అలలపై తేలియాడుతూ.. విహారయాత్ర చేసేందుకు విశాఖ తీరం సిద్ధమైంది. వైజాగ్ పోర్టు నుంచి ఓ సరికొత్త విలాసవంతమైన ఓడ వందలమంది ఔత్సాహికులతో ఈ రోజే తన మొదటి ప్రయాణం మొదలుపెట్టబోతోంది. విశాఖ నుంచి చెన్త్నె, పాండిచ్చేరిలకు కార్డేలియా క్రూయిజ్ నౌక రెడీ అయ్యింది. నీలి వర్ణంలో ఉండే సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి స్వాగతం చెబుతోంది. తొలి సర్వీస్ ఇక్కడ నుంచి మొదలవుతుంది.
ఈ విలాసవంతమైన నౌక వైజాగ్ నుంచి పుదుచ్చేరి, చెన్న్తె మీదుగా తిరిగి వైజాగ్ చేరుకుంటుంది. ఇది విదేశీ విహార నౌక అయినా దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే కేవలం భారత్లో మాత్రమే తిరిగేలా నిర్వహకులు అనుమతులు పొందారు. ఈ కారణంగా షిప్ ఎక్కాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు. కస్టమ్స్ తనిఖీలు ఉండవు. గతంలో వైజాగ్కు ఒకట్రెండు క్రూయిజ్ షిప్లు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లాయి. అవేవీ రెగ్యులర్ సర్వీసులు కావు. కానీ ఎంప్రెస్ మాత్రం ప్రస్తుతం రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. డిమాండ్ను బట్టి సర్వీసులు కొనసాగించాలా వద్దా అన్నది ఆలోచిస్తారు.
ఆధునిక హంగులతో సరికొత్తగా...
ఈ నౌక ఆధునిక హంగులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం 11 అంతస్తులున్న ఈ భారీ నౌకలో ఒకేసారి 1,840 మంది ప్రయాణించవచ్చు.ఇందులో ఫుడ్కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా సెలూన్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. థియేటర్, నైట్క్లబ్, స్విమ్మింగ్ ఫూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డిజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బాండ్, అడ్వంచెర్ యాక్టివిటిస్, షాపింగ్ మాల్స్, లైవ్షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్నందరికీ షిప్లోని క్యాసినోవరల్డ్కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి.
ఇందులో ప్రయాణించే పర్యాటకులకు వివిధ సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు ఎంచుకునే సర్వీసు, ప్యాకేజీల ప్రకారం చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ - చెన్త్నె టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీలో ముగ్గురు ప్రయాణించాలంటే మొదటి ఇద్దరికీ ఒకే విధమైన టికెట్ ధర ఉంటుంది. మూడో వ్యక్తికి కాస్త తగ్గుతుంది. జిఎస్టి అదనంగా వసూలు చేస్తారు. ఈ క్రూయిజ్లో 796 క్యాబిన్లున్నాయి. 313 ఇన్సైడ్ స్టేట్ రూమ్స్,414 ఓషన్ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్ రూమ్లతో పాటు ఒక లగ్జరీ సూట్ రూమ్ ఉంటుంది.
ప్యాకేజీని బట్టీ ఛార్జీలు
విశాఖ నుంచి చెన్నైకు ఇన్సైడ్ స్టేట్ రూం క్యాబిన్ అయితే మొదటి వ్యక్తికి 24 వేల 532 రూపాయలు, రెండో వ్యక్తికి అదే రేటు ఉంటుంది. కానీ మూడో వ్యక్తికి అయితే 24 వేల532 రూపాయలు. పిల్లలకు 8 వేల 732 రూపాయల ధరను నిర్ణయించారు. అంటే ఇద్దరు పెద్దలు ప్రయాణించాలంటే 48వేల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇక ఓషన్ వ్యూ రూమ్ అంటే మొదటి ఇద్దరి వ్యక్తులకు 30 వేల 423 రూపాయలు. పిల్లలకు 8వేల 723 రూపాయలు. మొత్తంగా 60వేలు. ఇక మినీ సూట్ అయతే మొదటి ఇద్దరికి 53 వేల 700 రూపాయలు. మూడో వ్యక్తికి 30 వేల 530 రూపాయలు. పిల్లలకు 8వేల 723 రూపాయలు. అంటే పెద్దలిద్దరికీ మినీ సూట్ లక్షరూపాయల పైనే అవుతుంది.
నేటి నుంచే మొదలు...
వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతో ఈ రోజే ఎంప్రెస్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. నౌకలో వచ్చిన వారికి నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను చూపిస్తారు. ఇదే రోజు రాత్రి 8 గంటలకు కొత్త పర్యాటకులతో విశాఖ పోర్టునుంచి బయల్దేరుతుంది. జూన్ 10వ తేది రాత్రి 7 గంటలకు బయల్దేరి 12వ తేదీన చెన్నైకి చేరుకుంటుంది. ఇక 13వ తేది ఉదయం చెన్నైలో బయల్దేరి 15వ తేదీన తిరిగి విశాఖ చేరుకుంటుంది. మళ్లీ 15వ తేదీన విశాఖ నుంచి బయల్దేరుతుంది. అదే విధంగా 22వ తేదీన కూడా విశాఖ నుంచి సర్వీసు నడిపేలా టూర్ ఫ్లాన్ సిద్ధం చేశారు. విశాఖ నుంచి చెన్నై వరకు ఒకవైపు టిక్కెట్ ఇస్తారు. చెన్నై నుంచి నౌకలోనే తిరిగి రావాలనుకునేవారికి అదనపు చార్జీలు వసూలు చేస్తారు.