ఎంతటి అలసిపోయిన శరీరమైనా, ఎడతెగని ఆలోచనలతో సతమతమయ్యే మనసైనా... కాసేపు అలా పచ్చని చెట్ల కింద కూర్చుంటే చాలు... ప్రశాంతతతో నిండిపోతాయి. మనదేశంలో ఇలాంటి పచ్చని చెట్లకు కొదవలేదు. ప్రకృతి రమణీయతకు, కాల గర్భంలో కలిసిపోయిన చరిత్రకు సాక్ష్యాలు కొన్ని పురాతన మర్రిచెట్లు కొలువుదీరాయి. దేశంలో అనేక చోట్ల వందల ఏళ్ల నాటి పురాతన మర్రిచెట్లు ఉన్నాయి. అవి ఉన్న ప్రదేశాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా మారిపోయాయి. వాటిని సందర్శించడం ద్వారా అద్భుత అనుభూతులను సంపాదించుకోవచ్చు. ఇండియాలో ఎక్కడెక్కడ ఇలాంటి పురాతన, అద్భుత మర్రి చెట్లు ఉన్నాయో చదవండి...
1. తిమ్మమ్మ మర్రిమాను, ఆంధ్రప్రదేశ్
p.c.
ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది. పందిరిలా అల్లుకున్న ఆ చెట్టు దాదాపు నాలుగు ఎకరాల్లో విస్తరించింది. ఈ భారీ వృక్షం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఈ చెట్టు తిమ్పమ్మ అని పిలవబడే దేవత కొలువుదీరిన పవిత్ర ప్రదేశంలో ఉన్నట్టు భక్తులు నమ్ముతారు.
చెట్టుకు దగ్గర్లోనే తిమ్మమ్మ గుడి ఉంది. సంతానం లేని దంపతులు ఆ అమ్మవారిని మొక్కుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డ జన్మిస్తాడని చుట్టుపక్కల వారి నమ్మకం. ఈ మర్రిచెట్టుకున్న ఊడలు, బలమైన కొమ్మలు... ఆ చెట్టును గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించాయి. ఈ చెట్టను ఓసారి ఎందుకు దర్శించుకోకూడదు? మీరే ఆలోచించండి.
2. దొడ్డ అలడ మర, కర్ణాటక
p.c.
కన్నడలో దొడ్డ అలడ మర అంటే భారీ మర్రి వృక్షం అని అర్థం. కర్ణాటకలోని బెంగళూరులో నాలుగువందల ఏళ్ల నాటి ఈ మర్రి మాను కొలువుదీరింది. బెంగళూరులో ఉన్న ప్రకృతి ప్రేమికులకు , పిక్ నిక్ కు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఈ మర్రి చెట్టు మంచి గమ్యస్థానం అవుతుంది.
ఈ చెట్టు కింద ఎంతో మంది ప్రజలు తాజా గాలి పీల్చుకునేందుకు, పిక్ నిక్ ల కోసం వచ్చి పోతుంటారు. ఆ చెట్టు నీడలో పిల్లా పాపలతో కుటుంబసమేతంగా వచ్చి సేదతీరుతుంటారు. ఆ చెట్టు ఊడలతో వందలాది మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.
3. అడ్యర్ మర్రి చెట్టు, చెన్నై
Image source
చెన్నైలో ఉన్న అడ్వర్ మర్రి చెట్టు చరిత్ర ఇప్పటికీ పూర్తిగా తెలియరాలేదు. ఈ చెట్టు వయసెంతో, ఏ కాలం నాటిది సరిగా ఎవరికీ తెలియదు. ఒక అంచనా ప్రకారం 450 ఏళ్ల నాటిది అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ పచ్చని చెట్టు చుట్టూ ఆవరించి ఉన్న అనువైన వాతావరణం... ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటకప్రాంతంగా మార్చింది.
ప్రకృతి ప్రేమికులకు ఈ చెట్టే ముఖ్య గమ్యస్థానం. ఈ చెట్టు నుంచి వచ్చిన ఊడలు ఎకరాల కొద్దీ భారీగా ఆవరించి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
4. గ్రేట్ బన్యన్, కోల్ కతా
p.c.
కోల్ కతా లోని అతి పురాతన చెట్లలో గ్రేట్ బన్యన్ కూడా ఒకటి. ఈ మర్రి మానుకు దాదాపు 250 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా. అంతేకాదు ఈ చెట్టు చుట్టూ రకరకాల అరుదైన చెట్లు, మొక్కలు కూడా పెరుగుతున్నాయి. వీటిని ప్రపంచంలోని నలుమూలలా నుంచి తెచ్చి వేశారు. రెండు పెద్ద తుఫానుల ధాటికి తట్టుకుని మరీ ఈ మర్రి చెట్టు స్థిరంగా నిలుచుని ఉంది.
కోల్ కతాలోని ప్రజలు రోజూ భారీగా ఈ చెట్టు కింద సేదతీరేందుకు వస్తుంటారు. అక్కడి వాతావరణం మనసులను ప్రశాంతంగా మారుస్తుంది. మీరు కూడా ఈ చెట్టు అందాలను తిలకిస్తే బావుంటుంది.
5. పిల్లలమర్రి, తెలంగాణ
p.c.
మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది మహా మర్రి మాను... పిల్లలమర్రి. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతన చెట్టు ఇది. గతంలోనూ, ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్ర దైవ ప్రదేశంగా కొలుస్తున్నారు. ఈ మహా వృక్షాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు.
ఈ చెట్టు కింద భాగాన్ని చక్కటి, అందమైన పార్కుగా మార్చారు. అక్కడ కూర్చుని చల్లని గాలిని, పచ్చని పరిసరాలను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇవే కాకుండా ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సైన్సు మ్యూజియం, జింకల పార్కును కూడా దర్శించవచ్చు.