పర్యాటకులకు స్వర్గధామం వరంగల్ జిల్లా. స్మార్ట్ సిటిగా ఎంపికైన వరంగల్ త్వరలో దేశంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా నిలవనుంది. చాలా మంది పర్యాటకులకు ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా, ప్రచారం లేకపోయినా ఆశ్చర్యపోయేంత ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంతం. చుట్టూ దట్టమైన అడవి..పచ్చని కొండలు..వాటి మీద నుండి దూకే జలపాతం ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశమో.
ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక వాతావరణం, చారిత్రక ఘట్టాలు ఇవన్నీ సమాహారంగా కనబడుతూ కనువిందు చేస్తున్న క్షేత్రమే 'భీముని పాదం'. ఈ జలపాతం చూడటానికి చిన్నగా కనిపించినా, చుట్టూ ఉన్న అడివి మిమ్మల్ని మైమరపిస్తుంది. ఈ జలపాతాన్ని చూడగానే మంత్రముగ్థులను చేస్తూ మనస్సుని ప్రశాంతపరిచే ఈ భీముని పాద జలపాతం వరంగల్ జిల్లా గూడూరు మండలం, సీతానగరంలో అలరారుతోంది. మరి ఈ భీముని పాదం జలపాతంకు ఆ పేరు ఎలా వచ్చింది, దాని చారిత్రక కథ ఏంటి, ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం..
70అడుగుల ఎత్తునుంచి దూకే ఈ జలపాతం
ఈ జలపాతం పక్కనే పెద్ద గుహ కూడా ఉంది. కాసేపు అక్కడ గడిపితే.. మనసు ఎంతో పులకరిస్తుంది అంటారు ప్రకృతి ప్రేమికులు. అందుకే ఏ కాస్త వీలు చిక్కినా చుట్టుపక్కలఊళ్లవాళ్లంతా అక్కడకు వెళ్లి సేదతీరుతుంటారట. 70అడుగుల ఎత్తునుంచి దూకే ఈ జలపాతం.. వర్షాకాలంలో కనులవిందుగా ఉంటుంది. ఈ కాలంలో జలపాత ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సాయంసంధ్యలో సూర్యకిరణాలు జలపాతం మీదపడి ప్రతిబింబించడం వల్ల అది ఇంద్రధనస్సులా మెరుస్తూ మరింత శోభాయ మానంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని విక్షీంచడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి.
PC: YOUTUBE
పురాణ కథ ప్రకారం
పురాణ కథ ప్రకారం ఒకప్పుడు యాదవ రాజు పాపమేడగుట్ట ప్రాంతాన్ని పరిపాలించేవారట. ఆయనకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్యని ఆమె కుమార్తెను చంపాలని చిన్నభార్య కుట్ర పన్ని, అందుకోసం ఓ లక్కమేడ కట్టించి అందులో వాళ్ళ ఉండగా నిప్పు పెట్టించిందట.
PC: YOUTUBE
పాండవులు అరణ్య వాసం చేస్తూ
పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట. ఆ సమయంలో ఈ కుటుంబం మంటల్లో చిక్కుకుని గట్టిగా కేకలు పెట్టగా, అజ్ఝాతవాసంలో ఉన్న భీముడు అటుగా వెళ్తూ ఆ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆర్పేసి వారిని రక్షించాడని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ కనబడే అతి పెద్ద పాదముద్ర ఆయనదేనని చెబుతుంటారు. ఈ ప్రదేశంలో ఉన్న ఆ కొండరాయి ఒక పాదం ఆకారంలో ఉండటం వల్ల, ఆ పాదముద్రపై నుండి జలపాతం కిందికి జళజళ దూకుతుంటుంది. ఆ కారణం వల్ల ఈ క్షేత్రానికి భీముని పాదం అనే పేరు వచ్చింది.
PC: YOUTUBE
మరో స్థానికుల కథనం ప్రకారం
మరో స్థానికుల కథనం ప్రకారం రెండు గుట్టల మధ్య ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారని, ఎండాకాలంలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు చేసిన ఆర్తనాదాలు విన్న భీముడు వారిని రక్షించినట్టు కథలుగా చెబుతారు. భీముడి అడుగువేయడంతో వచ్చిన నీటితో అక్కడ జలపాతంగా మారిందట. అలా భీముడి పాదంగా పేరు వచ్చింది. కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం కేవలం ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు, మూడు చెరువులు నిండేలా చేస్తుంది.
PC: YOUTUBE
ఇలా నిండిన చెరువుల నీరు
ఇలా నిండిన చెరువుల నీరు నుండే పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు ఈ జలధారపై ఆధారపడే వ్యవసాయం చేస్తుంటారు. ఈ ప్రదేశంలో ఉన్న స్థానికులంతా కూడా ప్రతియేటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి ఈ జలపాతంలో స్నానాలు చేసి, ఆ ప్రక్కనే ఉన్న శివలింగాన్ని , నాగదేవత విగ్రహాన్ని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అక్కడే వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తారు.
PC: YOUTUBE
భీముని పాద జలపాతం జలధారలతో
సహజ సిద్దంగా ఏర్పడిన ఈ భీముని పాద జలపాతం జలధారలతో అలరిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో అంతుపట్టని రహస్యంగానే ఉంది. 70 అడుగుల ఎత్తు నుండి జాలు వారే జలాధార పర్యాటకుల్ని ఉల్లాసరుస్తుంది. ఈ జలపాతం పక్కనే ఒక గుహ ఉంది. ఇక్కడికి పది కి.మీ దూరంలో గల బల్లకొండ ఆలయం వరకూ ఈ గుహ మార్గం ఉందని స్థానికులు చెబుతారు.
PC: YOUTUBE
పూర్వం అక్కడ తపస్సు చేసే బుుషులు
పూర్వం అక్కడ తపస్సు చేసే బుుషులు ఈ గుహమార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించే వారని చెబుతారు. ఆధ్యాత్మిక ప్రభావం సంగతి అటుంచితే, ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి తరించడానికి వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. జలపాతం కింద స్నానాలు చేసి మానసికపరమైన ఒత్తిడి నుంచి విముక్తులవుతుంటారు.
PC: YOUTUBE
వరంగల్ భీముని పాద జలపాతానికి పర్యటనకు వెళ్ళినప్పుడు
వరంగల్ భీముని పాద జలపాతానికి పర్యటనకు వెళ్ళినప్పుడు అలాగే వరంగల్ లోని చారిత్రక కట్టడాలైన ఓరుగల్లు కోట, వెయ్యి స్థంభాల గుడి, రామప్పగుడి, కోట గుళ్లు, భద్రకాళీ దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.
PC: YOUTUBE
వరంగల్ పర్యాటకం
వరంగల్ పర్యాటకం ఈ భీముని పాదం జలపాతాన్ని చూడకుండా ముగియదు. ఈ జలపాతానికి ప్రైవేట్ వాహనాల్లోగాని, సొంత వెహికిల్స్లో ప్రయాణించి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి 88కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణానికి 51 కిలోమీటర్ల దూరంలో గూడూరు నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్.. సీతానాగారం.. కొమ్ములవంచ మీదుగా వెళ్లొచ్చు.
PC: YOUTUBE
వరంగల్ పర్యాటకం
గూడూరు నుంచి వెళ్లాలనుకునే వాళ్లు గూడూరు.. చంద్రుగూడెం.. లైన్తండా.. వంపుతండాల మీదుగా భీమునిపాదానికి చేరుకోవచ్చు. కొత్తగూడెం నుంచి వెళ్లాలనుకునేవాళ్లు కోలారం.. బత్తులపల్లి.. గోపాలపురం మీదుగా భీమునిపట్నం చేరుకోవచ్చు. నర్సంపేటకు 59.5 కి.మీ. అక్కడి నుంచి 17 కి.మీ.దూరంలో 14వ కిలోమీటరు దగ్గర భూపతిపేట్కి రెండు నుంచి 3 కి.మీ. దూరం ప్రయాణించి కొమ్ముల వంచ గ్రామానికి చేరుకుంటే భీముని పాద జలపాతానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఉండడానికి వసతుల్లేవు. నేరుగా వరంగల్కు చేరుకుని బస చేయాల్సిందే.
PC: YOUTUBE