భారత దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనీయ స్థలాల్లో కంచి కూడా ఒకటి. ఇక్కడ ప్రతి అడుగుకూ ఒక దేవాలయం కనిపిస్తుంది. అయితే చాలా మంది కేవలం కంచి అనగానే అక్కడ ఉన్న కామాక్షి అమ్మవారి దేవాలయం, అటు పై బంగారు, వెండి బల్లి ఉన్న వరదరాజ దేవాలయం మాత్రం సందర్శించి తిరిగి వచ్చేస్తుంటారు.
అయితే ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, వరద రాజ దేవాలయానికి దగ్గర్లోనే అనేక పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు దేవాలయాల్లో ముఖ్యమైన వామన మూర్తి దేవాలయం, ఏకాంబరేశ్వర దేవాలయం, కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కచ్చబేశ్వర దేవాలయం, కైలాసనాథ దేవాలయం, వైకుంఠ పెరుమాల్ వంటి ఆలయాలకు సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం....

కామాక్షి అమ్మవారి ఆలయం
P.C: You Tube
కాంచిపురంలో చూడదగిన ప్రధాన ఆలయాల్లో కామాక్షి అమ్మవారి ఆలయం ప్రధానమైనది. ఇది సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు. కాంచిపురంలోని శివాలయాల్లో ఎక్కడా మనకు శివుడి పక్కన పార్వతి దేవి కనిపించరు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప. చేతిలో కొరడాతో అయ్యప్ప మనకు కనిపిస్తారు.

వామన మూర్తి ఆలయం
P.C: You Tube
కంచిలో అమ్మవారి ఆలయానికి సమీపంలో నే వామన మూర్తి ఆలయం ఉంది. ఇక్కడ వామన మూర్తిని ఉలగళంద పెరుమాల్ అని అంటారు. ఇక్కడ వామన మూర్తి త్రివిక్రమ రూపంలో కనిపిస్తారు. అంటే ఆకాశం వైపు ఒక కాలు, మరోకాలు బలిచక్రవర్తి తల పై ఉంచినట్లు మనకు కనిపిస్తాడు.

ఏకాంబరేశ్వర దేవాలయం
P.C: You Tube
పంచభూత లింగాల్లో ఏకాంబరేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఇక్కడి శివలింగాన్ని పంచభూతాల్లో ఒకటైన భూమికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడే ఉన్న మామిడి చెట్టు కింద అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు చేసినట్లు స్థలపురాలణం. ఆ మామిడి చెట్టును మనం ఇప్పటికీ చూడవచ్చు.

రామానంద స్వామి ఆలయం
P.C: You Tube
కంచిలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో రామనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఆలయం పెద్దగా లేకపోయినా ఇక్కడ ఉన్న దైవానికి విశిష్టమైన శక్తులు ఉన్నట్టు చెబుతారు. రామేశ్వరంలోని శివుడిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో అంతటి పుణ్యమే ఈ ఆలయ దర్శనం వల్ల కలుగుతుందని చెబుతారు.

కంచి కామ కోటి పీఠం
P.C: You Tube
ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో కంచి కామ కోటి పీఠం కూడా ఒకటి. కంచిలో ఉదయం పూట ఆలయాలను దర్శనం చేసుకొన్న తర్వాత భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది.

కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం
P.C: You Tube
శివపుత్రడైన సుబ్రహ్మణ్యస్వామి చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి కందపురాణాన్ని ఆవిష్కరించిన ఆలయం ఇదేనని చెబుతారు. కంచి కామకోటి పీఠానికి దగ్గర్లోనే ఉంటుంది. ఈ ఆలయంలో శిల్ప సంపద కూడా చూడముచ్చటగా ఉంటుంది.

కచ్చబేశ్వర దేవాలయం
P.C: You Tube
ఇక్కడ విష్ణుమూర్తి తాబేలు రూపంలో పరమశివుడిని పూజించాడని చెబుతారు. ఈ ఆలయం చాలా విశాలమైనది. ఈ ఆలయంలోని కోనేరులో స్నానం చేస్తే రోగాలు తొలిగిపోతాయని చెబుతారు. ఈ ఆలయం నుంచి కైలాసనాథ దేవాలయం, కుమారస్వామి దేవాలయం, కంచి కామ కోటి పీఠం కూడా చాలా దగ్గర.

కైలాసనాథుడి దేవాలయం
P.C: You Tube
కాంచిపురంలో అతి పురాతన దేవాలయాల్లో శ్రీ కైలాసనాథ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం కచ్చపేశ్వరాలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని నారదుడు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.

వైకుంఠ పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
కంచిలో చూడదగిన మరో ఆలయం వైకుంఠపెరుమాల్ దేవాలయం. ఇది 108 వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ శిల్ప సంపద చాలా గొప్పగా ఉంటుంది. అంతేకుండా ఈ దేవాలయంలోని మూలవిరాట్టును దర్శనం చేసుకొంటే వైకుంఠాన్ని చూసినంత పుణ్యం వస్తుందని స్థానిక భక్తులు చెబుతుంటారు.

వరదరాజ పెరుమాల్ దేవాలయం
P.C: You Tube
కంచి అనగానే మనకు వెంటనే కామాక్షి అమ్మవారి దేవాలయం, బంగారు బల్లి గుర్తుకు వస్తాయి. ఈ కంచిలో అమ్మవారి ఆలయంతో ప`థ్వి లింగం ఉన్న ప్రదేశాన్ని శివకంచి అని బంగారు బల్లి ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఆ బంగారు బల్లి ఉన్న ఆలయమే వరదరాజ పెరుమాల్ దేవాలయం. ఇక్కడ విష్ణువును వరదరాజు పేరుతో కొలుస్తారు. ఇక్కడ ఉన్న ఆనంద పుష్కరిణి కూడా చూడదగినదే.



Click it and Unblock the Notifications













