గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు పవిత్రమైనది. ఇదొక పర్వత శ్రేణి ప్రాంతం. ఈ శ్రేణి 'గిర్నార్ కొండలు' గా ప్రసిద్ధి చెందినది. చరిత్ర పరంగా కూడా గిర్నార్ కు ప్రత్యేకమైన స్థానం కలదు. వేదాలలో, సింధూ లోయ నాగరికతలో ఈ ప్రదేశం గురించి ఉటంకించారు.
ఎక్కడ ఉంది ?
గిర్నార్ భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం, రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ నుండి 286 కి. మి. దూరంలో, అహ్మదాబాద్ నుండి 267 కి. మి. దూరంలో, రాజ్ కోట్ నుండి 90 కి. మి. దూరంలో మరియు జిల్లా కేంద్రమైన జునాగఢ్ నుండి 10 కి. మీ ల దూరంలో కలదు.
ఏమేమి చూడవచ్చు ?
గిర్నార్ లో పర్వత శ్రేణులు ఉన్నాయని ఇదివరకే చెప్పానుగా ..! ఈ పర్వత శ్రేణుల్లో ఐదు శిఖరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక్కోశిఖరం లో అనేక ఆలయాలు ఉంటాయి. ఆలయాలన్నీ కూడా హిందూ మరియు జైన మతానికి చెందినవి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది అదేమిటంటే ఈ ఆలయాలన్నింటికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లంటే అదేదో 100 లేదా 200 అనుకొనేరు ... అనేక వేల మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మరో విషయం ! ఇక్కడికి సమీపంలో పులులకు ప్రసిద్ధి గాంచిన గిర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. గిర్నార్ లోని సందర్శనీయ స్థలాల చిట్టాకి వస్తే ...
ఇది కూడా చదవండి : గిర్ నేషనల్ పార్క్ - ఆసియా సింహాల ఏకైక అభయారణ్యం !
గిర్నార్ లోని 5 శిఖరాలు
గిర్నార్ లోని ఒక్కో శిఖరంలో ఒక్కో ఆలయానికి ప్రసిద్ధి చెందినది.
మొదటి శిఖరం - అంబా మాతా ఆలయం
రెండవ శిఖరం - గోరఖ్ నాథ్
మూడవ శిఖరం - ఒఘాద్
నాలుగవ శిఖరం - దత్తాత్రేయ ఆలయం
ఐదవ శిఖరం - కాళికా మాతా దేవాలయం
చిత్ర కృప : Faiyaz Sorathia
అంబా మాతా ఆలయం
అంబా మాతా ఆలయం క్రీ.శ. 12 వ శతాబ్దానికి చెందినది. ఆలయంలో మాతా ప్రధాన దేవతగా ఉంటుంది. ఆలయ నిర్మాణ సమయంలో మాతా యొక్క రథం మరియు కాలి పాద ముద్ర కనుగొన్నారు.ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుని తల కేశాలు తీసారని చెబుతారు.
చిత్ర కృప : Vishal Solanki
భావనాథ్ మహాదేవ ఆలయం
భావనాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడి లింగం స్వయం భూ అని నమ్ముతారు. నగ్న సాధువులు ప్రతి శివ రాత్రి వచ్చి ఆలయంలో శివునికి హారతి అర్పిస్తారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు ఇచ్చట పడ్డాయని, అందుచేత ఈ ప్రాంతం పవిత్ర ప్రాంతంగా భావించబడుతున్నది మరికొందరి భావన.
చిత్ర కృప : Nileshbandhiya
దత్తాత్రేయ ఆలయం
దత్తాత్రేయ ఆలయం, గిర్నార్ కొండల శిఖరాలలో ఒక దానిపై వుంటుంది. అందమైన ఈ శిఖరంలో దత్తదేవుని కాలి పాద ముద్రలు కనపడతాయి. బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల అవతారమైన దత్త దేవుడు ఇక్కడ దర్శనమిస్తాడు.
చిత్ర కృప : Angel Lahoz
కాళికా ఆలయం
కాళికా ఆలయం, గిర్నార్ కొండల్లో పావగర్ అనే శిఖరంపై కలదు. ఈ టెంపుల్ లో నాలుగు చేతులు కలిగిన కాళికా మాత విగ్రహం వుంటుంది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో రాక్షసుడి తల, మిగిలిన రెండు చేతులు ఆశీర్వదిస్తూ వుంటాయి. ఈ దేవత భక్తుల కోరికలు తీరుస్తుందని నమ్ముతారు.
చిత్ర కృప : Manfred Sommer
రిషభదేవ్ ఆలయం
గిర్నార్ కొండల్లో ఒక శిఖరంపై జైన తీర్థంకరులకు చెందిన 'రిషభదేవ్ ఆలయం' కలదు. ఇది బంగారు రంగులో ఉంటుంది. దీనిని క్రీ.శ. 15 వ శతాబ్దం లో నిర్మించినారు. ఆలయ ఆవరణలో హిందూ మతానికి సంభందించిన అనేక గుడులు కనిపిస్తాయి.
చిత్ర కృప : Andrea Kirkby
తీర్ధంకర నేమినాథ్ ఆలయం
గిర్నార్ హిల్స్ లో ఉన్న ఈ ఆలయంలో జైనుల 22 వ తీర్థంకరుడైన నేమినాథ్ ఉంటాడు. సుమారు 400 ఏళ్ళపాటు నేమినాథుడు ఇక్కడే ధ్యానం చేసి మరణించాడు. ఆ తరువాత ఇదొక పుణ్య స్థలం గా మారి జైనులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నది.
చిత్ర కృప : JAINTIRTH
పార్శ్వనాథ ఆలయం
మేరవాసి అని కూడా పిలువబడే పార్శ్వనాథ ఆలయం, గిర్నార్ కొండల్లోని రిషిభదేవ్ ఆలయానికి సమీపంలో కలదు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయంలో పార్శ్వనాథుని విగ్రహం ఉంటుంది.
చిత్ర కృప : Nileshbandhiya
మల్లినాథ్ ఆలయం
తీర్థంకర నేమినాథ్ ఆలయానికి సమీపంలోనే జైనుల 19 వ తీర్థంకరుడైన 'మల్లినాథ్' ఆలయం ఉన్నది. దీనిని వాస్తుపాల్ మరియు తేజ్ పాల్ సోదరులు నిర్మించినారు.
చిత్ర కృప : Owen Lin
దతర్ పీక్
దతర్ పీక్ సముద్ర మట్టానికి 2779 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదొక వ్యూ పాయింట్.
చిత్ర కృప : Emmanuel DYAN
ఇంకేమి చూడవచ్చు ?
గిర్నార్ కొండలపై గోముఖి గంగా ఆలయం, జాత శంకర్ మహాదేవ ఆలయం మరియు హనుమాన్ ధారా చూడదగ్గవి.
చిత్ర కృప : Santanu Vasant
గిర్ నేషనల్ పార్క్
గిర్నార్ వద్ద అటవీ ప్రాంతం కలదు. అందులో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన గిర్ నేషనల్ పార్క్ కలదు. గిర్నార్ వచ్చే ప్రతి యాత్రికుడు పార్క్ చూడకపోతే అతని పర్యటన అసంతృప్తి గానే సాగుతుంద.
చిత్ర కృప : Martien Uiterweerd
గిర్ నేషనల్ పార్క్
పార్క్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటేమో రిజర్వ్ ఫారెస్ట్ మరొకటేమో వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ. ఈ పార్క్ ఆసియా సింహాలకు పేరుగాంచింది. పార్క్ భూభాగంలోనే మితియాలా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ మరియు పనియా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లు కూడా ఉన్నాయి.
చిత్ర కృప : mradimasinh
గిర్నార్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
గిర్నార్ కు సమీపంలో రాజ్ కోట్ విమానాశ్రయం (100 కి. మీ.) కలదు. అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్ (267 కి. మీ) వద్ద కలదు.
రైలు మార్గం
గిర్నార్ కు 5 కి. మి. ల దూరంలో జునాగఢ్ రైల్వే స్టేషన్ కలదు. గుజరాత్ లోని అన్ని ప్రదేశాల నుండి ఈ రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. అక్కడ దిగి ఆటోల మీదుగా సులభంగా గిర్నార్ చేరుకోవచ్చు.
బస్సు మార్గం
జునాగఢ్ మరియు రాజ్ కోట్ నుండి నిత్యం ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు గిర్నార్ కు తిరుగుతుంటాయి.
చిత్ర కృప : Manfred Sommer