ప్రపంచ చరిత్రలో ఉదయగిరి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకో తెలుసా?? ప్రపంచ చరిత్రలో అతి పెద్ద మార్పు ఉదయగిరి కొండల ప్రాంతంలోనే జరిగింది. క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి చేసిన కళింగ యుద్ధం ఇక్కడే జరిగింది. ఆ యుద్ధం పర్యవసానంగానే అశోకుడు తరువాత కాలంలో అహింసామార్గాన్ని అనుసరించి బౌద్ధాన్ని ఆచరించి, దానిని ఇక్కడినుంచే వ్యాపింపజేశాడు.
ఉదయగిరి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక బౌద్ధ తీర్థ స్థలమనే చెప్పాలి. భారత దేశం లో నిర్మాణ కౌశల్యానికి ఉదయగిరి చక్కటి ఉదాహరణ. ఇక్కడ తవ్వకాల్లో బయట పడ్డ బౌద్ధ, జైన్ ల పెద్ద నిర్మాణాలు, ఆశ్రమాలు, స్తూపాలు, శిధిలాల వల్ల దీనికి చాలా చారిత్రిక, నిర్మాణ ప్రాముఖ్యం సంతరించుకుంది.భువనేశ్వర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న 'సన్ రైస్ హిల్స్' గా పిలువబడే ఉదయగిరి ఇక్కడ వున్న 18 గుహలలో విస్తారంగా చెక్కిన శిల్పాలు, నిర్మాణాలు చూడడానికి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ దొరికిన చాలా శాసనాల్లో ఈ గుహలు ఖారవేల రాజుల హయాంలో జైన సన్యాసుల నివాస అవసరాల కోసం కొండలు తొలిచి తయారు చేసారని తెలియచేస్తాయి. ఇక ఇక్కడ చూడవలసిన వాటి విషయానికి వస్తే ...
ఉదయగిరి గుహలు
ఉదయగిరి కి రాగానే మొదట చూడవలసినది ఈ గుహలే. ఉదయగిరి గుహలు కటక్ జిల్లా - భువనేశ్వర్ కి చాలా దగ్గరలో సుందరమైన కొండలపై ఉంది. ఉదయగిరి లో మొత్తం 18 గుహలు ఉన్నాయి. ఇవి భారతదేశ పురావస్తు పరిశోధన సంరక్షణలో ఉన్నాయి. ఉదయగిరి గుహలు క్రీ. శ. 2 వ శతాబ్ధం నాటివని అక్కడున్న కొన్ని శిలా శాశనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇటీవల తవ్వకాలలో బయటపడిన బౌద్ధ ఆరామాలు, స్థూపాలను ఇక్కడ మనం చూడవచ్చు. అన్ని గుహలు రానిగుమ్ఫా, హతిగుమ్ఫా, గానేసగుమ్ఫా వంటి భారీ శిల్పాలతో ఉన్నాయి. అలాగే గుహలలో అనేక అందమైన శిల్పాలను చూడవచ్చు. ఈ గుహలు సందర్శన కోసం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటాయి.
Photo Courtesy: Achilli Family | Journeys
రత్నగిరి
రత్నగిరి ఉదయగిరి నుంచి సుమారుగా 70 కి. మీ. దూరంలో వుంది. ఇది నగరానికి దూరంలో ఉన్నది కనుక ఈ ప్రశాంత ప్రదేశాన్ని బౌద్ద సన్యాసులు బహుశా ధ్యానం కోసం ఎంచుకుని వుంటారు. వక్రరేఖ ఆకారంలో వుండే అరుదైన దేవాలయం ఇక్కడ ఒకటి ఉంది. తవ్వకాల్లో బయట పడ్డ ఇతర ముఖ్యమైన వస్తువులతో పాటు ఇత్తడి, కంచు లోహాలతో తయారైన వివిధ బుద్ధ విగ్రహాలను రత్నగిరి మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచారు. రత్నగిరి ఏడాది పొడవునా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు తెరిచే వుంటుంది. చాలా మంది బౌద్ధ పర్యాటకులు, ఇతర మతాల వారు ఇక్కడికి వచ్చి బౌద్ధం లోని దైవత్వాన్ని రత్నగిరి వాతావరణంలో అనుభవిస్తారు.
Photo Courtesy: Daniel Limma
ఖండగిరి గుహలు
ఉదయగిరి గుహల పక్కనే 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఈ ఖండగిరి గుహలు వున్నాయి. కొన్ని మెట్ల మీద నుంచి చేరుకోగలిగే ఈ ప్రాంతం మిమ్మల్ని చరిత్రలోకి అలా..అలా... తీసుకువెళ్తుంది. ఇక్కడ వున్న మొత్తం 15 గుహలు ప్రధానంగా జైన సన్యాసుల నివాసం కోసం కట్టారు. 2000 ఏళ్ళ వయసున్న ఈ గుహల గోడల మీద శాసనాలు, శిల్పాలు చెక్కివున్నాయి. ఈ బ్రహ్మాండమైన కొండ పైన వున్న అందంగా చెక్కిన జైన దేవాలయం 18 వ శతాబ్దం నాటికి చెందింది. ప్రతి ఏటా జనవరి చివరిలో, చాలా మంది సాధువులు ఇక్కడ గుమికూడి హిందూ పురాణాల నుంచి స్తోత్రాలు చదివి, ధ్యానం చేసుకుంటారు. అదే సమయంలో చాలా మంది జనాన్ని ఆకర్షించే సంత కూడా ఇక్కడ జరుగుతుంది.
Photo Courtesy: Kamalakanta777
లలితగిరి
లలితగిరి లో ఇప్పటి దాకా కనుగొన్న వాటిలో అతి ప్రాచీనమైన బౌద్ధ సముదాయాలు వున్నాయి. ఉదయగిరి నుంచి 27 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రదేశంలో గౌతమ బుద్ధుడి అస్థికలతో పాటు క్రీ.శ. 1 వ శతాబ్దానికి చెందిన ఇతర ప్రాచీన పురావస్తు తవ్వకాలు కూడా వున్న మ్యూజియం ప్రధాన ఆకర్షణగా ఉన్నది. వివిధ భంగిమల్లో వున్న బుద్ధ విగ్రహాలతో పాటు, వివిధ హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఇక్కడ దొరికిన పాత బంగారు, వెండి ఆభరణాలు ఇక్కడ ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచారు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ వారి సంరక్షణలో వున్న లలితగిరి లో చాలా శిల్పాలున్న ఒక దేవాలయం శిధిలాలు కూడా వున్నాయి.
Photo Courtesy:Amartyabag
లంగుడి కొండలు
మహానది డెల్టా నుంచి 90 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న కొండ లంగుడి హిల్స్ . ఈ కొండ, మైదానాల గుండా ప్రవహించే అందమైన కేలువా నది ఈ ప్రదేశాన్ని అంతటినీ చాలా అందంగా మార్చివేస్తుంది. అందంగా ఉండడమే కాక, ఇక్కడ ఓడిశా లోని అరుదైన బౌద్ధ శిల్పాలు వున్నాయి. ఇక్కడి తవ్వకాల్లో బయటపడ్డ రాళ్ళను తొలిచి తయారు చేసిన 34 స్తూపాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు ‘సమాధి ముద్ర' లో చిరునవ్వుతో వున్న బుద్ధుడి విగ్రహం తో పాటు ఇతర భంగిమల్లో వున్న విగ్రహాలు లంగుడి హిల్స్ కు ఎంతో మంది యాత్రికులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశం ఇప్పుడు భారతీయ పురావస్తు శాఖ సంరక్షణలో వుంది. చిరునవ్వుతో, భారీ అలంకరణలతో రాతి నుంచి చెక్కిన తారా దేవి అధ్బుతమైన శిల్పం చూసి తీరాల్సిందే.
Photo Courtesy: Prithwiraj Dhang
బౌద్ధ సముదాయం
లలితగిరి, రత్నగిరి, ఉదయగిరి మరియు ధవళగిరి కొండల మీద బౌద్ధ సముదాయం వుంది. వీటిలో ఉదయగిరి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో వున్న ధవళగిరి మీద వున్నది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సుప్రసిద్ధ కళింగ యుద్ధం జరిగి, అశోకుడు సార్వభౌమత్వం వెంట పరుగులు ఆపి బౌద్ధ౦ తీసుకున్న ప్రదేశం ధవళగిరి అని నమ్ముతారు. 1970 లో ‘శాంతి స్థూప' పేరిట నిర్మించిన తెల్లటి నిర్మాణం ఇప్పుడు ప్రతి ఏటా బౌద్ద యాత్రికులు సందర్శించే ప్రసిద్ధ యాత్రా స్థలం. ఈ స్థూపం లోపల నిర్మించిన పలు బుద్ధ విగ్రహాలు ఈ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మార్చాయి.
Photo Courtesy:Jujhia Uttam
ఉదయగిరి కి చేరుకోవడం ఎలా??
రోడ్డు ద్వారా
పర్యాటకులు ఒరిస్సా (ఒడిశా) లోని ఎక్కడనుండైనా బస్సుల్లో చేరుకోవచ్చు, క్రుష్ణదాస్పూర్ ఉదయగిరి, రత్నగిరి కోస౦ ఒక బస్ స్టాప్. ఇక్కడ అన్ని డీలక్స్, సెమి-డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అందువల్ల పర్యాటకులు వారి సౌకర్యాన్ని బట్టి ఏ రకం బస్సైన ఎక్కవచ్చు. ఇక్కడ నుండి, టాక్సీలు, ఆటో రిక్షాలు లేదా సైకిల్ రిక్షాలలో కోరుకున్న ఆకర్షణలు పొందవచ్చు.
రైలు ద్వారా
ఉదయగిరి లో రైల్వే స్టేషన్ లేదు కనుక ఉదయగిరి కి 258 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ రాష్ట్రంలోని ప్రధాన రైలు కేంద్రాలలో ఒకటి, అందువల్ల ఒడిష లోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఉదయగిరిలో పర్యాటకుల సంఖ్యా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి, అలాగే ఇది బస్సు, టాక్సీ సేవలు కలిగి ఉంది.
విమానాల ద్వారా
ఉదయగిరి కి భువనేశ్వర్ వద్ద 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని స్థానిక విమానాశ్రయాలకు బాగా అనుసంధానించబడి ఉంది. అలాగే ఇది విదేశాలకు కూడా కలపబడి ఉంది. భువనేశ్వర్ నుండి బస్సులు లేదా టాక్సీలలో ఉదయగిరి చేరుకోవచ్చు.
Photo Courtesy: Sarbeswar maharana