నలంద ప్రపంచంలో ఉన్న అతిప్రాచీన విశ్వవిద్యాలయం. ప్రస్తుతం ఆ పేరుతోనే బీహార్ లో జిల్లాగా పరిగణించబడుతున్నది. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. ప్రసిద్ధ చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్ త్సాంగ్ నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్ త్సాంగ్ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు.
ఇది పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం క్రీ.శ. 427 నుంచి క్రీ.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికముగా పాల వంశము యొక్క పాలనలో ఉంది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్ కన్నింగ్హాం నలందను బారాగావ్ గ్రామముగా గుర్తించాడు.
చిత్రకృప :Amannikhilmehta
బుద్ధుని కాలములో నలందా (క్రీ.పూ.500)
బుద్ధుడు చాలా సార్లు నలందా చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చెప్పబడింది. ఆయన నలందను సందర్శించినప్పుడు సాధారణముగా పావారిక యొక్క మామిడితోపులో బస చేసేవాడు మరియు అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి మరియు దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు, కేవత్తతో మరియు అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు.
అశోకుడు (క్రీ.పూ.250) ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. టిబెట్ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. చారిత్రక ఆధారాల ప్రకారం నలందా విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీ.శ. 450 లో నిర్మించబడింది.
చిత్రకృప : Photo Dharma
అనేక జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు ఇంకా నలందలో మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉంది. 1951లో నవ నలందా మహావిహార అను ఒక ఆధునిక పాళీ, (థేరవాద బౌద్ధం) థేరవాద బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడింది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్ ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలందా మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు మరియు అనేక త్రవ్వకాలలో దొరికిన వస్థువులను ప్రదర్శించుచున్నది.
పునః ప్రారంభము
భారతదేశంలోని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం 2014 సెప్టెంబరు 1, సోమవారము నాడు తిరిగి ప్రారంభమైంది. దాదాపు 800 ఏళ్ల అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో తరగుతులు ప్రారంభం కావడం విశేషం. బీహార్ రాజధాని పాట్నాకు 100 కి.మీ. దూరంలో రాజ్గిర్ వద్ద ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రాచీన విశ్వవిద్యాలయం కూడా రాజ్గిర్కు సమీపంలోనే వుండేదని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.
చిత్రకృప : Alexander Caddy
నలంద లో చూడవలసిన ఇతర ఆకర్షణలు : ఘోరకతోర్, హిర్నాయ్ పర్వత్, సరస్వతి నది మొదలగునవి.
నలంద ఎలా చేరుకోవాలి?
బస్సు మార్గం
బీహార్ లో ప్రముఖ గమ్యస్థానాలకు నలందా మంచి రహదారి నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడింది. నలందకు రాజ్గిర్, పాట్నా, బోధ్గయ, గయా మరియు ఇతర ప్రధాన నగరాల నుండి బస్సు లేదా ఒక టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.
రైలు మార్గం
సమీప రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో రాజ్గిర్ వద్ద ఉంది. అయితే గయా రైల్వే స్టేషన్ నలందా నుండి 70 కిమీ దూరంలో ఉన్నప్పటికీ ఢిల్లీ నుండి గయాకు రైలులో రావటానికి సౌకర్యవంతమైన మరియు అత్యంత సమంజసమైన ఎంపికగా ఉంటుంది.
విమాన మార్గం
సమీప విమానాశ్రయం నలందా నుండి 90 కిమీ దూరంలో పాట్నా లో ఉంది. పాట్నా కు భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుండి పర్యాటకులకు రాష్ట్ర రవాణా లేదా ఒక ప్రైవేట్ బస్సు ద్వారా నలంద చేరటానికి 3 గంటలు సమయం పడుతుంది.