ఇసుక తిన్నెల మాటున దాగిన.. జైసల్మేర్ అందాలు!
ఎడారి ప్రాంతంలో ప్రయాణం అంటే అదో కొత్త అనుభవం. అదీ ఈ సీజన్లో అయితే, ఆ మాట వినగానే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలా ఎడారిలో హాయిగొలిపే ప్రయాణం చేద్దామంటే వాతావరణాన్ని అంచనా వేసుకుంటూ బయలుదేరనివారు ఎవరుంటారు చెప్పండి. ఇసుకతిన్నెల మాటున దాగిన జైసల్మేర్ అందాలను చూసేందుకు కుటుంబసమేతంగా మొదలుపెట్టిన ప్రయాణంలో ఎదురైన ఎన్నో అనుభూతులు చూసొద్దాం రండి!!
మా మిత్రులంతా కలిసి ప్రతి ఏడాది దూర ప్రాంతాలకు కుటుంబసమేతంగా విహారానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అలా ఫ్యామిలీ టూర్ను ఈ నెలలోనే నిర్వహిస్తున్నామని ఫోన్ వచ్చింది. అదీ మేం ఎంతో ఇష్టపడే ప్రాంతం జైసల్మేర్. ఇది రాజస్థాన్లోని థార్ ఎడారి నడిబొడ్డున ఉన్న నగరం. చాలా ఏళ్ల నుంచి జైసల్మేర్ అందాల గురించి వింటూనే ఉన్నాం, కానీ వెళ్లడానికి మాత్రం ఎప్పుడూ వీలు కాలేదు. వెంటనే మేమూ బయలుదేరుతున్నాం అని ఫోన్ పెట్టేసి, క్యాంపెన్ను బుక్ చేసుకున్నాం. ఐదుగురితో కలిపిన ఫ్యామిలీ ట్రిప్ ఇది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి, ఐదురోజులకు ఐదు వేలు చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పారు.
అన్ని ఖర్చులూ అందులోనే. ఆ ఆఫర్ వినగానే ఇంకా ఆనందమేసింది. ఎందుకంటే, ఐదువేలతో ఐదురోజుల ప్రయాణంతో అన్నీ చుట్టేయొచ్చు. ఆలస్యం చేయకుండా మా కుటుంబమంతా ఉదయం భోపాల్ నుంచి అజ్మేర్ బయలుదేరాం. అజ్మేర్లోని ప్రసిద్ధ షరీఫ్ అజ్మేర్ దర్గాను చేరుకున్నాం. అక్కడకు చేరుకోగానే నాలుగు గంటల ప్రయాణం ఎలా జరిగిందో మర్చిపోయాం. కొద్దిసేపు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాం. అజ్మేర్లో ఫేమస్ అయిన కచోరియా రుచులను ఆరగించి పుణే స్టేషన్ చేరుకున్నాం. అక్కడ మధ్యాహ్నం.. రెండు గంటలకు బయలుదేరిన ట్రైన్ రాత్రి 11 గంటలకు జైసల్మేర్కు చేరుకుంది.
మొదటిరోజు
రాత్రి 11 గంటలకు క్యాంప్ ఇన్ఛార్జీ అక్కడ మేం ఉండాల్సిన ప్రాంతాన్ని చూపించారు. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో టెంట్ను ఏర్పాటుచేశారు. మొదట టెంట్లనగానే నేను కొద్దిగా భయపడ్డాం. భార్యా, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని భయపడ్డాం. అయితే, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైటింగ్ సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. మేం వెళ్లేసరికి అర్ధరాత్రి కావడంతో కొద్దిసేపయ్యేసరికే అందరూ నిద్రలోకి జారుకున్నారు.
రెండో రోజు
మరుసటి రోజు ఉదయమే అందరం లేచి, తయారయ్యాం. ఆలోగా వేడి వేడి టిఫిన్ మాకోసం సిద్ధంచేశారు. దాదాపు ఓ పది కుటుంబాలు ఆ క్యాంప్లో పాల్గొన్నాయి. వారందరితో మా పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం పూర్తవ్వగానే గోల్డెన్ సిటీ జైసల్మేర్ అందాలను వీక్షించేందుకు బయలుదేరాం. ముందుగా హావేలియా పట్వే, నాథల్ వంటి దర్శనీయ ప్రాంతాలను చూసి మధ్యాహ్నం రెండు గంటలకు భోజనానికి మళ్లీ టెంట్ దగ్గరికి చేరుకున్నాం. లంచ్ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం.
మళ్లీ మూడు గంటలకు మా ప్రయాణం మొదలయ్యింది. అక్కడికి దగ్గరలోనే క్యామెల్ కార్ట్ (ఒంటె బండ్లు), జీఫ్ సవారీ అన్నింటినీ తిరిగేశాం. అక్కడి నుంచి రావడానికి మనసు అంగీకరించలేదంటే నమ్మండి! ఇతర ప్రాంతాలను చూడాలంటే అక్కడి నుంచి రావాల్సిందే కదా! అని అందరం బయలుదేరాం. క్యాంప్కు చేరుకునేసరికి రాత్రి అయ్యింది. సంప్రదాయం ప్రకారం రాత్రి అందరం ఒకచోట చేరి, మా అనుభవాలను పంచుకున్నాం. పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, వారి గురించి చెప్పడం ఇలాంటి కార్యక్రమాలతో రాత్రి ఎలా గడిచిపోయిందో తెలియలేదు.
మూడో రోజు
మరుసటి రోజంతా అక్కడి సరిహద్దులలోనే తిరగాల్సి ఉంటుందని క్యాంప్ నిర్వాహకులు నిర్ణయించారు. దానికోసం ముందుగానే అన్నీ సిద్ధంచేశారు. మొదటగా రామ్ ఘడ్ దారిగుండా వెళ్లి తనోట్ సరిహద్దును చేరుకున్నాం. దారి మధ్యలో ఆసియాలోనే ఎత్తయిన టీవీ టవర్ మాకు ఎదురుపడింది. తనోట్లో ఓ ప్రసిద్ధ మందిరమూ ఉంది. గతంలో జరిగిన యుద్ధంలో ఈ మందిరంపై అనేకసార్లు బాంబుల వర్షం కురిసిందని, అయినప్పటికీ ఆ మందిరం చెక్కు చెదరలేదని స్థానికులు చెబుతున్నారు. తనోట్ నుంచి సుమారు 110 కిలోమీటర్ల మార్గం అంతా ఎడారిలో వెళ్లాలి. ఆ సమయంలో థార్ అసలైన సౌందర్యాన్నీ వీక్షించాల్సిందే.
అంతటి ఎండ తీవ్రతా చిన్నబోయినట్లు అనిపించింది. ఎంత దూరం నుంచి చూసినా ఇసుక సముద్రంలా కనిపిస్తుంది. అంతటి అద్భుతమైన దృశ్యాలను జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిందే. ఎందుకు ఈ ప్రాంతం విదేశీయుల్ని ఇంతగా ఆకర్షిస్తుందో అప్పుడు అర్థమైంది. తనోట్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో లోన్గేవాలా వెళ్లాలనుకున్నాం. ఈ ప్రాంతాన్ని అప్పట్లో ఉత్తమచిత్రంగా ప్రకటించిన "బోర్డర్" సినిమాలో చూశాం. ఈ ప్రాంతంలోనే భారత సైనికులు ఎంతో చాకచక్యంగా పాకిస్తాన్ సైనికులను సరిహద్దులు దాటకుండా ఆపారంట! ఎందరో వీరుల స్మారక చిహ్నాలూ ఇక్కడ ఉన్నాయి. ఆ వీరులకు శ్రద్ధాంజలి ఘటించాం. అక్కడే మేం తెచ్చుకున్న లంచ్ను తినేసి, తిరిగి క్యాంప్కు సిద్ధమయ్యాం. క్యాంప్కు చేరుకునేసరికే స్నాక్స్ సిద్ధంగా ఉన్నాయి.
నాలుగో రోజు
అక్కడికి దగ్గరలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను చూద్దామనుకున్నాం. అందులో కుల్దారా ప్రాంతాన్ని ముందుగా ఎంచుకున్నాం. ఈ ప్రాంతాన్ని గోస్టన్ అనీ పిలుస్తారు. ఆ గ్రామంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని, అందుకనే పాలీవాల్ సమాజానికి చెందిన 84 గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేశారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఇళ్లన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. కానీ, ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఏంటో మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. తిరిగి వచ్చేదారిలో లంచ్ చేశాం. ఇతర ప్రాంతాలను వీక్షించాం. పాలీవాలి గ్రామంలో ఇప్పటికీ కొన్ని గృహాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నారు. సాయంత్రం నాలుగు
గంటలకు తిరిగి క్యాంప్కు తిరిగొచ్చాం. అందరూ అలసిపోవడంతో రాత్రి త్వరగానే నిద్రపోయాం.
జైసల్మేర్లో ఆఖరిరోజు
ఈ రోజు ఫ్రీ డే.. ఎందుకంటే, ఎవరెవరికి ఏమేం కావాలో కొనుక్కోవడానికి వెళ్లారు. ఇంకా ఏమైనా చూడాలనుకున్నవారు చూడ్డానికి వెళ్లారు. టెంట్లన్నీ ఖాళీ చేయడం ప్రారంభించాం. ఒక్క గంటలోనే అక్కడ ఓ నిర్మానుష్యమైన వాతావరణం ఏర్పడింది. నాలుగురోజుల్లోనే అక్కడికి వచ్చిన వారందరం స్నేహితులుగా మారిపోయాం. మళ్లీ కలుద్దామనకుంటూ అందరూ వీడ్కోలు చెప్పుకుంటూ బయలుదేరాం. మేమూ సాయంత్రం ట్రైనుకు బయలుదేరాం. మరెందుకు ఆలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.