తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఒకటి. కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరములో కలదు.
కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.
చరిత్ర
ఇది రామాయణం కాలం నాటి మాట. రామ - రావణ యుద్దము జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. అప్పుడు సంజీవనిని తెచ్చేందుకు అంజనేయస్వామి బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.
ఆంజనేయస్వామి భారీ విగ్రహం
చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.
క్షేత్ర చరిత్ర / స్థలపురాణం
సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణా లలో సింగం సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనబడగా, సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు.
ఇది కూడా చదవండి :శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం !
కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.భక్తి భావంతో చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. వెనువెంటనే స్వామి వారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు.
ఆలయ గోపురం
చిత్ర కృప : Manasa.mani
నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.
విగ్రహంలోని విశేషం
ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.
దగ్గరలోని ఆలయాలు, దర్శనీయ స్థలాలు
ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, భేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి,, కొండలరాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, అమ్మ వారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్శిస్తాయి.
ఇది కూడా చదవండి: రాముని జలపాతాలు ... కరీంనగర్ సొంతం !
ఉత్సవాలు, పండుగలు
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.
చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.
కొండగట్టు ఎలా వెళ్ళాలి ?
వాయు మార్గం : కొండగట్టు కు 175 కి. మీ ల దూరంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కలదు
రైలు మార్గం : 35 కి. మీ ల దూరంలో గల కరీంనగర్ రైల్వే స్టేషన్ కలదు.
రోడ్డు మార్గం : కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాల నుండి కొండగట్టు కు బస్సులు నడుస్తుంటాయి