలదు. టాక్సీ లేదా ప్రభుత్వ బస్సులలో ఎక్కి పిల్లలమర్రి చెట్టు వద్దకు చేరుకోవచ్చు.
రోడ్డు/ బస్సు మార్గం : మహబూబ్ నగర్, హైదరాబాద్, జడ్చర్ల, నల్గొండ,సూర్యాపేట తదితర ప్రాంతాల నుండి పల్లెవెలుగు బస్సులు పిల్లల మర్రి కి వస్తుంటాయి.
ఎక్కడి నుండి ఎంత దూరం : హైదరాబాద్ - 99 KM, కర్నూలు - 130 KM, మహబూబ్ నగర్ - 5 KM, శ్రీశైలం - 181 KM
చిత్రకృప : C.Chandra Kanth Rao



Click it and Unblock the Notifications











