మన పురాణాలను అనుసరించి శివుడిని లయకారకుడిగి పేర్కొంటారు. అంటే మళ్లీ మళ్లీసృష్టి జరుగుతూ ఉండాలంటే ఏ వస్తువుకైనా, మరే జీవికైనా లయం అవసరం. ఆయా జన్మ బాధల నుంచి జీవులను విముక్తుల్ని చేయడమే ఆ పరమశివుడి ప్రథమ కర్తవ్యం. అందుకే శైవ క్షేత్రాలను మోక్ష ప్రదాయకాలుగా చెబుతారు. మన భారత దేశంలో ఆ గరళకంఠుడికి సంబంధించిన ఎన్నో పురాతాన ఆలయాలు ఉన్నాయి. అయితే ఆ పరమశివుడికి ఒకే ఆలయంలో ఐదు విభిన్న పేర్లతో ఐదు శివలింగాలు ఉండటంఅన్నది బెంగళూరులోనే ఉంది. ఐటీ రాజధానిగా పేరొందిన ఈ బెంగళూరులోని ఈ ఆలయం కలియుగానికి పూర్వం నుంచే ఉందని స్థానిక కథనం. అరుదైన ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని హిందూ భక్తులు భావిస్తారు. ఇటువంటి అరుదైన దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...
సోమేశ్వర దేవాలయం
P.C: You Tube
బెంగళూరులో ఉన్న ఆ అరుదైన దేవాలయం పేరు సోమేశ్వర దేవాలయం. కలియుగానికి ముందు ఈ ఆలయ ప్రాంతంలో మాండ్య మహర్షి ఆశ్రమం ఉండేదని స్థలపురాణం చెబుతుంది. ఆ మహర్షి తన శిష్యులతో కలిసి నివశిస్తూ, అక్కడ ఉన్న ఓ స్వయంభూ లింగాన్ని నిత్యం పూజించేవాడు. కాల క్రమంలో ఆ శివలింగం భూ గర్భంలో కలిసిపోయింది. అటు పై ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా మారిపోయింది. ఈ క్రమంలో 13వ శతాబ్దంలో బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ తండ్రి జయప్ప గౌడ ఒకసారి వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు.
వేటలో అలసి పోయి
P.C: You Tube
వేటలో అలసపోయి ఆ ప్రాంతంలోని ఒక పనస చెట్టు కింద నిద్రపోయిన జయప్పగౌడ కలలో శివుడు కనిపిస్తాడు. తాను ఇక్కడ నేలలో లింగం రూపంలో ఉన్నానని చెప్పాడు. తనను బయటకు తీసి గుడి కట్టించాలని సూచించాడు. శివుడి ఆజ్జ ప్రకారం భూ గర్భంలో ఉన్న శివలింగాన్ని బయటికి తీసి సోమేశ్వర లింగంగా పేర్కొని అర్చనలు చేసి గుడి కట్టించాడు. తర్వాతి కాలంలో సోమేశ్వరుడిని కొలిచిన భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోనే అరుణాచలేశ్వరుడిని, భీమేశ్వరుడిని, నంజుండేశ్వరుడిని చంద్రమౌళీస్వరుడని ప్రతిష్టించి పూజించసాగారు. అలా ఒకే దేవాలయ ప్రాంగణంలో ఐదు విభిన్న శివలింగాలను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇది హలసూరు సోమేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
ఎందరో రాజులు
P.C: You Tube
సోమేశ్వర ఆలయ అభివ`ద్ధి కోసం చోళులూ, విజయనగర రాజులు, ఎంతో అభివ`ద్ధి చేశారు. అందువల్లే ఇక్కడ శిలాప్రతిమలు కొన్ని చోళ శైలిలో, మరికొన్ని విజయనగర శైలిలో దర్శనమిస్తాయి. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం ముందు భాగంలో 48 శిలా స్తంభాలతో కూడిన పెద్ద మంటపం ఉంది. ఈ స్తంభాలతో పాటు ఆలయం వెనుక భాగంలో విష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుడు వారి వాహనాలతో ఉన్న విగ్రహాలను భక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి. అదే విధంగా బ్రహ్మకు ఇక్కడ అర్చనలు జరుగుతాయి. ఇలా బ్రహ్మకు ఆలయంలో పూజలు జరగడం ఓ విశేషం.
కామాక్షి అమ్మవారు
P.C: You Tube
ఇక్కడ అమ్మవారు కామాక్షి పేరుతో కొలువై ఉన్నారు. అమ్మవారి ఎదురుగా శిలతో చెక్కిన బీజాక్షర యుక్త శ్రీ చక్రం కనిపిస్తుంది. గర్భగుడి ప్రాకారంలో 63 మంది నయనార్ల విగ్రహాలు ఉన్నాయి. ముఖ మండపానికి ముందు భాగంలో ఇత్తడి తాపడంతో ఉన్న పెద్ద నంది గంభీరంగా దర్శనమిస్తుంది. ఇక గుడి ప్రాకారం చుట్టూ మామిడి, సంపెంగ, జమ్మి, రావి, వేప చెట్లు సహా శివలింగ పుష్పాలు భక్తులకు చల్లని నీడనిస్తాయి.
పూల పల్లకి
P.C: You Tube
కాగా సోమేశ్వరుడికి 11 రోజుల పాటు చైత్రమాసంలో ఉత్సవాలు జరుపుతారు. చైత్ర పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పూల పల్లకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ రోజున అన్ని దేవస్థానాల గ్రామ దేవతలూ ఉత్సవాల్లో పాల్గొంటారు. అదే విధంగా ప్రతి సోమవారం, అమావస్య రోజుల్లో జరిపే శత రుద్రాభిషేకం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది.