విశాఖ నుంచి కాశ్మీర్కు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
మంచుకురిసే శీతాకాలపు వేళ కాశ్మీర్ అందాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అయితే, అంత దూరం వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకునేసరికే సమయం కస్తా అయిపోతుంది. అలాంటివారి కోసం కశ్మీర్ అందాలను చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది ఐఆర్సిటిసి టూరిజం. గగన విహారం చేస్తూ.. కాశ్మీర్ ప్రకృతి ఒడిలో అడుగుపెట్టేలా ఆహ్వానం పలుకుతోంది.
విశాఖపట్నం నుంచి కాశ్మీర్ చేరుకునేలా పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. విమానంలో ప్రయాణించి కాశ్మీర్ అందాలు చూడాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా వారి కోరికను తీర్చుకోవచ్చు. కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ పేరుతో విశాఖపట్నం నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూ కాశ్మీర్లోని అందమైన కొండలు, లోయలు, ప్రకృతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐఆర్సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ కొత్త సంవత్సరం 2023 ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 24 తేదీల్లో అందుబాటులో ఉంది. ఇది ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేవారికి ఫ్లైట్లో తీసుకెళ్లి కాశ్మీర్ అందాలను చూపించనుంది ఐఆర్సీటీసీ టూరిజం.
గుల్మార్గ్లోని మనోహరమైన పచ్చికభూములు, సోన్మార్గ్లోని మంచు పర్వతాలు, పహల్ఘమ్లోని అద్భుతమైన లోయ, శ్రీనగర్ కళాత్మక సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ప్యాకేజీకి సంబంధించన పూర్తి వివరాలను ఐఆర్సిటిసి అధికారికంగా ప్రకటించింది. టూర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.39,120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,910, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.49,305 ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్నీ కూడా ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి.
టూర్ అలా మొదలవుతుంది..
కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ పేరుతో ఈ ఐఆర్సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం విశాఖపట్నంలో ఉదయం విమానం ఎక్కితే సాయంత్రానికి శ్రీనగర్లో ఉంటాం. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యాక, ఫ్రెషప్ అయిన తర్వాత షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి శ్రీనగర్లో బస చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం శంకరాచార్య ఆలయ సందర్శనం, ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్, చెష్మా షాహి, పరి మహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ వంటి సందర్శనీయ ప్రదేశాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్బాల్ క్షేత్రాన్ని సందర్శించేలా ప్రణాళిలు వేశారు. సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన తర్వాత చార్-చినార్ ఫ్లోటింగ్ గార్డెన్స్లో విహరించవచ్చు. అయితే, ఇక్కడ ప్యాకేజ్లో సంబందంలేకుండా సొంత ఖర్చులతో దాల్ సరస్సుపై షికారా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి శ్రీనగర్లోనే బస చేయాల్సి ఉంటుంది.
ఇలా ముగుస్తుంది..
ఇక మూడో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత గుల్మార్గ్లోని నేలపై పలచినట్లు ఆకర్షించే పుష్పాల అందాలను మనసారా వీక్షించేందుకు తీసుకువెళతారు. పర్యాటకులు సొంత ఖర్చులతో ఖిలాన్మార్గ్ వరకు ట్రెక్కింగ్ చేయొచ్చు. రాత్రికి శ్రీనగర్ చేరుకొని అక్కడే బస చేయాలి. నాలుగో రోజు బ్రేఫాస్ట్ తర్వాత పహల్గామ్ బయల్దేరాలి. దారిలో కుంకుమపువ్వు పొలాలు, అవంతిపుర శిథిలాల సందర్శన ఉంటుంది. రాత్రికి శ్రీనగర్లో బస చేయాలి. ఐదో రోజు సోన్మార్గ్ బయల్దేరాలి. ఫుల్ డే టూర్ ఉంటుంది.
వంపులు తిరిగే లోయ గుండా సాగే ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను చేరువ చేస్తుంది. థాజివాస్ గ్లేసియర్ వరకు వెళ్లడానికి పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రానికి శ్రీనగర్ చేరుకోవాలి. హౌస్బోట్లో డిన్నర్, బస ఉంటాయి. ఆరో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం శ్రీనగర్లో బయల్దేరితే రాత్రికి విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.