గుడ్న్యూస్.. విశాఖ-అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్
శీతాకాలంలో అరకు అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. అక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు సుదూర ప్రాంతాలను నుంచి ప్రకృతి ప్రేమికులు ఈ సీజన్లో అరకులో వాలిపోతారు. అక్కడి అందాలు ఒకెత్తు అయితే, అరుకు చేరుకునేందుకు చేసే రైలు ప్రయాణం మరో ఎత్తు.
పదుల సంఖ్యలో చీకటి గుహలను దాటుకుంటూ.. ఒంపులు తిరిగే పచ్చని కొండ కోనల నడుమసాగే ఈ రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను అందిస్తుంది. అరకు పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు విశాఖ-అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ అనుసంధానం చేశారు అధికారులు. ఆ వివరాలు మీకోసం..
విశాఖ-అరకు మద్య రైలు ప్రయాణానికి ఎక్కువ మంది పర్యాటకులు ఇష్టపడతారు. ఈ మార్గం గుండా ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. ప్రయాణించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల అరకు సందర్శనకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువయింది. దీంతో చాలామంది రైలు ప్రయాణానికి దూరమవుతున్నారు.
అంచేత పర్యాటకుల రద్దీ మరియు ప్రయాణీకుల డిమాండ్ను తీర్చడానికి విశాఖపట్నం- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ను జతచేయనున్నట్లు వాల్తేరు డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఆహ్లాదరకమైన పర్యాటక అనుభూతిని ప్రయాణీకులకు చేరువ చేసేందుకు ఇండియన్ రైల్వే ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా మరోసారి చాటిచెప్పారు.
ఎక్కువ ఆసక్తి చూపిస్తారు..
ఆంధ్రా ఊటిగా పిలుచుకునే అరకు రైలు ప్రయాణంలో 84 వంతెనలు, 58 సొరంగ మార్గాలు పలకరిస్తాయి. ఓవైపు చీకటి గుహలు స్వాగతం పలుకుతుంటే, మరోవైపు పచ్చదనంతో నిండి లోయలు ఆహ్లాదాన్ని చేరువ చేస్తాయి. అందుకే, పర్యాటకులు రోడ్డు మార్గంలో కంటే, రైలు ప్రయాణానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైలు నంబర్ 08551, విశాఖపట్నం-కిరండూల్ 5 జనవరి మరియు 24 ఫిబ్రవరి 2023 మధ్య ప్రత్యామ్నాయ రోజు అదనపు విస్టాడోమ్ కోచ్తో జతచేయబడుతుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08522, కిరండూల్-విశాఖపట్నం 6 జనవరి మరియు 25 ఫిబ్రవరి 2023 మధ్య ప్రత్యామ్నాయ రోజున అదనపు విస్టాడోమ్ కోచ్తో జతచేయబడుతుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచు తెరలను చీల్చుకుంటూ సాగే ఈ ప్రయాణంలో పర్యాటకుల ఆనందానికి అవదులు ఉండవనే చెప్పాలి.
ఎవరు వదులుకుంటారు..
ఈ శీతాకాలపు పర్యాటక సీజన్లో విశాఖపట్నం-అరకు రైలులో అదనపు విస్టాడోమ్ కోచ్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ అధికారులు చెబుతున్నారు. ఈ విస్టాడోమ్ కోచ్ విశాఖ- అరకులోయ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొండ కోనల అందాలు.. అందమైన లోయలు..
చూసేంత దూరం పచ్చదనం.. ఉత్సాహాన్ని ఇచ్చే కేరింతలు.. భూతల స్వర్గమా అనిపించే ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించే అరకు రైలు ప్రయాణాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. అదనపు విస్టాడోమ్ కోచ్తో అరకు పర్యాటకం సందర్శకులకు మరింత చేరువ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం కుటుంబసమేతంగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.