కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములో ముఖ్యమైన రేవు పట్టణం. కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో బంగాళఖాతం సముద్రానికి చేరువలో ఉన్నది.
పేరు వెనుక చరిత్ర
బిటీష్ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులవి! ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా... ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ' అంటూ పేర్కొన్నారట! ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాకులు నిజంగానే ఎక్కువగా ఉండేవట మరి! అలా... అలా... జనం నోళ్ళల్లో నాని... నాని... ఈ ప్రాంతం కాకుల వాడగా స్థిరపడిరది. కాలక్రమంలో ‘కాకివాడ'గా... ‘కాకినాడ'గా మారిపోయింది!
భీమేశ్వర ఆలయం
సామర్లకోట, భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది మరియు ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది.
Photo Courtesy: Aditya Gopal
హోప్ ఐలాండ్
కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉన్నది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగలుగుతున్నాయి.
Photo Courtesy: Satya murthy Arepalli
ఉప్పాడ బీచ్
ఉప్పాడ బీచ్ కాకినాడ నుండి 5 - 10 కి. మీ. మధ్యలో కలదు. ఎగసిపడే అలలు, తీరం వెంబడే ఎగిరే నీటి పక్షులు, చల్లని సముద్రపుగాలి, బీచ్ ఇసుకమీద లంగరు వేసి ఉన్న నాటుపడవలు, అక్కడక్కడా నీచువాసన, వలలు భుజానవేసుకొని రోడ్డువెంబడి నడచిపోయే మత్యకారులు ... సాధారణంగా ఈ బీచ్ లో కనిపించేవి.విశాలమైన ఈ బీచ్ ఈతకు, స్నానాలకు సురక్షితమైనది. పట్టణ జీవితం నుండి ప్రశాంతంగా గడపుటకు అనుకూలమైన బీచ్.
Photo Courtesy: Satya murthy Arepalli
కుంభేశ్వరస్వామి దేవాలయం
మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ సమీపంలో గల ఉప్పాడ లో కలదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం ఇదే.
Photo Courtesy: kakinada temples
ఉప్పాడ చీరలు
ఉప్పాడ అంటే మరో విషయం గుర్తుకొచ్చింది అదేమిటంటే ఉప్పాడ సిల్క్ చీరలకు, పట్టు చీరలకు ప్రసిద్ధి చెందినది. దేశ విదేశాలలో ఈ చీరలకి మంచి డిమాండ్. రాష్ట్రంలోనే కాక దేశంలోని ప్రముఖులు ఈ చీరలను ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకుంటారు. వారిలో రాజకీయనాయకులు, సెలెబ్రటీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాల ప్రముఖులు ఉన్నారు.
Photo Courtesy: pattu sarees
మాండవ్య నారాయణస్వామి దేవాలయం
గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తుల్యభాగనదీ తీరాన సామర్లకోట లో వెలసిన శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందింది. కోరిక లీడేర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది.
Photo Courtesy: kvs_vsp
పాండవుల మెట్ట
పచ్చని ప్రకృతిని ఆస్వాదించని వారుండరు. ఎత్తయిన గిరులను అధిరోహించి చుట్టు పరిసరాలను పరిశీలిస్తే కలిగే ఆనందమే వేరు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఎన్నో చారిత్రిక గిరులలో ‘అమరగిరి'.' ఒకటి. పెద్దాపురం పట్టణలో ఇవి దర్శనమిస్తాయి. చాలామంది వీటిని ‘పాండవుల మెట్ట'గా పిలుస్తుంటారు పాండవుల వనవాస సమయంలో కొంతకాలం ఇక్కడే బస చేసారని, దానికి తగిన ఆనవాళ్లు ఈనాటికీ ఉన్నాయనడానికి నిదర్శనం ఈ పాండవుల మెట్ట. ఇది కాకినాడకు 16 కి. మీ. దూరంలో కలదు.
Photo Courtesy: Adityamadhav83
బిక్కవోలు
బిక్కవోలు గ్రామంలోని దేవాలయల్లో కూడా ప్రాచీన శాసనాలు, చాళుక్యుల కాలంనాటి శిలావిన్యాసాలను చూడవచ్చు. వీటిల్లో తూర్పు చాళుక్యుల కాలంనాటి, వినాయకుని 11 అడుగుల ఏకశిలావిగ్రహం, గోలింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, శ్రీ చంద్రశేఖరస్వామి దేవాలయం ముఖ్యమైనవి.
Photo Courtesy: Adityamadhav83
గొట్టం కాజా
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు.
Photo Courtesy: విశ్వనాధ్.బి.కె.
షాపింగ్
పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణంగా కాకినాడ నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి. అలాగే నగరంలోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి. ఇంకా మరెన్నో ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి. కాకినాడలో ప్రఖ్యాతి గాంచిన జ్యువెల్లరి షాప్ లు , ఇంకా స్దానికంగా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి.
Photo Courtesy: DKDINU
సుబ్బయ్య హోటల్
సుబ్బయ్య హోటల్ అనగానే భోజన ప్రియులకి నోరూరుతుంది. ఆ ఆలోచన రాగానే ఈ సారి కాకినాడకు వెళితే తప్పక ఫ్యామిలీని తీసుకెళ్లాలి అనిపిస్తుంది. అదే సుబ్బయ్య హోటల్ ప్రత్యేకత!. చూడటానికి హోటల్ సాధారణంగానే ఉంటుంది లోనికి వెళితే గాని తెలీదు రద్దీ ఎంతుంటుందో?. ఆర్డర్ ఇచ్చారంటే తీసుకురావడానికి అర్ధగంట సమయం పడుతుంది. ఇక వడ్డించడం మొదలైతే ఉంటుంది ఇస్తరాకు ముందు పెట్టడం , సార్ .. ఈ ఐటమ్ రుచి చూడండి. సార్ .. ఆ ఐటమ్ రుచి చూడండి సార్ .. మరో ఐటమ్ రుచి చూడండి .... ఇలా ఐటమ్ ల వర్షం కురుస్తూనే ఉంటుంది. సుమారు పాతిక నుంచి నలభై రకాల ఐటమ్ ల రుచి చూడకమానరు.
Photo Courtesy: kumar
మిఠాయి కిళ్ళీ
సాధారణంగా సంతృప్తికరమైన భోజనం తరువాత పాన్ నాములుతారు అలాంటిది మరి సుబ్బాయ్య హోటల్లో భోజనం చేసి కిళ్ళీ వేసుకొనకపోతే ...! కిళ్ళీ అంటే నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. వేసుకుంటే ఉంటుంది అహా .. ఒహో !
Photo Courtesy: Brendan H
ఎలా చేరుకోవాలి?
రైలు సదుపాయం
కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉన్నది. కాకినాడ స్టేషన్లలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి. ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరు లకు నేరుగా రైలు సదుపాయముంది. కాకినాడ నుంచి కోనసీమ అందాలను చూపుతూ కోటిపల్లి వరకు పోయే రైలు బస్సు మరొక ఆకర్షణ.
విమాన సదుపాయం
కాకినాడ కు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశీయంగా, ఆంతర్జాతీయంగా (కొన్ని సర్వీసులు) విమాన సేవలు నడుస్తున్నాయి.
రోడ్డు సదుపాయం
214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమండ్రి, జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ శివారు ప్రాంతాల నుండి ఇక్కడికి చక్కటి రోడ్డు సదుపాయం ఉంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాలనుంచే కాకుండా చెన్నై, బెంగళూరు నగరాలనుంచి కూడా బస్సు సదుపాయం కలదు. రాజమండ్రి నుంచి కాకినాడ కి నిత్యం ప్రతి రోజూ ఆ.ప్ర.రో.ర.స వారి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.
Photo Courtesy: KRUPA RATNAM