ప్రశాంతతకు చిహ్నం.. డ్రాగన్ ప్యాలెస్ బౌద్ధ ఆలయం!
డ్రాగన్ ప్యాలెస్ బౌద్ధ ఆలయం. దీనిని లోటస్ టెంపుల్ ఆఫ్ నాగ్పూర్ అని కూడా పిలుస్తారు. ఇది నాగ్పూర్లోని కాంప్టీలో ఉన్న బౌద్ధ ప్రార్థనా స్థలం. ఈ ఆలయం 1999లో జపాన్కు చెందిన ఓగావా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నిధులతో స్థాపించబడింది.
డ్రాగన్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఆలయ సముదాయంలో బుద్ధునికి సంబంధించిన చెక్కిన గంధపు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శాంతికి, ప్రశాంతతకు చిహ్నంగా డ్రాగన్ ప్యాలెస్ను భావిస్తారు. ధ్యానంలో భాగంగా నంగూ-మ్యో-హో-రెంగే-క్యో అనే శక్తివంతమైన మంత్రం శబ్ధ ప్రకంపనలు పరిసరాల్లో నిత్యం వినిపిస్తునే ఉంటాయి.
బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి
ఈ ఆలయం దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయ గోడలు ముదురు రంగులో ఉండి, మొత్తం నిర్మాణం తెల్ల పాలరాయితో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఒగావా సొసైటీకి చెందిన మేడమ్ నోరికో ఒగావా ఈ అందమైన నిర్మాణాన్ని రూపొందించడానికి అధికమొత్తంలో ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ ప్రాంగణం ఆధ్యాత్మిక చింతనతోపాటు ఒంపులు తిరగే భవన నిర్మాణ శైలి పర్యాటకుల చూపును తిప్పుకోనీయదు.
రంగురంగుల పువ్వులు, చక్కగా అలంకరించబడిన ఉద్యానవనాలు మరియు దేవాలయం మధ్యలో ఉన్న పచ్చని ప్రకృతి దృశ్యం సందర్శకుల మనసును ప్రశాంతపు విడిది కేంద్రంలో విశ్రాంతినిచ్చే అనుభూతిని అందిస్తుంది. ఏటా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తుల ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇదోక ఆధ్యాత్మిక ప్రపంచ ప్రయాణానికి మూలబిందువుగా పేరుగాంచిందనే చెప్పాలి.
ఇండో-జపనీస్ స్నేహానికి చిహ్నం
ఈ ప్రదేశం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, తోటలు డ్రాగన్ ప్యాలెస్కు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఇది అద్భుతమైన ఇండో-జపనీస్ స్నేహానికి చిహ్నంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయంలోని రెండో అంతస్తులో శ్రీగంధపు చెక్కతో చేసిన భారీ విగ్రహం సజీవ ఆకృతిని గుర్తుచేస్తుంది. ఆ మోమును కనులారా వీక్షించినవారు ఎవ్వరైనా ఒత్తిడిని జయించి, మానసిక ఉల్లాసాన్ని పొందకమానరు.
ఈ కారణంగానే ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులను మరియు పర్యాటకులు దీనిని సందర్శిస్తారని స్థానికులు చెబుతుంటారు. అంతేకాదు, కాంప్టీలోని ఈ డ్రాగన్ ప్యాలెస్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యుత్తమ కాంక్రీట్ నిర్మాణంగా అంతర్జాతీయ అవార్డును కూడా పొందింది. ఈ ఆలయానికి ఎలాంటి ప్రవేశ రుసుమూ ఉండదు. ప్రతి రోజూ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ పర్యాటకుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. ఇక్కడికి సమీపంలో అనేక చారిత్రక పర్యాటక ప్రదేశాలను చూసేందుకు అవకాశం ఉంటుంది.
డ్రాగన్ ప్యాలెస్కు ఎలా చేరుకోవాలి
రోడ్డు మార్గం :- కాంప్టీ, నాగ్పూర్ మరియు ముంబయికి బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడ నుండి టాక్సీలు మరియు బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.
బస్సు ద్వారా :- డ్రాగన్ ప్యాలెస్ టెంపుల్, డ్రాగన్ ప్యాలెస్ టెంపుల్ బస్ స్టేషన్కు అతి సమీపంలో ఉంది. అక్కడి నుంచి కేవలం పది నిమిషాల నడక దూరం ఉంటుంది.
మెట్రో ద్వారా :- డ్రాగన్ ప్యాలెస్ టెంపుల్ సమీపంలోని ఆటోమేటివ్ స్క్వేర్ మెట్రో స్టేషన్ ఇక్కడకు చేరుకునేందుకు అనువుగా ఉంటుంది.