భారత దేశం అద్భుత వారసత్వ సంపదల గని. చాళుక్య, మౌర్య, కదంబ, హోయసాల, విజయనగర వంటి మరెన్నో పేరెన్నికగన్న వంశాలు ఈ రాష్ట్రాన్ని పాలించాయి. ఈ సామ్రాజ్యాలు తమ కీర్తికి తార్కాణాలుగా, అత్యద్భుతమైన నిర్మాణశైలి కలిగిన ఆలయాలు, కోటలు మరియు రాజభవనాలను నిర్మించాయి. అటువంటి నిర్మాణాలను చూసే అవకాశం, వాటి వెనుక దాగి ఉన్న అబ్బురపరిచే కథలను తెలుసుకోగలగడం మనం చేసుకున్న అదృష్టం. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో వివిధ వంశీయులు నిర్మించిన ఘనమైన కోటలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో కొన్ని కోటలు, వివిధ తరాల్లో జరిగిన యుద్ధాలలో కొంతమేరకు దెబ్బ తిన్నప్పటికీ, ధృఢంగా మరియు ఎత్తుగా మన గత వైభవానికి చిహ్నాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఈ కోటలు వివిధ వంశాల చరిత్రను మన కళ్లకుకడుతూ, ప్రసిద్ధి దర్శనీయ స్థలాలుగా రూపాంతరం చెందాయి.
చిత్రదుర్గ కోట
P.C: You Tube
చిత్రదుర్గలో, 17 వ మరియు 18 వ శతాబ్దాలలో అంచెలంచెలుగా కట్టబడిన చిత్రదుర్గ కోట, వివిధ రాజవంశాలచే మార్పులు చేయబడిన ఒక అద్భుతమైన కట్టడం.ఈ కోటలో ఏడు వలయాకార గోడలుంటాయి. వీటిలోని మూడు నేల మీద మరియు నాలుగు కొండ మీద ఉంటాయి. అందుకే దీనిని కన్నడంలో "ఎలు సుత్తిన కోటే" అనగా "ఏడు వలయాకార గోడల కోట" అంటారు.ఈ కోటలో అత్యద్భుతమైన దుర్గాలు, గిడ్డంగులు మసీదు (హైదర్ ఆలీ సమయంలో నిర్మింపబడినది) మరియు అనేక మందిరాలు ఉన్నాయి. ఇది బెంగుళూరుకు 200కి.మీ మరియు హంపికి120 కి.మీ దూరంలో ఉంది.
బాదామి కోట
P.C: You Tube
బాదామి ఒకప్పటి బాదామి చాళుక్య వంశీయుల రాజధానిగా ఉండేది. ఇది ఎర్రని ఇసుకరాళ్ల మధ్య నిర్మింపబడినది. బాదామిలో ప్రసిద్ధి గాంచిన గుహాలయాలు మరియు బాదామి కోట ఉన్నాయి.గుహాలయాలకు ఎదురుగా అత్యున్నతమైన బాదామి కోట ఉంది. చాళుక్యుల నిర్మాణశైలిలో కట్టబెట్టిన ఈ కోటలో రెండంచలుగా కోట గోడలు నిర్మింపబడ్డాయి. ఆనాటి రోజుల్లో, శత్రువులపై దాడికి యుద్ధాలలో ఉపయోగించిన భారీ ఫిరంగులు ఇప్పటికీ ఈ కోటలో ఉన్నాయి. పహారా బురుజులు, ధాన్యాగారాలు, నగిషీలు మరియు అద్భుతమైన శిల్పసంపద కలిగిన దేవాలయాలు కోటగోడ లోపల దర్శనమిస్తాయి.
మిర్జన్ కోట
P.C: You Tube
ఉత్తర కర్నాటక యొక్క పశ్చిమ తీరంలో కుంతాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జన్ కోట, 16 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ కోట నిర్మాణానికి సంబంధించిన వివిధ కధలు ప్రచారంలో ఉన్నప్పటికీ, దీనిని ఎవరు నిర్మించారనే విషయంలో స్పష్టత లేదు. ఈ ప్రదేశం పురావస్తు శాస్త్రవేత్తలకు స్వర్గంధామం. ఇంకా వెలికితీయాల్సిన ఎన్నో పురాతత్వ సంపదలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) వారు నిర్వహించిన తవ్వకాలలో , చైనీయుల పింగాణీ, ఇస్లామిక్ శాసనాలు, పోర్చుగీస్ వైస్రాయిలకు ఇవ్వబడిన బంగారు నాణేలు మరియు మరిన్ని ఆసక్తికరమైన వస్తువులు బయటపడ్డాయి.
బెంగళూరు కోట
P.C: You Tube
నగరం యొక్క రణగొణ ధ్వనుల మధ్య స్థితమైన ఈ కోట కే. ఆర్ మార్కెట్ కు సమీపంలో ఉంది. 1527 లో బెంగుళూరు స్థాపకుడైన కెంపెగౌడ చేత నిర్మింపబడినది. మొదట్లో ఒక మట్టి కోట మాత్రమే. అటు పై ముఖ్యంగా హైదర్ ఆలీ హయాంలో ఇది ఒక రాతి కోటగా మార్చబడింది. తరువాత టిప్పు సుల్తాన్ చేతిలోకి, చివరకు బ్రిటీష్ వారి హయాంలోకి చేరింది. ఈ కోట లోపలే టిప్పు సుల్తాన్ వేసవి విడిది ఉంది.
బళ్లారి కోట
P.C: You Tube
పేరుకు తగ్గట్టుగా బళ్లారి కోట కర్నాటకలోని బళ్లారి నగరంలో ఉంది. దీనిని బళ్లారి గుట్టపై నిర్మించారు. దీనిలో రెండు విభాగాలు ఉన్నాయి. ఎగువ విభాగం విజయనగర సామ్రాజ్యం యొక్క హనుమప్ప నాయక నిర్మించినట్లు చెబుతారు.18 వ శతాబ్దంలో హైదర్ ఆలీచేత దిగువ విభాగం నిర్మించపడింది.607 మీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ కోట, చతురస్రాకారంలో ఉంటుంది.
బీదర్ కోట
P.C: You Tube
బహమని రాజవంశ కాలంలో నిర్మించబడిన ఈ బిదర్ కోట ఒక స్మారక కట్టడం, కోటలో చాలా భాగం ఘనంగా నిర్మితమైనది. ఈ కోటలో రంగీన్ మహల్, తఖ్త్ మహల్, తార్కాష్ మహల్ మొదలైనవి ఉన్నాయి, ఇవి బహ్మనీలు మరియు మొఘలుల సమయములో వివిధ ప్రయోజనాలను అందించాయి.బాలీవుడ్ చిత్రం 'ది డర్టీ పిక్చర్' సినిమాలోని ఇష్క్ సుఫియానా పాట ఈ కోటలో చిత్రీకరింపబడింది. ఇది ఒక అద్భుతమైన చిత్రీకరణ ప్రదేశం కనుక , చాలా కన్నడ సినిమాలు కూడా చిత్రీకరించబడ్డాయి.
జలదుర్గ కోట
P.C: You Tube
రాయచూరులోని జలదుర్గ కోట బీజాపూర్ లోని అదిల్ షాహి వంశీయులు నిర్మించారు. ఇది కృష్ణ నదిపై ఒక ద్వీపం యొక్క అంచున ఉన్న కొండపై ఉంది. అందువల్ల, కోట ఒక పక్కాగా, కృష్ణ నది ఒడ్డున ఉన్న అగాధం దర్శనమిస్తుంది.కోటలోని ఒక ప్రదేశం నుండి, ప్రత్యర్ధులు మరియు నేరస్తులను నదిలోకి లేదా గుట్టల లోకి విసిరిపారేసే వారని ఒక కధ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు రాజభవనాలు, గుమ్మటాలు మరియు ప్రాసాదాలతో విలసిల్లిన ఈ కోట, ఇప్పుడు శిధిలావస్థలో ఉంది. ఏదేమైనా, కొంతమంది పాలకుల సమాధులు ఇప్పటికీ ఈ కోటలో చూడవచ్చు.
బసవకళ్యాణ కోట
P.C: You Tube
ఒకప్పుడు కళ్యాణి కోటగా పిలువబడిన బసవకళ్యాణ కోటను బిదర్ జిల్లాలో , 10 వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య వంశరాజైన నలరాజు నిర్మించాడు. తరువాతి కాలంలో, 12 వ శతాబ్దంలో ఈ కోటకు గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిన బసవేశ్వరుని పేరు పెట్టారు.ఈ కోటలో 7 ద్వారాలు ఉన్నాయి, వాటిలో 5 మంచి ఆకారంలో ఉన్నాయి. కోట ప్రహరీ యొక్క ముఖ్య ద్వారాన్ని అఖండ్ దర్వాజా అంటారు. దీనిని నాలుగు ఎర్ర రాతి పలకలను ఉపయోగించి నిర్మించారు. కొండ చుట్టూ విసిరేసినట్టు ఉండే ఈ కోట, ప్రకృతితో కలిసి ముసుగు కప్పుకున్నట్లు ( కేమోఫ్లెజ్) వ్యూహాత్మకంగా డెక్కన్ పాలకులచే నిర్మించబడినది.