Search
  • Follow NativePlanet
Share
» »ఆధ్యాత్మిక‌త‌కు నిలువెత్తు సాక్ష్యం.. పాన‌కాల స్వామి ఆల‌యం!

ఆధ్యాత్మిక‌త‌కు నిలువెత్తు సాక్ష్యం.. పాన‌కాల స్వామి ఆల‌యం!

ఆధ్యాత్మిక‌త‌కు నిలువెత్తు సాక్ష్యం.. పాన‌కాల స్వామి ఆల‌యం!

భార‌త‌దేశం హిందువులు కొలిచే దేవాలయాలకు చిరునామా. ఇక్క‌డి ప్ర‌తి ఆలయానికి ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంటుంది. అలాంటి అపురూప నిర్మాణ‌మే గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరిలో ఉన్న‌ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్క‌డవేసే ప్ర‌తి అడుగులోనూ కొత్త‌ద‌నం క‌నిపిస్తుంద‌ని చాలామంది విశ్వ‌సిస్తారు.

మంగ‌ళ‌గిరిలో వెల‌సిన‌ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. నిజానికి, ఈ ఆల‌యాన్ని రెండు దేవాలయాలుగా ప‌రిగ‌ణిస్తారు. కొండ కింద ఉన్నది లక్ష్మీనరసింహ స్వామి అని, కొండ పైన ఉన్నది పానకాల స్వామి అని అంటారు. అంతేకాదు, కొండ పైన ఆలయంలో విగ్రహమేమీ ఉండదు. కేవలం తెరుచుకున్న నోరు ఆకారంలో ఓ రంధ్రం ఉంటుంది. దానినే పానకాల స్వామిగా ప్రజల భావిస్తారు. ఈ ఆల‌యానికి ఒక ప్రత్యేకత ఉంది.

పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతార‌ని భక్తులు విశ్వాసం. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే లోప‌ల‌కు వెలుతుంది. నైవేధ్యంగా ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తున్నారు. పానకం తయారీ సందర్భంగా ఎంతగా ఒలికిపోయిన ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించిన‌ప్పుడు.. యుగాంతానికి సూచ‌న‌గా.. పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.

Panakala Swami Temple

అత్యంత ఎత్త‌యిన గాలిగోపురం

రెండు శ‌తాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన ఆల‌య‌ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా పేరుగాంచింది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు.

ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. కొత్త గాలి గోపురం అదే రీతిలో ఉంటుంది. ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులో, 4 పర్షియన్‌లోను వ్రాసి ఉన్నాయి.

అరెక‌రం వైశాల్యంలో క‌ల్యాణ పుష్క‌రిణి..

మంగళగిరి మధ్యలో సుమారు అర ​​ఎకరం వైశాల్యంలో ఓ పురాత‌న కోనేరు ఉంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవిగా చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు.

19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల ప్రదర్శన దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజల కోనేటి నీటితో దేవునికి అభిషేకం నిర్వహించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు. ఇటీవ‌ల కాలంలో కోనేరు పునఃనిర్మాణం కోసం ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఈ చారిత్రక ఆల‌యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X