పరవశింపచేసే పర్యాటక నేల.. పాటియాలా
పంజాబ్ రాష్ట్రంలోని రాచరికపు నగరాలలో పాటియాలా ఒకటి. అలనాటి చక్రవర్తుల పూర్వ వైభవ నేపథ్యాన్ని ఇక్కడ కనులారా ఆస్వాదించవచ్చు. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఈ ప్రాంతం పునాది లాంటిది.
పాటియాలా చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబించే అనేక ప్రదేశాలు ఇక్కడ అడుగడుగునా దర్శనమిస్తాయి. రాజభవనాలు, కోటలు, గురుద్వారాలు మరియు దేవాలయాలతో సహా అనేక పర్యాటక ప్రదేశాల కేంద్రబిందువు అయిన పాటియాలాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
శీష్ మహల్
పాటియాలాలోని అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణాలలో శీష్ మహల్ ఒకటి. దీనిని అద్దాల ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది 19వ శతాబ్దంలో నిర్మించబడిన పాత మోతీ బాగ్ ప్యాలెస్లో ఒక భాగం. అనేక కుడ్యచిత్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మహారాజా నరీందర్ సింగ్ పాలనలో రూపొందించబడ్డాయి. ఈ ప్యాలెస్లోని సరస్సు మరియు దాని ముందు ఉన్న లక్ష్మణ్ జూలా వంతెన దీనికి మరింత అందాన్ని చేరువచేస్తుంది. ఈ కోటతో పాటు, ప్రపంచంలోని అతిపెద్ద పతకాల సేకరణను కలిగి ఉన్న మ్యూజియం కూడా ఉంది. శీష్ మహల్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు సందర్శనార్థం తెరిచి ఉంటుంది.
గురుద్వారా దుఖ్ నివారణ్ సాహిబ్
పంజాబ్లోని అత్యంత ప్రసిద్ధ గురుద్వారాలలో ఒకటైన గురుద్వారా దుఖ్ నివారణ్ సాహిబ్ లెహల్లో ఉంది. ఇది ఇప్పుడు పాటియాలాలో భాగం. శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ చూసుకునే ఈ గురుద్వార సందర్శకులు నిత్యం ఆకర్షిస్తుంది. హుకుమ్నామా ప్రకారం, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు పూర్తి నిబద్ధతతో, ఏకాగ్రతతో ఇక్కడి కోనేరులో మునిగితే పూర్తిగా నయమవుతుందని విశ్వసిస్తారు.
ప్రార్థనతో పాటు, సందర్శకులు నిమగ్నమయ్యే అనేక ఇతర కార్యకలాపాలు ఉంటాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం అందించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా, ఈ గురుద్వారా వైద్యం చేసే సామర్థ్యాల ద్వారా ఖ్యాతి పొందింది. పాటియాలాలోని గురుద్వారా దుఖ్ నివారణ్ సాహిబ్ సందర్శించేందుకు ఉదయం 4:00 నుండి రాత్రి 11:45 గంటల మధ్య అనుమతి ఉంటుంది.
మోతీ బాగ్ ప్యాలెస్
పాటియాలాలోని మోతీ బాగ్ గంభీరమైన చారిత్రాత్మక ప్యాలెస్. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పాటియాలా మహారాజుచే 1840లలో నిర్మించిన ఈ ప్యాలెస్ అసలు నిర్మాణం 1920లో మహారాజా భూపిందర్ సింగ్ నాయకత్వంలో పునర్ నిర్మించబడింది. ఇది 15 డైనింగ్ హాల్లను కలిగి ఉంది. ఛత్రీలు మరియు ఝరోఖాలతో ఆకట్టుకునే వాస్తుశిల్పాలు సందర్శకులకు ఆదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ప్యాలెస్లోనే నిర్వహించబడుతోంది. ఇది గతంలో మ్యూజియంగా ఉండేది. మోతీ బాగ్ ప్యాలెస్ని సందర్శించడానికి ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు తెరిచి ఉంటుంది.
బారాదరి తోటలు
మహారాజా రాజిందర్ సింగ్ పాలనలో, షెరన్వాలా గేట్కు దగ్గరగా ఉన్న పాత పాటియాలా నగరానికి ఉత్తరాన ఉన్న బరాదరి గార్డెన్లు నిర్మించబడ్డాయి. ఇది అనేక అసాధారణ మొక్కలు, అరుదైన పూలతో పర్యాటకులను నిత్యం ఆకర్షిస్తోంది. ఈ తోటలో మహారాజా రాజిందర్ సింగ్ విగ్రహం కూడా ఉంది. క్రికెట్ స్టేడియం, స్కేటింగ్ రింక్ ఇందులో ఉన్నాయి. అలాగే, ఇప్పుడు హెరిటేజ్ హోటల్గా ఉన్న రాజిందర్ కోఠి ప్యాలెస్ను రాజ గృహంగా రూపొందించారు. బారాదరి గార్డెన్స్ ఉదయం 6:30 నుండి సాయంత్రం 7:00 వరకు పర్యాటకుల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది.