గోల్కొండ కోట ... దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవ్వరికైనా ఔరా! అని అనిపించకమానదు. కోటలోని గోడలు, కింద చప్పట్లు కొడితే ... అక్కడెక్కడో కొండ పైన ఉన్న రాణి మహల్ వరకు వినిపించే శబ్దం నేటికీ ఆశ్చర్యచకితులను చేస్తాయి. కోట గురించి మరిన్ని విశేషాలు ఏంటో చూద్దామా !
గోల్కొండ కోట
గోల్కొండ ను కాకతీయులు, వారి వారసులు ముసునూరి నాయకులు పాలించారు. పిదప బహమానీరాజుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆతరువాత హైదరాబాద్ కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ ను చేజిక్కుంచుకున్నారు.
చిత్రకృప : Creatographer
నల్లరాతి కొండ
గోల్కొండ కోటను 120 మీ. ఎత్తున ఒక నల్లరాతి కొండ పై కట్టారు. కోటకు దక్షిణం వైపున ఒక పెద్ద బురుజు కూడా ఉంది. కోట బురుజుతో కలిపి గోల్కొండ కోట 5 కి.మీ ల చుట్టుకొలతను కలిగి ఉన్నది.
చిత్రకృప : Sushma R
వజ్రాల వ్యాపారం
గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూరు, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఒర్లాప్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల - కొల్లూరు గనుల నుండి వెలుగులోకి వచ్చాయి. అందుకే నిజాం ప్రభువులు ప్రపంచ సంపన్నులు అయ్యారు.
చిత్రకృప : Felix Engelhardt
ద్వారాలు
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం. కోటకు మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. అందులో ఫతే దర్వాజా (విజయ దర్వాజా), మోతీ దర్వాజా, కొత్తకోట, జమాలి, మక్కా దర్వాజా లు కొన్ని. ఇప్పుడు మనము కోటలోకి వెళుతున్నది ఫతే దర్వాజా నుండే.
చిత్రకృప : Sukanto Debnath
విజయ ద్వారము
ఔరంగజేబు గోల్కొండ పై విజయము తర్వాత ఫతే దర్వాజా గుండా తన సైన్యాన్ని నడిపించాడు. ఈ దర్వాజా నిర్మించటానికి ధ్వని శాస్త్రాన్ని అవపోసనపట్టినట్లుంది. మరి కాకపోతే ఏంటండీ కింద చప్పట్లు కొడితే అక్కడెక్కడో పైన ఉన్న మహల్ వద్ద వినిపించడం వింత కాకపోతే!
చిత్రకృప : Shravya
కోట బురుజులు
కోటలో 87 బురుజులు ఉన్నాయి. వాటిలో పెట్లా, మూసా, మజ్ను బురుజులు ప్రసిద్ధి చెందినాయి. వీటి మీద సైనికులు నిలబడి శత్రువుల రాకను పసిగట్టేవారు. బురుజులు మీద శత్రువుల వైపు గురిపెట్టే విధంగా ఫిరంగులను అమర్చారు.
చిత్రకృప : Nimesh Madhavan
కరోఠా హౌస్
కరోఠా హౌస్ బారాహిసార్ కు ఉత్తరం దిక్కున కలదు. ఇది కుతుబ్ షాహీల వినోద స్ధలం . 200 అడుగుల పొడవు, వెడల్పు, 5 గజాల లోతు ఉంటుంది. దీనికి నీరు సమీపాన ఉన్న చెరువు నుండి వచ్చేది. దీనిని పడమర వైపు ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని దిక్కులకు ప్రతిధ్వనించేది. రాజులు, మరికొంత మంది రాజప్రముఖులు వినోద స్థలంగా ఉపయోగించేవారు.
చిత్రకృప : Bhaskaranaidu
దాద్ మహల్
దీని బాల్కనీ రోడ్డుకు తూర్పు వైపున ఉన్నది. దీని ముందు ఉన్నపెద్ద స్థలంలో ప్రజలు వచ్చి కష్టసుఖాలు చెప్పేవారు. రాజు ఇక్కడ నుంచే సమస్యలను విని పరిష్కారం చెప్పేవాడు.
చిత్రకృప : Jidutorrentz
ఆయిల్ స్టార్ హౌస్
ఇది నూనె దాచిపెట్టే స్థలం. 30(పో)*50(వె)*10(లో) కొలతలతో ఒకే రాతిలో మలచబడినది. 12 వేల గ్యాలెన్ల నూనె ని నిల్వ చేసి, సప్లై చేసేవారు.
చిత్రకృప : Sujith Gopinath
బాలాహిసార్
బాలాహిసార్, కొండ మీద నిర్మించబడింది. ఇదివరకే చెప్పినట్లు కింద చప్పట్లు కొడితే ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడ ఇదొక్కటేకాదు చాలా కట్టడాలు ఉన్నాయి. వాటిలో కుతుబ్ షాహీ భవనాలు, అసెంబ్లీ హాల్, దర్బార్- ఏ-ఖాన్ ముఖ్యమైనవి. ఇంకా గుడులు, మసీదులు, భక్త రామదాసు జైలు, తోటలు, ఆయుధ కర్మాగారాలు ఇలా ఎన్నో ఇక్కడ చూడవచ్చు.
చిత్రకృప : Devadaskrishnan
కుతుబ్ షా రాజుల స్నానము
బాలాహిసార్ గేట్ నుండి లోనికి ప్రవేశించేటప్పుడు కుడివైపు ఉంటుంది ఈ గది. ఇక్కడ వేడి నీళ్ళు, చల్లని నీళ్ళు వచ్చేవిధంగా గొట్టాలను అమర్చారు. అయితే ఈ నీటిని కొన్ని ప్రత్యే క సందర్భాలలో మాత్రమే వాడేవారు. ఎవరైనా రాజ వంశీయులు చనిపోతే ఇక్కడ వేడినీటితో స్నానము చేయించి ఉత్తరం వైపు నుండి శవపేటికను తీసుకెళ్లేవారు.
చిత్రకృప : Cephas2904
నగీనా బాగ్
తోటకు దక్షిణముగా ఆర్కులలో రాకుమారులు, రాకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. ఎడమవైపు రక్షకభటులు భవనం గమనించవచ్చు. అదేమార్గంలో కుతుబ్షా రాజులలో చివరివాడైన తానీషా పరిపాలనలో మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం వుంది.
చిత్రకృప : Tusharg1993
బడీ బౌలి
బాలాహిసార్ మెట్లకు కుడిపక్కన ఒక పెద్ద బావి, అందులో ఒక మూల రాయి ఉన్నది. అది వేసవిలో నీరు కింద పడటానికి సహాయపడేది. ఈ బావి దగ్గరలో రెండు వరండాలు ఉన్న ఒక భవనము ఉంది. అక్కడ రాజులు సేదతీరుతూ ప్రకృతిని ఆస్వాదించేవారు.
చిత్రకృప : Karthik Uppaladhadiam
డ్రగ్ ట్యాంక్
బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో వుంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు.
చిత్రకృప : Ashok ramam
భక్త రామదాసు జైలు
భక్త రామదాసు గా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న నాటి తానిషా హయాంలో భద్రాచలం తహసీల్దార్. ఈయన మంత్రివర్యులైన మాదన్న మేనల్లుడు. ఈయన జైలు శిక్ష సమయంలో చెరసాలలో ఉన్నప్పుడు రామ లక్ష్మణుల ప్రతిమలను, హాముమంతుడు ప్రతిమలను సృష్టించాడు. నేటికీ వాటిని గోల్కొండ కోటలో చూడవచ్చు.
చిత్రకృప : Felix Engelhardt
ఎల్లమ్మ దేవి
అక్కన్న మాదన్న మరియు అబ్దుల్ హసన్ తానీషా కాలములో కట్టినదీ దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.
చిత్రకృప : ShashiBellamkonda
కోటలోని ఇతరములు
ఇబ్రహీం కుతుబ్ షా మసీదు - ఇది కుతుబ్ షా కాలంలో నిర్మించిన మసీదు. ఇక్కడి నుండి గోల్కొండ మొత్తాన్ని, హైదరాబాద్ భవనాలను చూడవచ్చు.
చిత్రకృప : Masrur Ashraf
బారాదరి
ఇది గోల్కొండ కోటలో ఎత్తైనది. ఇది మూడు అంతస్తులలో నిర్మించిన సభా మండపం. పై అంతస్తు లో రాజు సింహాసనం ఉన్నది. ఇక్కడి నుండి రాజు చార్మినార్, మక్కా మసీద్ లను చూసేవాడట.
చిత్రకృప : Bernard Gagnon
ఆర్మరి
ఇది బాలాహిసార్ గేట్ ప్రవేశంలో ఎడమవైపు ఉన్నది. ఇది మూడంతస్తుల భవనం. ఇక్కడికి సమీపంలో దక్షిణాన ఒక ప్రసిద్ధిగాంచిన బావి ఉన్నది. ఔరంగజేబు తానిషా ను బంధించినపుడు అతని భార్య, బిడ్డలు శత్రువుల నుండి రక్షణ పొందేందుకు ఈ బావిలో తలదాచుకున్నారని చెబుతారు.
చిత్రకృప : Vivek baniya
కార్టైన్ వాల్
ఇది శత్రువుల దాడులను తిప్పి కొట్టేందుకు నిర్మించిన తెరవంటి గోడ. యుద్ధ సమయంలో శత్రువు బారాహిసార్ గేటు ద్వారా లోనికి ఏనుగులను పంపించేటప్పుడు ఇక్కడి నుండి సలసల కాగుతున్న నూనెను లేదా కాగుతున్న లోహ ద్రవాన్ని పోసేవారు.
ఇతర విషయాలు
గొర్రెల కాపరులు, ఇప్పుడు కోట ఉన్న కొండ ప్రాంతంలో గొర్రెలను మేపేవారు. అందుకే ఈ కొండ ను గొల్లకొండ అని పిలిచేవారు.
గోల్కొండ దక్కన్ సామ్రాజ్యంలోనే అతి పెద్ద దుర్గం. అప్పట్లోనే సాంకేతికత పరిజ్ఞానముతో కట్టిన ఈ కట్టడం సౌత్ ఇండియాలో మరెక్కడా కనిపించదు.
ఔరంగజేబు కోట ను హస్తగతం చేసుకోవటానికి 8 నెలలు పట్టింది. కుతుబ్ షా లను ఓడించి మొఘల్ దక్కన్ ప్రతినిధిగా అసఫ్ షా ను నియమించి ఔరంగజేబు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆతరువాత ఇతను నిజాం ఉల్ ముల్క్ బిరుదును ధరించి నిజాం పాలకుడయ్యాడు.
చిత్రకృప : Kotagaunisrinivas
ఉదయం 9 నుండి సాయంత్రం 5 : 30 వరకు.
సందర్శన సమయం : ఉదయం 9 నుండి సాయంత్రం 5 : 30 వరకు.
లైట్ షోలు : మొదటి షో : 6:30 pm - 7:20 pm & సెకండ్ షో : 7:30 pm - 8:20 pm.
ఎంట్రీ ఫీ : రూ. 5/-, విదేశీయులకు రూ. 100/-.
గోల్కొండ కోట చేరుకోవటానికి హైదరాబాద్ లో సిటీ బస్సుల సదుపాయం కలదు. మెహదీపట్నం, చార్మినార్ నుండి డైరెక్ట్ గా బస్సులు, ఆటోలు దొరుకుతాయి.
చిత్రకృప : Pravina