Search
  • Follow NativePlanet
Share
» »వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...

వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...

సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

మహావిష్ణువు వరాహం, సింహం, మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరాహం, సింహం, మనిషి రూపం ఉండటం ప్రపంచంలో మరే చోట కనిపించదు. ఈ మూడు రూపాలను చూడటానికి మనం 364 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే అంటే వైశాఖ మాసం శుద్ధ తదియ (సాధారణంగా మే నెలలో వస్తుంది.) రోజు మాత్రమే నిజరూప దర్శనానికి వీలవుతుంది.

విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే...విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే...

ఈ వరాహం, సింహం, మనిషి రూపానికి సంబంధించి స్థానికులు చెప్పే దాని ప్రకారం విశిష్టాద్వైతమునకు ఆద్యుడైన రామానుజులవారు శైవగమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని తెలుస్తోంది. ఇక ఈ ఆలయ ప్రధాన ధ్వారం పడమర వైపునకు ఉండటం విశేషం. ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణదేవ రాయలతో సహా ఎంతో మంది రాజులు సందర్శించి అభివృద్ధికి తోట్పాటు అందించారు. ఇలా వరాహం, సింహం, మనిషి రూపంలో ఉన్న విగ్రహంతో ఆలయానికి ఉన్న విశిష్టత గురించి పూర్తి కథనం మీ కోసం....

1. వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం

1. వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం

Image source:


శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.

2. తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయం...

2. తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయం...

Image source:


ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

3. సింహం యొక్క పర్వతమని అర్థం...

3. సింహం యొక్క పర్వతమని అర్థం...

Image source:


సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదని చెబుతారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

4. క్లుప్తంగా....

4. క్లుప్తంగా....

Image source:


ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు'మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

5. మొదట ప్రహ్లాదుడు

5. మొదట ప్రహ్లాదుడు

Image source:


స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు.

6. స్వామివారిని చల్లార్చడానికే...

6. స్వామివారిని చల్లార్చడానికే...

Image source:


విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు.

7. మూడు రూపాలు...

7. మూడు రూపాలు...

Image source:


వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో) వరాహము తల, సింహం తోక, కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు. నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు.

8. శ్రీ కృష్ణదేవ రాయలు

8. శ్రీ కృష్ణదేవ రాయలు

Image source:


గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు (క్రీ.శ.1516 మరియు క్రీ.శ.1519లో) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది. కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని, సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయ ధ్వజము శిలా శాసనము ఉంది.

9.తూర్పునకు కాక...

9.తూర్పునకు కాక...

Image source:


సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. అదువల్ల ఏదైన ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతమవుతుందని నమ్ముతారు. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.

10 కప్ప స్తంభం

10 కప్ప స్తంభం

Image source:


దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.

11. జల ధారలు

11. జల ధారలు

Image source:


సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.

12. భైరవ వాక

12. భైరవ వాక

Image source:


సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది. ఇక వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.

13. గిరి ప్రదక్షణ ప్రత్యేకం

13. గిరి ప్రదక్షణ ప్రత్యేకం

Image source:


ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు.

14. గ్రామ ప్రజల స్వచ్ఛంద సేవ

14. గ్రామ ప్రజల స్వచ్ఛంద సేవ

Image source:


గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.

15. ప్రధాన పూజలు ఇలా...

15. ప్రధాన పూజలు ఇలా...

Image source:


స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. 2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.

16. రవాణా సౌకర్యం ఇలా....

16. రవాణా సౌకర్యం ఇలా....

Image source:


సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది.

17. నామ మాత్రపు రుసుం

17. నామ మాత్రపు రుసుం

Image source:


అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు.

18. పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు

18. పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు

Image source:


ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకోవడానికి వీలుంది.

19. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు...

19. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు...

Image source:


ఆండాళ్‌ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

20. దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలు...

20. దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలు...

Image source:


ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అందువల్ల సింహాచలాన్ని దర్శించే వారు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను కూడా ఎక్కువగా సందర్శిస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X