దేశంలోనే అతి పెద్ద ఆలయమైన శ్రీరంగనాథస్వామి ఆలయ విశేషాలు
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది శ్రీరంగనాథస్వామి ఆలయం. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ నిర్మాణ శైలిని చూసినవారెవ్వరైనా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. సందర్శకుల మనసుదోచే ఈ రాతి నిర్మాణ చరిత్రకారులను సైతం అబ్బురపరిచింది.
తమిళ నెల మార్గళి(డిసెంబరు నుంచి జనవరి)లో 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంధంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు.
ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. కావేరి - కొల్లిదం (కావేరి ఉపనది) నదుల మధ్య శ్రీరంగం ఉంది. ప్రసిద్ధ శివ, విష్ణ్వాలయాలు ఉండడం వల్ల ఇది హిందువులకు ప్రధాన పర్యాటక ప్రాంతంగా నిలిచింది. నిజానికి శ్రీరంగంలో విష్ణ్వారాధకులైన శ్రీవైష్ణవుల జనాభా ఎక్కువ.
అంతేకాదు, ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. దక్షిణ భారతదేశంలో పురాతనమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది.
ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్థులు ఉన్నాయి. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కంబోడియాలోని అంగ్కోర్ వాట్లో ఉప్పటికీ, ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది.
ఆలయ నిర్మాణం ఓ అధ్బుతమే..
విష్ణు భగవానుని ఎనిమిది దేవాలయాల్లో మొదటి ఆలయం కలిగి ఉండడం శ్రీరంగం ప్రత్యేకత. హిందూ పురాణాల ప్రకారం ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలే. ఈ ఆలయానికి ఏడు ప్రాంగణాలు ఉంటాయి. ప్రాకారాలుగా స్థానికంగా పిలిచే వీటి గుండా భక్తులు నడుచుకుంటూ లోపలి వెళ్తారు. ఈ ప్రాకారాలు కూడా ప్రధాన ఆలయం చుట్టూ వృత్తాకారంలో నిర్మించిన దట్టమైన పెద్ద గోడలుగా ఉంటాయి.
ఈ ప్రాకారాల్లో 21 పెద్ద శిఖరాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాకారాలతో ఉన్న ఈ ఆలయం నిర్మాణ పరంగా ఒక అధ్బుతమే. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
దేవాలయల సందర్శకు కొదవేలేదు..
శ్రీరంగంలో మరో మూడు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. వీటిని కూడా కావేరి నది ఒడ్డున నిర్మించారు. అవి శ్రీరంగపట్నంలోని ఆది రంగ దేవాలయం, శివనసముద్రంలోని మధ్య రంగ దేవాలయం, శ్రీరంగంలోని అంత్య రంగ దేవాలయం.
ఈ మూడు దేవాలయాలు కూడా రంగనాథుని ప్రధాన ఆలయాలుగా పరిగణిస్తారు. రాక్ ఫోర్ట్ దేవాలయం, తిరువానై కోవిల్, ఉరైయూర్ వెక్కలి అమ్మన్ దేవాలయం, సమయపురం మరియంమన్ దేవాలయం, కుమారా వైయలూర్ దేవాలయం, కాటాళగియా సింగర్ దేవాలయం లాంటి ప్రసిద్ధ దేవాలయాలు ఇక్కడి చుట్టుపక్కల సందర్శించవచ్చు.