లక్నోని సందర్శించేవారు కన్నెత్తి చూడని కొన్ని భయానక ప్రదేశాలు
దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలతోపాటు చారిత్రక కట్టడాలకు ఇది నిలయంగా పేరుగాంచింది. అయితే, ఇక్కడి పురాతన నిర్మాణాలలో కొన్ని మాత్రం భయానక సందర్శనీయ భవనాలుగా నేటికీ నిలిచిపోయాయి. లక్నోని సందర్శించేవారు ఇటువైపుగా కన్నెత్తికూడా చూడరని చెబుతారు. మరి లక్నోలోని అలాంటి హర్రర్ ప్రదేశాల గురించి తెలుసుకుందామా?!

సికందర్ బాగ్
సికందర్ బాగ్ భయానక కథను తెలుసుకునేముందు, ఇది భారత స్వాతంత్య్ర పోరాట గాథతో ముడిపడి ఉందని గుర్తించాలి. బ్రిటీష్ కాలం నాటి క్రూరత్వానికి ఈ గార్డెన్ గోడలు నిలువెత్తు సాక్ష్యాలుగా నేటికీ నిలబడి ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఇక్కడ రెండు వేల మందికి పైగా పోరాటయోధులు అతి క్రూరంగా హత్య చేయబడ్డారట. హత్యానంతరం వారి మృతదేహాలను ఇక్కడి బహిరంగ ప్రదేశాల్లో ఉంచారని ప్రచారంలో ఉంది. ఈ రోజుకీ సందర్శకులు సాయంత్ర సమయంలో భయంతో సికందర్ బాగ్కు వెళ్లేందుకు భయపడతారట. ఎందుకంటే సూర్యుడు అస్తమించగానే ఇందులోంచి వింత శబ్దాలు రావడం ప్రారంభమవుతాయని కథలుగా చెప్పుకుంటారు.

దిల్కుషా గార్డెన్
లక్నోలోని దిల్కుషా గార్డెన్ చాలా భయానక కథకు ప్రసిద్ధి చెందింది. ఇద్దరు ప్రేమికులను ఓ మహిళ అతికిరాతంగా హత్య చేసి ఆ మృతదేహాలను ఈ తోటలో పడేసిందని ప్రచారంలో ఉంది. ఈ సంఘటన తర్వాత భయంతో ఎవరూ ఈ తోటలోకి వెళ్లేందుకు సాహం చేయరు. రాత్రి సమయాల్లో హత్యగావించబడ్డ ఇద్దరు ప్రేమికుల ఆత్మలు తోటలో తిరుగుతూ ఉంటాయని మరొక కథనం. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడ ఒంటరిగా షికారు చేయడానికి ఎవరూ సాహసించరు. కొన్నిసార్లు పగటిపూట కూడా ఎవరూ ఒంటరిగా వెళ్లేందుకు ఆసక్తి చూపరు. చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా.. ప్రశాంతంగా కనిపించే ఈ గార్డెన్పై ఉన్న కథనాలను విశ్వసించనివారు మాత్రం ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు.

బలరాంపూర్ హాస్పిటల్
బలరాంపూర్ హాస్పిటల్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వపు శ్మశాన వాటికపై ఈ ఆసుపత్రిని నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆసుపత్రిలో చాలాసార్లు వింతైన సంఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతుంటారు. సాయంత్రం కాగానే చాలాసార్లు ఇక్కడి నుంచి పెద్ద పెద్ద అరుపులు, శబ్దాలూ గమనించినట్లు ప్రచారంలో ఉంది. కొన్నిసార్లు పిల్లలు ఏడ్చే శబ్దం కూడా వస్తుందట. ఇక్కడ ఉన్న వినియోగంలోలేని గదులు మరియు ప్రదేశాలను ఎవరూ సందర్శించరు. ఆసుపత్రి సిబ్బంది సైతం రాత్రి సమయాలలో అటువైపుగా వెళ్లే సాహసం చేయరట.

ఓల్ హౌస్ లేదా ఆయిల్ హౌస్
లక్నోలో ఉన్న ఆయిల్ హౌస్ గగుర్పాటు కలిగించే ప్రదేశంగా చాలామంది భావిస్తారు. అందుకు కారణం బ్రిటీష్ కాలంలో చనిపోయిన అధికారులను ఇక్కడి బావిలో పడవేసేవారట. ఈ బావి నుండి బ్రిటిష్ అధికారుల ఆత్మల స్వరాలు నేటికీ వినిపిస్తూ ఉంటాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఒక కులపెద్ద కొడుకు ఈ బావిలో రాళ్లు వేయడం ప్రారంభించాడని, వెంటనే అతడు చనిపోయాడట. అతని చావుకు ఆ భావే కారణమని మరొక కథనం ప్రచారంలో ఉంది. ఈ ఘటన తర్వాత బావి దగ్గరకు ఎవరూ వెళ్లలేదట.



Click it and Unblock the Notifications













