శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు దూసుకుపోతూ.. సృష్టికి ప్రతిసృష్టిని చేయగలిగే స్ధాయికి మనిషి చేరుకున్నా.. కొన్ని నమ్మకాలు , ఘటనలు అందరిని ఆశ్చర్యాలకు గురిచేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రాచీన నిర్మాణాలు, దేవాలయాలు, వాటి వెనుక కథలు ఎన్నో ఇప్పటికీ అంతుబట్టకుండా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో ఒకటే తమిళనాడులోని వేదగిరీశ్వరుడి దేవాలయం. వేదగిరీశ్వరుడి రూపంలో ఆ పరమశివుడు కొలువైన ఈ దేవాలయం విశేషాలు తెలుసుకుందాం..
వేదగిరీశ్వరుడి దేవాలయం గురించి ఆసక్తికర కథ
P.C: You Tube
వేదగిరీశ్వరుడి దేవాలయం గురించి ఒక ఆసక్తికర కథ స్ధానికంగా ప్రచారంలో ఉంది. భరద్వాజ మహాముని కోరిక మేరకు వేదాలు ఇక్కడ కొండరూపంలో కొలువయ్యేలా పరమేశ్వరుడు చేశాడని చెప్తారు. వేదాలు నేర్చుకోవాలనే మహర్షి కోరికను ఆయన ఈ విధంగా తీర్చాడని నమ్ముతారు. కలియుగంలో భక్తిభావంతో ఇక్కడకు వచ్చే భక్తులు మోక్షాన్ని పొందుతారని కూడా శివుడు మహర్షికి చెప్పినట్టు కథనం. ఈ కారణంగానే వీటిని వేదాల కొండలుగా వ్యవహరిస్తారు.
త్రిపుర సుందరీ అమ్మవారు
P.C: You Tube
పైన గుడిలో శివుడు, కొండ కింద మరో గుడిలో అమ్మవారు త్రిపురసుందరీదేవి రూపంలో దర్శనమివ్వడం ఈ దేవాలయం ప్రత్యేకత. కొండ దిగువ భాగాన ఒక తీర్ధం కూడా చూడచ్చు. పూర్తి ద్రవిడ నిర్మాణశైలితో కట్టిన ఈ దేవాలయం..చరిత్రకారులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కంచీపురంలో ప్రఖ్యాతదేవాలయాల్లో ఒకటైన వేదగిరీశ్వర దేవాలయాన్ని దర్శించుకోవాలంటే చెన్నయ్ నుంచి 72 కిలోమీటర్లు ప్రయాణించాలి. మహాబలిపురం నుంచి 16కిలోమీటర్ల ప్రయాణిస్తే ఇక్కడకు చేరుకోవచ్చు.
ఆ పక్షులు
P.C: You Tube
పూర్వం ఈ దేవాలయం ఉన్న ఊరిని తిరకలుకుండ్రం అని పిలిచేవారు. అటు పై వేదగిరిగా మారిపోయింది. గతంలో గద్ద జాతికి చెందిన రెండు పక్షులు క్రమం తప్పకుండా మధ్యాహ్నం 12గంటలకు వచ్చి పూజారి పెట్టే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేవట. దీంతో ఈ తీర్ధానికి పక్షితీర్ధం అని నామకరణం చేశారు. ఈ రెండు పక్షులు పరమశివుని శాపానికి గురైన అలా మారిన బుుషులని, అందుకే ఇవి ఇక్కడకు ప్రతీరోజూ వచ్చేవి అన్నది ఒక కథనం. భక్తుల్లో పాపాత్ములు ఎవరైనా ఉంటే అవి అక్కడకు రావని కూడా చెప్పేవారు. అయితే, చాలా ఏళ్లుగా ఈ పక్షులు తీర్ధం దగ్గర కనిపించడంలేదు.