సికింద్రాబాద్ టు గుజరాత్ పర్యటనకు ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజీ
గుజరాత్ పర్యాటకం పరంగా సంపన్నమైన రాష్ట్రం. భారతదేశంలోని పశ్చిమాన ఉన్న ప్రధాన రాష్ట్రాలలో ఒకటైన గుజరాత్ పురాతన సంస్కృతి, సహజసిద్ధమైన ప్రకృతి దృశ్యాలు, రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. గుజరాత్లోని పర్యాటక ప్రదేశాలు మరియు ఆకర్షణల కారణంగా దీనిని ది ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్ అని పిలుస్తారు. గుజరాత్ను ఆసియా సింహాల నిలయం అని కూడా అంటారు.
ఇక్కడ రాన్ ఆఫ్ కచ్, సత్పురా కొండలు, తీరప్రాంతాలు, పవిత్ర పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి గుజరాత్కు విహారయాత్రకు వెళ్లాలనుకునే వారు డిసెంబర్ లేదా నూతన సంవత్సరంలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. గుజరాత్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికోసం ఐఆర్సిటిసి ఆహ్వానం పలుకుతోంది. ప్రత్యేకంగా సికింద్రాబాద్ నుంచి గుజరాత్కు ఓ స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం..
గుజరాత్ సందర్శన కోసం ఐఆర్సిటిసి అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో రెండు రోజులు, మూడు రోజుల ప్లాన్లు కూడా ఉన్నాయి. అన్ని టూర్ ప్యాకేజీలు సందర్భానుసారంగా విడుదల చేస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రైల్వే సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీ ఏడు రాత్రులతో కూడిన ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీ. సుమారు ఒక వారం పాటు ఈ టూర్ ప్యాకేజీలో మీరు గుజరాత్లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక మరియు తాత్విక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
ఎప్పుడు.. ఎక్కడ ప్రారంభమవుతుంది?
ఈ టూర్ ప్యాకేజీ 14 డిసెంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది. దీని తర్వాత, ప్రతి బుధవారం గుజరాత్ పర్యటన కోసం రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్ను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ముందుగా హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో వడోదర చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీలో, వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, ద్వారక, సోమనాథ్ తదితర నగరాల సందర్శనా స్థలాలను చుట్టేయవచ్చు.
గుజరాత్లోని పర్యాటక కేంద్రమైన
ఈ రైలు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి వడోదరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి క్యాబ్లో హోటల్కు చేరుకున్న తర్వాత సాయంత్రం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించేందుకు తీసుకువెళతారు. మూడవ రోజు, లక్ష్మీ విలాస్ ప్యాలెస్, అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత, అహ్మదాబాద్లో రాత్రి బస చేస్తారు.
నాలుగవ రోజు, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత, రాజ్కోట్కు బయలుదేరుతారు. అక్కడ వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఐదవ రోజు ద్వారకలో అడుగుపెడతారు. అనంతరం ద్వారకా దేవాలయం, సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం తదితర ఆలయాలను సందర్శించి రాత్రికి పోరుబందర్ రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు.
టూర్ ప్యాకేజీ ఖర్చు వివరాలు
ఈ టూర్ ప్యాకేజీలో రైలు ఛార్జీలు, సైట్ సందర్శనల కోసం క్యాబ్లు, అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్ సౌకర్యాలు కలిపి ఉంటాయి. ఎనిమిది రోజుల ఈ టూర్ ప్యాకేజీకి థర్డ్ ఏసీలో ముగ్గురికి ఒక్కో వ్యక్తికి రూ.22850 ఖర్చవుతుంది. స్లీపర్ క్లాస్లో ప్రయాణించినట్లయితే, ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 20055 టూర్ ప్యాకేజీ ఉంది. మరోవైపు, గుజరాత్ దర్శనానికి ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లినట్టయితే, అప్పుడు టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.17455 అవుతుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.