పర్యాటకులకు గుడ్ న్యూన్.. తగ్గనున్న భారత్ గౌరవ్ టికెట్ ధరలు
మన దేశంలో రైల్ నెట్వర్క్తో మనకు విడదీయలేని అనుబంధం ఉందనే చెప్పాలి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయదలచే ప్రయాణీకుల మొదటి ఎంపిక ఈ రైలు మార్గమే. అందుకు అనుగుణంగా ఓవైపు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ గతంలోనే ప్రత్యేకంగా భారత్ గౌరవ్ (Bharat Gaurav) పేరుతో పర్యాటక రైళ్లను రూపొందించింది. మొదట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ రైళ్లకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆధరణ కరువైంది. అందుకు గల కారణాలను విశ్లేషించిన ఐఆర్సీటీసీ (IRCTC) సమస్యను పరిష్కరించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఈ రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారత్ గౌరవ్ రైలు ప్రయాణం ద్వారా మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ జర్నీకి థర్డ్ ఏసీ క్లాస్ టికెట్ ధర రూ. 62వేలుగా ఉంది. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో గతేడాది ఈ భారత్ గౌరవ్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలపైకి తెచ్చింది. రామాయణ్ సర్క్యూట్ కింద ఢిల్లీలోని సర్దార్జోంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, పలు చారిత్రక ప్రదేశాలను చుట్టుముట్టి చివరకు నేపాల్కు చేరుకుంటుంది. మొదట్లో ఈ రైలుకు మంచి డిమాండే లభించినప్పటికీ.. నెమ్మదిగా రద్దీ తగ్గింది. సుమారు 15ఏళ్ల క్రితం నాటి ఐసీఎఫ్ కోచ్ల కారణంగా ఇందులో ప్రయాణించేవారు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారన్న విమర్శలతోపాటు టికెట్ ధర అధికంగా ఉండడంతో ఈ రైలు ప్రయాణంపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది.

దీనిపై త్వరలోనే ప్రకటన..
ఇప్పటికే పలువురు ప్రయాణీకులు తమ సమస్యలను రైళ్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టికెట్ ధరలను తగ్గించాలని ఐఆర్సిటీసీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్ ధరలు తగ్గించేందుకు అనుమతి లభించిందని, త్వరలోనే దీనిపై ఐఆర్సిటీసీ తుది నిర్ణయం తీసుకుంటుందట. దీంతో ఈ టికెట్ల ధరను కనీసం 20-30 శాతం తగ్గించే అవకాశాలున్నాయి. అధికారిక నిర్ణయం తర్వాత టూర్ ఆపరేటర్ దీనిపై ప్రకటన చేయనున్నట్లు సదరు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

భారత్ దర్శన్కు మంచి డిమాండ్..
అంతేకాదు, తొలుత భారతీయ సాంస్కృతిని ప్రతిబింభించేలా భారత్ గౌరవ్ కింద రామాయణ్ సర్క్యూట్తో పాటు మరో రెండు టూర్ ప్యాకేజీ సర్వీసులను కూడా నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ ఏడాది నవంబరులో భారత్ గౌరవ్ శ్రీ జగన్నాథ్ యాత్ర రైల్ టూర్కు సన్నాహాలు చేసింది. దీంతో పాటు రామాయణ్ సర్క్యూట్లోని రెండో సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే డిమాండ్ లేకపోవడంతో ఐఆర్సిటీసీ తమ నిర్ణయాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, ఇటీవల కాలంలో పర్యాటకం కోసం ప్రత్యేకంగా భారత్ దర్శన్ పేరుతో రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్కు ఒక్కో రోజు టికెట్ ధర రూ. 900, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.1500 మాత్రమే ఉండేలా ప్రవేశపెట్టారు. అంటే ఈ రైలు ప్రయాణానికి 18 రోజులకు రూ.27 వేల అవుతుంది. దీంతో ప్రయాణికులు భారత్ దర్శన్ రైళ్లకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని సమాచారం.



Click it and Unblock the Notifications











