వినాయకుని గ్రామమా ? అనేగా మీ డౌట్. నిజమేనండీ పిళ్ళైయార్ పట్టి వినాయకుని గ్రామమే. తమిళ్ లో పిళ్ళైయార్ అంటే వినాయకుడు అని, పట్టి అంటే గ్రామం అని అర్థం. తమిళనాడు లో శివునికి, ఆయన భార్యకు మరియు కుమారులకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తమిళనాడు మొత్తం మీద ఉన్న వినాయకుని దేవాలయాలలో ఇదొక్కటే అతి ముఖ్యమైనది, ప్రముఖమైనది.
ఎక్కడ ఉంది ?
తమిళనాడు లోని శివగంగ జిల్లాలో తిరుప్పత్తుర్ తాలూకాలో పిళ్ళైయార్ పట్టి అనే గ్రామం కలదు. ఇది పుదుకొట్టై, కారైకుడి మధ్యన ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కర్పక వినాయకర్ ఆలయం కలదు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయక ఆలయాలలో ఇది మొదటిది.
పిళ్ళైయార్ పట్టి ఆలయం
చిత్రకృప : Sai DHananjayan Babu
పిళ్ళైయార్ ఆలయం ఒక పురాతన ఆలయం. రాతిశిలల తొలిచి అద్భుత గుహాలయంగా మార్చి వినాయకునికి అంకితం చేశారు. ఈ గుహాలయంలో శివుడు మరియు ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కలవు. ఆలయానికి ఉపయోగించిన రాళ్ళను, ఆగమ శాస్త్రాన్ని కలిపి పరిశీలిస్తే .. ఈ దేవాలయం క్రీ.శ. 1091 - 1238 మధ్య నిర్మించినట్లు తెలుస్తున్నది.
చెట్టినాడ్ - 'చెట్టియార్ల పట్టణం' !
శ్రీ కర్పక వినాయగర్
గుహాలయంలో వినాయకుని రాతి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో అలరిస్తుంది. గుడి ముందు కోనేరు, గుడిలో వినాయకుని విగ్రహం తప్పక చూడాలి. ఆలయ సన్నిధిలో ఆయిల్ దీపాలు నిత్యం వెలుగుతూ గర్భగుడి లోపల కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. గుడిలో వినాయకుడి విగ్రహం బంగారు ఆభరణాలతో కవర్ చేయబడి ఉంటుంది. అభిషేకం, పవిత్ర స్నానం చేసిన తర్వాతనే భగవంతున్ని పూర్తిగా దర్శించవచ్చు (ఆభరణాలు లేకుండా).
బంగారు ఆభరణాలలో వినాయకుడు
గుడిలో వింత
గుడి ఆవరణ చాలా విశాలంగా భక్తిని పెంపొందించేలా ఉంటుంది. ప్రాంగణంలోని ఏనుగు ఆశీస్సులు తప్పక తీసుకోవాలి. ఆలయ గోడ పై ఉన్న వినాయకుని చిత్రాన్ని ఎటుపక్క నుండి చూసినా మనవైపే చూడటం ఆశ్చర్యం కలిగించే విషయం.
రంగులు మారే కేరళపురం వినాయగర్ ఆలయం !
ఆలయ వేళలు
పిళ్ళైయార్ పట్టి వినాయక దేవాలయాన్ని ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరుస్తారు మరళా సాయంత్రం నాలుగున్నర గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తులను అనుమతిస్తారు.
ఊరేగింపు
చిత్రకృప : Sundaram Ramaswamy
ఉత్సవాలు
వినాయ చతుర్థి / వినాయ చవితి పండుగ ను ప్రతి ఏటా ఆగస్టు - సెప్టెంబర్ మాసాలలో క్రమం తప్పకుండా పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో జరిగే వేడుకలను చూడటానికి చుట్టుపక్క ప్రాంతాల నుంచే కాక, తమిళనాడు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు.
గుడి లోపల మూలవిరాట్టు అయిన వినాయకుని వాహనం మూషికం విగ్రహం ఉంటుంది. ఆలయాన్ని దర్శించే భక్తులు ఎవరూ దీనిని గమనించరు ఎందుకంటే ఇది ఒక మూలన ఉంటుంది. మూషికం చెవిలో భక్తులు తమ కోర్కెలను చెబితే అది వినాయకునికి చేరవేస్తుందని ప్రతీతి.
చిత్రకృప : Sundaram Ramaswamy
ఎలా చేరుకోవాలి ?
ఇక్కడకు వెళ్ళాలంటే పుదుకొట్టై లేదా మదురై ముందుగా చేరుకోవాలి. మదురై లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కలదు. పుదుకొట్టై లో కూడా రైల్వే స్టేషన్ కలదు. మదురై లేదా పుదుకొట్టై నుంచి వచ్చేవారు మదురై - పుదుకొట్టై రోడ్డు మార్గంలోని తిరుప్పత్తుర్ లో దిగి, అక్కడి నుండి కరైకుడి వెళ్లే ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులను ఎక్కాలి. కరైకుడి నుండి పిళ్ళైయార్ పట్టి 12 కి.మీ ల దూరంలో ఉంటుంది. పుదుకొట్టై నుండి గంటన్నర ప్రయాణంలో పిళ్ళైయార్ పట్టి చేరుకోవచ్చు.
వెయ్యేండ్ల ఆ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు !
పిళ్ళైయార్ పట్టి గ్రామానికి సమీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కండ్రకుడి ఉంది. ఇది పిళ్ళైయార్ పట్టి కి 5 కి. మీ ల దూరంలో కలదు. పిళ్ళైయార్ పట్టి వినాయకుని గ్రామం కాగా, కండ్రకుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రామం గా చెబుతారు స్థానికులు.