విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు!
ఈ రోజుల్లో విహార ప్రదేశాలలో విడిది చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఎందుకంటే, ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్తోనే ఆలోచిస్తున్నారు. సందర్శకులకు విడిది కేంద్రాలు అందుబాటులో ఉంచుతూనే ప్రశాంతతను దూరం చేసేస్తున్నారు.
ఒకేసారి ఎంత మంది వచ్చినా విడిదిని అందించేలా వ్యాపారులు ఏర్పాట్లు చేసేస్తారు. మరి పర్యాటక ప్రదేశాలలో ప్రశాంతతను కోరుకునేవారు విడిది కేంద్రాల్లో ఎదురయ్యే గందరగోళాన్ని ఎలా తట్టుకోగలరు చెప్పండి. అందుకే, ప్రశాంతతను కోరుకునే ప్రకృతి ప్రేమికులు విడిది చేసేందుకు అనువైన కొన్ని విడిది కేంద్రాలను పలకరిద్దాం.
ఖేమ్ విల్లాస్..
జైపూర్కు సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేమ్ విల్లాస్ సందర్శకులకు ప్రత్యేక విడిది కేంద్రమనే చెప్పాలి. ఇక్కడ మొత్తం, ఎనిమిది కాటేజ్లు, ఏడు టెంట్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ విల్లాలో నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుగా ప్రకృతి అందాలు తారసపడతాయి. పులులకు ఆలవాలమైన రాంతాంబర్ చూడొచ్చు. ఇక్కడి అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుంటే చెంగుచెంగున ఎగిరే కృష్ణజింకలు, దుప్పులు మనల్ని మనసారా పలుకరించే అనుభూతులు కలుగుతాయి. అంతేకాదు, ఒంటెల మీద స్వారీ చేయవచ్చు. చంబల్ నదీ చిరు సవ్వడితో పాటు చిన్ని చిన్ని గువ్వలు చేసే రాగాలను వినవచ్చు. ఉదయించే సూర్యుణ్ని వీక్షించవచ్చు.
వైల్డర్నెట్స్, గోవా..
చొర్లా కనుమల మధ్య నిర్జన ప్రదేశంలో ఉండే ఈ గూడు అడవి జంతువులకు ఆలవాలం. గోవా, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆనుకుని ఉండటం వల్ల ఈ మూడు రాష్ట్రాల పర్యాటకులు విరివిగా వస్తుంటారు. ప్రకృతి ప్రేమికుడు కెప్టెన్ నితిన్ ధోండ్, ఆతని టీమ్ కలిసి 450 ఎకరాల విస్తీర్ణంలో చెక్కతో ఈ రిసార్ట్ను నిర్మించారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. సోలార్ ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదాన్ని అందించే రమణీయ ప్రాంతం కావటంతో కెప్టెన్ ధోండ్ 450 ఎకరాలు కొనుగోలు చేసి మరీ దీనిని నిర్మించారు. అంతేకాదు, రిసార్ట్ చుట్టూ 30 వేల చెట్లను నాటించారు. చక్కటి భోజనంతో పాటు అక్కడే దొరికే హుర్రాక్ అనే పానీయాన్ని కూడా వడ్డిస్తారు. వీటితో కలిపి రోజుకు సుమారు రూ.6000లు వరకూ వసూలు చేస్తారు.
వైల్డ్ మహసీర్, అస్సాం..
చుట్టూ టీ తోటలు. పక్కనే ప్రవహించే బ్రహ్మపుత్ర నదీ సవ్వడులు. టీ తోటల అందాలు చూడటానికి ఎక్కడో లాడ్జీలోనో, హోటల్లోనో దిగటం ఎందుకు? ఎంచక్కా ఈ వైల్డ్ మహసీర్ రిసార్ట్ ఆహ్వానం
పలుకుతోంది. బ్రహ్మపుత్ర నది అందాలు చూడాలంటే ఇక్కడ విడిది చేయాల్సిందే. అంతేకాదు, డాల్ఫిన్స్ విన్యాసాలను కనులారా వీక్షించవచ్చు. ఉదయమే జీప్లో కజిరంగా నేషనల్ పార్క్ను సందర్శించుకోవచ్చు. ఈ రిసార్ట్ను ఆనుకుని ఓ గిరిజన గూడెం కూడా ఉంది. ఆహ్లాదాన్ని అందించే వరండాలు, టెన్నిస్, గోల్ఫ్ క్లబ్ కూడా ఉన్నాయి. ఇక్కడ అస్సామీ, ఆంగ్లో-ఇండియన్ వంటకాలను వడ్డిస్తారు.
శ్యామ్ - ఈ శారద్ విలేజ్ రిసార్ట్ : గుజరాత్
రాష్ట్రంలోని హోడ్కా గ్రామస్తులు నిర్వహించే ఈ రిసార్ట్ స్థానిక సంప్రదాయ రుచులతో నోరూరించే వంటకాలతో ఆహ్వానం పలుకుతుంది. మట్టిని నమ్మే గ్రామస్తులు ఈ రిసార్ట్కు మట్టితో వేసిన విభిన్న రంగులు ఎంతగానో ఆకర్షిస్తాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానికులు నిర్వహించే ఈ రిసార్ట్లో బస చేస్తే దాదాపు మూడు వేల రకాల పక్షులను చూడవచ్చు. మరొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ రిసార్ట్లో టీవీ ఉండదు. వసతి ఖర్చు చాలా చౌక. రూ.3,200 నుంచి రూ.5,000ల వరకు మాత్రమే ఉంటుంది.