కృష్ణానదిలో పుణ్యసాన్నాలు ఆచరించడం..అమరేశ్వరుని దర్శనం 'మోక్షదాయకం అన్నారు మన పెద్దలు. మన తెలుగు గడ్డపై ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వరసామి ఆలయం కృష్ణానది ఒడ్డున, గుంటూరు జిల్లాలో కొన్ని వందల ఏళ్లుగా పూజలందుకుంటున్నది. అమరగిరిలో వెలసిన బాలా చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారిని దర్శించి తరించడానికి భక్తజనం నిత్యం సందర్శిస్తుంటారు. శ్రీశైలంకు ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, బుషులు సేవించిన మహిమగల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
అమరావతికి సమీపంలో అమరావతి మరియు విజయవాడ మార్గంలో 9కిలోమీటల్ల దూరంలో ఉన్న వైకుంటపుర క్షేత్రం దివ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్దికెక్కింది. ఈ క్షేత్రంలో కొండపైన గుహలో కొండకింద స్వయంభువుగా శ్రీ వేంటకటేశ్వరుడు వెలసి పూజలందుకుంటున్నాడు. అమరావతిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని కైలాసంగాను, వైకుంటపురాన్ని వైకుంఠంగాను భావించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అనేక మాన్యాలిచ్చి తమ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రంలో కృష్ణానది ఉత్తరంగా ప్రవహించి ఉత్తర వాహినిగా పేరుగాంచింది. పచ్చని ప్రక్రుతి నడుమ, కొండల మద్య కృష్ణమ్మ పరవళ్ళతో అనేక అందాలను సంతరించుకున్న ఈ క్షేత్రంలో సినిమా షూటింగ్ లకు కూడా ప్రసిద్ది.
తారకాసురుని వధ
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృతలింగాన్ని అపహరించి తన కంఠాన ధరించి మహా పరాక్రమవంతుడయ్యాడు. తర్వాత అతడి ఆగడాలు శ్రుతిమించి దేవేంద్రునికి తన పదవి పోతుందేమోననే భయం పట్టుకుంది. దాంతో పరమశివుణ్ణి ఆశ్రయించగా శివుడు తన కుమారుడైన కుమారస్వామిని సకల సైన్యంతో వెళ్ళి తారకాసురుణ్ణి వధించమని ఆదేశించాడు.
PC:Youtube
ఎన్ని అస్త్రాలు వేసినా తారకాసుడు చనిపోలేదు
అయితే ఎన్ని అస్త్రాలు వేసినా తారకాసుడు చనిపోలేదు. ఇందుకు కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే అని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృతలింగాన్ని ఛేదించగా అది అయిదు ముక్కలుగా ఐదు ప్రదేశాలలో పడింది. మొదటి భాగం పడిన ప్రదేశమే అమరారామం. మిగిలినవి కుమారారామం, ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం. అమరారామంలో పడిన ముక్కను దేవగురవైన బృహస్పతితో కలిసి వెతుక్కుంటూ వచ్చిన దేవేంద్రుడికి అప్పటికే అది లింగాకారం ధరించి దర్శనమిచ్చింది.
PC:Youtube
లింగం నెత్తిన చీల కొట్టి మారేడు దళాలతో
వెంటనే దేవేంద్రుడు దానిని ప్రతిష్టించగా రోజురోజుకూ తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోయింది. నువ్వు ఎంత పెరిగితే నేను అంత పెద్ద గుడిని కడతాను అని దేవేంద్రుడు మొదట బీరాలు పోయినా తర్వాత పెరుగుతున్న లింగాన్ని చూసి భయపడి శరణుకోరడంతో శివుడు తన పెంపుదలను చాలించాడని కథనం. పెరుగుతున్న పరిమాణాన్ని ఆపడానికి ఇంద్రుడు లింగం నెత్తిన చీల కొట్టి మారేడు దళాలతో పూజించాడని మరో కథనం.
PC:Youtube
ఏకశిలా రూపంగా 27 అడుగుల ఎత్తున మూడు అడుగుల కైవారం
ఇలా లింగానికి చీలకొట్టినప్పుడు మూడు ధారలుగా వచ్చిన జల, క్షీర, రక్త ధారలు లింగంపై వాటి చారలు ఇప్పటికీ ఉన్నాయని భక్తులు భావిస్తారు. ఏకశిలా రూపంగా 27 అడుగుల ఎత్తున మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.
PC:Youtube
కృష్ణానది ప్రవాహం
రాక్షస గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్త్ లో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు, అందుకు బృహస్పతి సమాధానమిస్తూ అమరేశ్వరుడు వెలిసిన ఈ క్షేత్రాన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ దాని వల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ కృష్ణమ్మ ఈ గిరి పక్క నుండే వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంది.
Photo Courtesy: Bhanutpt
ఆలయం వేళలు:
రోజూ ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. కార్తికమాసంలో ఉదయం 5.30గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాయంత్రం 4గంటల నుండి రాత్రి 8.30గంటల వరకు గుడిని తెరచి ఉంచుతారు. కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 వరకు ఆదివారాలలో ఉ.5నుండి రాత్రి 9 వరకు తెరచి ఉంచుతారు.
pc:RameshSharma
ఎలా చేరుకోవాలి?
ఈ అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడానికి సమీప స్థలం ఏదంటే అది గుంటూరు . ఇది గుంటూరు నుండి 40 కి.మీ.ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
Adityamadhav83