కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.
చుట్టూ ఎర్రమల కొండలు ఆ కొండల మధ్యలో అపురూపమైన శివాలయం. ఇందులో విగ్రహ రూపంలో దర్శనమిచ్చే శివుడు. కలియుగాంతంలో రంకెలు వేస్తాడని భక్తులు నమ్మే బసవన్న.ఇలాంటి ఎన్నో వేశేషాలకు ఆలవాలం కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రం. యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది.
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది.

1. సహజ సిద్దంగా వున్న గుహ
లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు.
PC:Pranayraj1985

2. పుష్కరిణి
ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
PC:porus

3. ఆలయ ప్రాంగణం
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది.
PC:porus

4. అగస్త్య పుష్కరిణి
ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణిలోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం.
PC:Ashwin Kumar

5. సర్వ రోగాలు
ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.
PC:Ashwin Kumar

6. ప్రధాన గోపురం
ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి.
PC:Ashwin Kumar

7. గర్బాలయం
గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని అన్నాడు.
PC:Raghuramacharya

8. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు.
PC:Ashwin Kumar

9. శిష్యులకు జ్ఞానోపదేశం
ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందుకొంటున్నాడు. ఆ ప్రక్కనే ఇంకో గుహలో బ్రహ్మంగారు కొంత కాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.
PC:Ashwin Kumar

10. యాగంటి బసవన్న
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.
PC:Just4santosh

11. బసవన్న రంకె
కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
PC:Sanju189

12. కాకులకు శాపం
ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు.
PC:రహ్మానుద్దీన్

13. వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు
ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
PC:Pusulurisudhakara

14. వసతి సౌకర్యాలు
యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లిలో వసతులున్నాయి.
PC:Bhaskaranaidu

15. ఎలా వెళ్ళాలి
ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
PC:Sudhirnlg



Click it and Unblock the Notifications













