సంప్రదాయపు సాహస క్రీడ కంబాల పిలుస్తోంది!
ఏటా కంబాల సీజన్లో కర్ణాటకలోని అనేక తీరప్రాంత జిల్లాల్లో గేదెల పందేల కోసం సిద్ధమవుతాయి. ఇందుకోసం స్వచ్ఛమైన మట్టి మరియు నీటితో నింపిన ప్రత్యేక రేస్ట్రాక్లను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం స్థానికులతోపాటు పర్యాటకులు మరియు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. ఈ సంవత్సరం షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించి, నిర్వహిస్తున్నారు కూడా. కంబాల విశేషాలు తెలుసుకుందాం.
కోస్తా కర్ణాటకలో కంబాల సీజన్ కొనసాగుతోంది. ఈ వార్షిక గేదెల పందెం రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ కార్యక్రమం. కర్ణాటక పర్యాటక శాఖ ఇప్పటికే నవంబర్ 2022 మరియు ఏప్రిల్ 2023 మధ్య ఈవెంట్ల షెడ్యూల్ను విడుదల చేసింది. కర్ణాటకలోని వ్యవసాయ ప్రాంతాలలో కంబల ఓ వార్షిక పండుగ. చలికాలంలో పోటీదారులు తమ శిక్షణ పొందిన గేదెలతో కలిసి బురదతో కూడిన పొలాల్లో పరుగెత్తుతూ జరుపుకుంటారు. రేసింగ్ ఈవెంట్లు సాధారణంగా నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య నిర్వహించబడతాయి.
నిజానికి కంబాల పండగ ఎందుకు జరుపుకుంటారంటే, అందుకు భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సంప్రదాయాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం రాజులు రాచరికపు కాలక్షేపంగా ప్రారంభించారని కొందరు వాదిస్తున్నారు. అలాగే, మరికొందరు రైతుల ఐక్యతకు చిహ్నంగా దీనిని నిర్వహిస్తున్నట్లు చెబుతారు. పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఈ పోటీలను నిర్వహిస్తారని మరికొందరు విశ్వసిస్తారు.
ఆనవాయితీగా వస్తోంది..
రేసులో గేదెల జట్లు తమ జాకీతో పాటు రెండు సమాంతర రేస్ట్రాక్లపై ముగింపు రేఖ వైపు దూసుకుపోతాయి. విజేతలు చివరి రేసు వరకు తదుపరి రౌండ్లకు వరుసగా అర్హత పొందుతూ వెళతారు. అలా గెలుపొందినవారికే కాకుండా గమ్యాన్ని చేరకునే క్రమంలో ప్రేక్షకులు మన్ననలు పొందినవారికిసైతం బహుమతులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతంలోని యజమానులు, రైతులు తమ గేదెలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పుష్టికరమైన కంబాల గేదెలు 140-మీటర్ల రేస్ట్రాక్ను 12 సెకన్ల కంటే తక్కువ సమయంలో పూర్తి చేయగలవు.
2020లో, గేదెల రేసర్ శ్రీనివాస్ గౌడ్ రెండు గేదెల వెనుక 13.62 సెకన్లలో 142.5 మీటర్లు పరిగెత్తి, వార్షిక రేసులో రికార్డు సృష్టించాడు. ఇది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగుతో సమానం. లైవ్మింట్ నివేదిక ప్రకారం ఉసేన్ బోల్ట్ యొక్క ప్రపంచ రికార్డు 9.58 సెకన్ల కంటే మెరుగైనదిగా రికార్డులకు ఎక్కింది. గౌడ ఒక భవన నిర్మాణ కార్మికుడు. ట్రాక్ ట్రయల్స్లో పాల్గొనమని క్రీడా మంత్రిచే ఆహ్వానించబడ్డాడు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా గౌడకు ట్రయల్స్లో పాల్గొనేందుకు వృత్తిపరమైన సహాయం పొందేందుకు సహకరించింది.
మార్గదర్శకాలను జారీ..
ఈ పోటీల కారణంగా కంబాల గేదెలకు హాని జరగకుండా, హింసించబడకుండా లేదా అసభ్యంగా ప్రవర్తించబడకుండా ఉండేలా భారత సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా జరుపుతోన్న ఈ వేడుకకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించింది. కోస్తా కర్ణాటకలోని 45కి పైగా వివిధ గ్రామాలు కంబళాన్ని జరుపుకుంటాయి.
వరి కోత కాలం తర్వాత మంగళూరు, ఉడిపి, మూడబిదిరే తదితర పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాలను నుంచి ఈ క్రీడలను ఆస్వాదించేందుకు సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ కారణంగా కంబాల వేడుకలు ఎంతో ఖ్యాతిపొందాయి.