ఉవ్వెత్తున ఎగసిపడే అలలపై ప్రయాణం. దారిపొడవునా చారిత్రక విశేషాల సమ్మేళనం. నాలుగు దిక్కులూ నేలను కప్పేసే ఉప్పునీటి సవ్వడుల ఆహ్వానం. ప్రకృతి ప్రసాదించిన సుందర ప్రదేశమే మా గమ్యస్థానం. అదే అరుదైన జీవరాశుల ఆవాసంగా ప్రకృతి గీసిన దృశ్యకావ్యం హోప్ ఐలాండ్. మా జీవితంలో మొదటిసారి అలలకు ఎదురీదుతూ సాగిన హోప్ ఐలాండ్ బోటు ప్రయాణపు అనుభవాలే ఈ వారం 'జర్నీ'
ఆవాసం.. హోప్ ఐలాండ్!
కొత్త ప్రదేశాలు చూడటమంటే మా బృందానికి చాలా ఇష్టం. అందుకే, సముద్రం కెరటాలపై ప్రయాణం చేసి, ఓ దీవిలో అడుగుపెడితే ఎలా ఉంటుందని హోప్ ఐలాండ్ను ఎంపిక చేశాం. ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకునే మార్గం గురించి మా స్నేహితులను అడిగి తెలుసుకున్నాం. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని చెప్పారు. మేం అడిగిన రోజులో సీట్లు ఖాళీలేవని, మరుసటి రోజు ఖాళీ ఉన్నాయని చెప్పడంతో ఆ రోజు ప్రయాణం పెట్టుకున్నాం. రాజమండ్రి నుంచి ఐలాండ్ చేరాలంటే 96 కిలోమీటర్లు ప్రయాణించాలి.
హోప్
అసలు ఐలాండ్ అంటే ఏంటి? అక్కడ చూడడానికి ఏముంటాయి? అనే ఆలోచనలు ప్రయాణ సమయంలో ఎక్కువ అయ్యాయి. మనదేశానికి తూర్పుతీరాన ఉన్న బంగాళాఖాతంలో సముద్రంలో కొలువుదీరింది హోప్ ఐలాండ్. ఇది కాకినాడలో రెండు శతాబ్దాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది. గోదావరి నదీపాయల్లో యానాం సమీపంలో ఒక పాయ కలుస్తుంది. మరో పాయ కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి మడ అడవుల్లోంచి సముద్రంలోకి వెళ్తుంది. ఈ నదీపాయ నుంచి కొట్టుకొచ్చిన మట్టి, కాకినాడకు వెయ్యి నాటికల్ మైళ్లలో దిబ్బగా ఏర్పడింది. అలా కాలక్రమంలో కొన్నేళ్లకు ఏర్పడిన దీవే హోం ఐలాండ్. ఇది సముద్రంలో ఏర్పడిన ఒక అద్భుతం. ఇది కాకినాడ నగరానికి రక్షణ కవచంలా మారింది. తుపాన్లు నుంచి కాకినాడను కాపాడుతోంది. ఈ దీవి 16 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 500 మీటర్ల వెడల్పు ఉంటుంది. 2,500 ఎకరాల్లో ఈ దీవి విస్తరించింది. ఈ దీవిలో మడ ఫారెస్టు ఎక్కువుగా ఉంది. అందుకే దీనిని వైల్డ్ లైఫ్ ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ దీవిలో అరుదైన వనాలు, అద్భుతమైన జీవరాశులు ఉన్నాయి.
లైఫ్ జాకెట్
మాటల్లోనే స్టేషన్ వచ్చేసింది. అక్కడకి చేరుకునే సరికి 7.30 అయ్యింది. అప్పటికే మా కోసం స్నేహితులు స్టేషన్లో ఎదురు చూస్తున్నారు. 'తొమ్మిది గంటలకల్లా మనం బోటు దగ్గర ఉండాలి' అంటూ కారు డోర్ తీసి ఎక్కమన్నారు. అక్కడి నుంచి భీమాస్ హోటల్ కి తీసుకెళ్లారు. అక్కడ టిఫెన్ చాలా రుచిగా ఉంది. తినేసిన తర్వాత ఐలాండ్లో తినేందుకు ఏం దొరకవని మావాళ్లు చెప్పడంతో వాటర్ బాటిల్స్, స్నాక్స్ తీసుకున్నాం. పోర్టు వద్దకు వెళ్లడానికి 20 నిమిషాలు పట్టింది. అక్కడ బోటు డ్రైవర్, ఇంకో సహాయకుడు. కనిపించారు. "ఇంకా చాలామంది రావాలి. వారందరికీ ఫోన్లు. చేస్తున్నా' అంటూ సహాయకుడు చెప్పాడు. ఇంతలో చుట్టూ ఉన్న ఆహ్లాదమైన వాతావరణం, చల్ల గాలి చుమ్మల్ని ప్రేమగా పలకరించింది. ఎదురుగా ఉన్న సముద్రాన్ని ఆస్వాదిస్తూ... అక్కడే ఉన్న షిప్లను చూస్తూ సెల్ఫీలకు ఫోజులిచ్చాం. బోటు దగ్గరకు వెళ్లేసరికి అందరూ వచ్చేశారు. అక్కడున్న సహాయకుడు బోటు ఎక్కుతున్న మహిళలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సాయం చేయడంతోపాటు, కొన్ని నిబంధనలు చెప్పాడు. దీవికి వెళ్లిన వెంటనే ఎవరూ సముద్రంలోకి దిగకూడదు. అక్కడ ఊబులు ఉన్నాయి' అంటూ హెచ్చరించాడు. అందరికీ లైఫ్ జాకెట్లు ఇస్తూ టికెట్లు కొట్టాడు. ఎవరు వేసుకోకపోయినా ఊరుకోలేదు. ట్యాక్స్ సహా మనిషికి రూ.230 వసూలు చేశారు. బోటులో 38 వరకు ఎక్కే అవకాశముంది. ఆ రోజు బోటులో 36 మందిమే ఉన్నాం. లైఫ్. జాకెట్లతో పాటు, లైఫ్బోయల్ కూడా ఉన్నాయి. ఒక వేళ ప్రమాదం ఏమైనా జరిగినా, దీవిలో చిక్కుకుపోయినా 40 మందికి మూడు నెలల పాటు తినే స్నాన్న నిల్వచేసి, దానిలో ఉంచారు. ప్రయాణికుల సెఫ్టీ కోసం ఎపి టూరిజం వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరిన్ని మా ప్రయాణపు ముచ్చట్లు రెండో భాగం విందాం!!