చరిత్రకు మౌనసాక్ష్యాలు అప్పట్లో నిర్మించిన గిరి దుర్గాలు. ఈ కోటలోని ప్రతి రాయి అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను మౌనంగానే చెబుతాయి. అందుకే చరిత్ర లోతుల్లోకి వెళ్లి అప్పటి విషయాలను వెలికి తీయాలనుకునేవారికి మొదట గుర్తుకు వచ్చేది కోటలు. అటువంటి ఎన్నో కోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో కొండవీడు కోట కూడా ఒకటి. రెడ్డి రాజుల పౌరుషత్వానికి నిలువుటద్దమైన ఈ కోటకు సంబంధించిన వివరాలు మీ కోసం...
కొండవీడు కోట, గుంటూరు
P.C: You Tube
ఆంధ్రప్రదేశ్ లోని గిరి దుర్గాల్లో అత్యంత ప్రముఖమైనది కొండవీడు కోట. రెడ్డిరాజుల పౌరుషానికి నిలువెత్తు సాక్షమైన ఈ కోట గుంటూరు జిల్లా యడ్లపాడుకు సమీపంలో ఉంది. చిలకలూరి పేట గుంటూరు మధ్య వెళ్లే జాతీయ రహదారి వెంబడి వెలితే ఈ కోటను సులభంగా చేరుకోవచ్చు.
కొండవీడు కోట, గుంటూరు
P.C: You Tube
జాతీయ రహదారికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ కొండవీడు కోట ఉంది. అదేవిధంగా గుంటూరు నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం మీదుగా కొండవీడు చేరుకొనేందుకు మరో మార్గం ఉంది. మొత్తంగా గుంటూరు నుంచి కొండవీడుకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన కోట ఉంది.
కొండవీడు కోట, గుంటూరు
P.C: You Tube
చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ కోట ప్రస్తుత యువతరానికి ట్రెక్కింగ్ విషయంగా స్వర్గధామం. అందువల్లే వీకెండ్ సమయంలో ఇక్కడకు యువత ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి వస్తుంటారు. అంతేకాకుండా రాక్ క్లైంబింగ్ కు కూడా ఇక్కడ అవకాశం ఉంది.
కొండవీడు కోట, గుంటూరు
P.C: You Tube
శత్రుదుర్భేద్యమైన ఈ గిరిదుర్గాన్ని రాజధానిగా చేసుకొని క్రీస్తుశకం 1325 నుంచి 1420 వరకూ రెడ్డిరాజులు ప్రజారంజకంగా పరిపాలించారు. ఈ కోటలో 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు ఉన్నాయి. అదే విధంగా కోటలోపల ఉన్న సైనికుల నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా మూడు చెరువులను నిర్మింపజేచారు. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా మరో రెండు చెరువుల్లోకి వెళ్లేలా నిర్మించిన తీరు అమోఘం.
కొండవీడు కోట, గుంటూరు
P.C: You Tube
ఇక ఈ కోటలో అనేక దేవాయాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండగా కొండ దిగువన వీరభద్రస్వామి దేవాలయం, రామలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్నాయి. ఈ ప్రాంతంలో అపార శిల్పసంపదతో కూడిన రాతి కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు ఆనాటి శిల్పుల చాతుర్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు. చరిత్ర అంటే ఎక్కువ ఇష్టపడే వారేకి ఈ కొండవీడు ప్రాంతం తప్పక నచ్చుతుంది.