విదేశీ వలస పక్షుల విడిది గట్టు.. మన నేలపట్టు!
నెల్లూరు జిల్లా నేలపట్టు గ్రామం విదేశీ పక్షుల విడిది కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడి పచ్చదనం పచ్చని తివాచీ పరిచిన హరివిళ్లులా పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. చిటారు కొమ్మన షికారు చేసే విదేశీ పక్షుల కిలకిలా రావాలు మనసుకు మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి.
ఆసియలోనే పక్షుల సంతానోత్పత్తికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన నేటపట్టు గ్రామం నెల్లూరు జిల్లా నాయుడుపేటకు 12 కిలోమీటర్లు దూరంలో దొరవారిసత్రం మండల పరిధిలో ఉంది. ఇక్కడి పులికాట్ సరస్సులో విదేశీ విహంగాల సందడి ఏడాదిలో ఆరు నెలలు ఉంటుంది.
సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం నుంచే పక్షుల నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు, అటవీ ప్రాంతం వైపు సంచరించేవని చెబుతారు. దట్టమైన చిట్టడివి కావడం పక్షులు విడిది చేసేందుకు వీలుగా ఉండడం, జన సంచారంలేని ప్రాంతంగా ఉండడంతో పగలంతా అటవీ ప్రాంతంలో పురుగులు, చేపలను వేటాడి ఆహారంగా తీసుకునేవి. సాయంత్రానికి నేలపట్టు గ్రామంలో చెట్లుపై కిలకిలరావాలతో సందడి చేయడం పరిపాటిగా మారింది.
ఆవాసయోగ్యమైన ప్రాంతం..
మొదటిగా, 1976లో అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేటపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా వున్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతను ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ది చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. పైగా పక్షులకు ఆసియా కండంలోనే అతి పెద్ద రెండవ ఉప్పునీటి పులికాట్ సరస్సు ఉండడం పక్షులకు అనువైన ఆవాసయోగ్యమైన ప్రాంతంగా మారిపోయింది. పక్షి ప్రేమికుల మనసుదోచే ఎన్నో ప్రకృతిసిద్ధ దృశ్యాలను కనులారా వీక్షించేందుకు ఈ సీజన్లో సందర్శకులు నెలపట్టుకు క్యూ కడుతూ ఉంటారు.
పక్షుల రాక శుభసూచికంగా..
అంతకముందు, మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాలు వర్షాలు పడేవి కావట. జీవనోపాధి కోసం గ్రామస్థులు కూలీ పనులకు ఇతర మండలాలలకు వలస వెళ్లేవారని, విదేశీ పక్షులు రావడం ఆరంభించాక, సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్థులు శుభ సూచికంగా భావించామని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. అందుకే, ఈ విదేశీ వలస పక్షులను దేవతా పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పక్షులపై దాడులు, పక్షులను వేటాడనివ్వకుండా సంరక్షించేలా రైతులు సైతం బాధ్యత తీసుకున్నారంటే వీటిపై వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమైపోతుంది. వీటి ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ను కూడా నిర్వహిస్తోంది.
అరుదైన పక్షులు పలకరిస్తాయి..
ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎన్నో అరుదైన పక్షులు పలకరిస్తాయి. గూడబాతులు (పెలికాన్స్), తెల్లకంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, నత్తగుళ్లకొంగలు (ఓపెన్బిల్స్టార్క్స్), నీటి కాకులు, స్వాతికొంగలు, పాముమెడకొంగలతో పాటు బాతు జాతీకి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, ఖజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మ, నేపాల్ తదితర దేశాల నుంచి తరలివస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగివుండడం వీటి సతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని విదేశీ పక్షుల ప్రేమాయణ కేంద్రంగా స్థానికులు చర్చించుకోవడం విశేషం. జీవవైవిధ్యానికి నెలవుగా పేరుగాంచిన నేలపట్టును మీరూ సందర్శించేందుకు బయలుదేరండి మరి!