తమిళనాడు లోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడు లో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు తమ తమ కళాభి రుచులకు తగినట్లు నిర్మించారు.
ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్యత సంతరించు కొన్నది. భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికత లలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలిచండి.
మీనాక్షి మాత దేవాలయం
మదురై పట్టణంలో ప్రధాన ఆకర్షణ మీనాక్షి మాత దేవాలయం. ఈ దేవాలయ శిల్ప శైలి చూసేందుకు పర్యాటకులు, భక్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వస్తారు. ఈ దేవాలయంలో హిందువుల ఆరాధ్య దైవాలు శివ పార్వతులు ప్రధాన దైవాలుగా కొలువ బడతారు. పార్వతి మాతను మీనాక్షిగా కొలుస్తారు. ఈ దేవాలయ సముదాయం దేశంలోనే అతి పెద్దదిగా చెప్పబడుతుంది. దీనిలో సుమారు 33000 శిల్పాలు , పది గోపురాలు కలవని గొప్పగా చెపుతారు. దక్షిణ గోపురం సుమారు 170 అడుగులు ఎత్తు కలిగి వుంటుంది. ఈ గోపురాలు అనేక అంతస్తులు కలిగి అందమైన శిల్పాలు చెక్కబడి వుంటాయి. మీనాక్షి టెంపుల్ దర్శనం పూర్తి కాకుంటే, మదురై పర్యటన అసంపూర్ణమే.
Photo Courtesy: Natesh Ramasamy
కూడలి అజగార్ టెంపుల్
మదురై లోని ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. దీనిలో హిందువుల దేవుడు శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడు. పురాతన మైన ఈ టెంపుల్ మీనాక్షి మాత టెంపుల్ సమీపంలో కలదు. శ్రీ మహా విష్ణువుకు కల 108 పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా దీనిని చెపుతారు. టెంపుల్ చాలా విశాలమైనది. దేవాలయంలోని అన్ని భాగాలను వివరించేందుకు ఇక్కడ గైడ్ లు వుంటారు. రాతితో చెక్కబడిన అనేక శిల్పాలు, కళాత్మకంగా వేయబడిన అనేక పెయింటింగ్ లు కలవు. వీటిని చూసేందుకు రుసుము రూ.10 గా కలదు. అయినప్పటికీ ఈ దేవాలయం చూసి ఆనందించ దగినది.
Photo Courtesy: Arun Bharhath
అయిరంకాల్ మండపం
వేయి స్తంభాలు కల ఆయిరం కాల్ మండపం మదురై లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. అయితే పేరుకి తగినట్లు కాక ఈ మండపానికి 985 స్తంభాలు మాత్రమే వుంటాయి. అరియంత మొదలియార్ చే నిర్మించబడిన ఈ కళా ఖండం అనేక ఏనుగులు, ఇతర శిల్పాలు కలిగి ఆనాటి కలాత్మకతలకు అద్దం పడుతుంది. ఈ మండపములో దేవాలయ మ్యూజియం కలదు. దీనిలో సుమారు 1200 సంవత్సరాల నాటి పురాతన వస్తువులు చూడవచ్చు. మండపం వెలుపలి భాగంలో ఆశ్చర్య పరచే సంగీత స్తంభాలు కలవు. రాతి నిర్మానంకల ఈ స్తంభాలు ముట్టుకుంటే చాలు సంగీత శబ్దాలు వినిపిస్తాయి.
Photo Courtesy: Jomesh
తిరుమలై నాయకర్ మహల్
నాయక్ తెగల రాజు అయిన తిరుమలై నాయక చే నిర్మించబడిన ఈ భవనం, అద్భుత పెర్షియా మరియు ద్రావిడ శిల్ప సమ్మేళనం కలిగి అందంగా వుంటుంది. ఇది మీనాక్షి మాత దేవాలయానికి కొద్ది దూరంలో కలదు. పాలస్ లోని వివిధ భాగాలు సింహాసనం గది, ముందు , వెనుక ప్రాంగణాలు, డాన్సింగ్ హాల్ వంటివి వైభవోపేతంగా వుండి పర్యాటకులకు ఆశ్చర్యం గోల్పుతాయి. ఈ పాలస్ గోపురాలు అతి ఎత్తుగా వుండి రాచ దర్పంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ పాలస్ లో లైట్ అండ్ మ్యూజిక్ షో లు కూడా నిర్వహిస్తారు. పాలస్ ఉ. 9 గం నుండి సా.5 గం. వరకు తెరచి వుంటుంది. ఎంట్రీ రుసుము రూ.10 /-.
Photo Courtesy: Ashwin Kumar
గాంధి మెమోరియల్ మ్యూజియం
మదురై పట్టణానికి ఈ మ్యూజియం అహింసా మరియు శాంతి లకు ప్రదినిదిగా వుంటుంది. గాంధి మెమోరియల్ మ్యూజియం ను గాంధీ హత్యగావించిన అనేక సంవత్సరాలకు నిర్మించారు. ఇది దేశంలోని అయిదు గాంధి సంగ్రహాలయాలలో ఒకటి. ఈ మ్యూజియం లో గాంధి వ్రాసిన అనేక ఉత్తరాలు కలవు. వాటిలో ఒకటి జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ కు వ్రాసినది కూడా వుండటం ఒక విశేషం.
Photo Courtesy: Karthikeyan Balasundaram
వండి యూర్ మరియమ్మన్, తెప్పకులం
వండి యూర్ మరియమ్మ తప్పకులం లేదా టెంపుల్ ట్యాంక్ చూడకుండా మదురై నగర పర్యటన పూర్తి కానట్లే. దక్షిణ దేశంలో సాధారణంగా దేవాలయాల కొలనులు పవిత్రంగా భావించబడి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ కూడా భక్తులు ఈ కొలనులో పండుగలకు, ఇతర శుభ తిధులలో పుణ్య స్నానాలు చేసి పాప ప్రక్షాళన చేసుకొంటారు. ఈ కొలను నేరుగా వాగాయి నదికి అనుసందానించబడినది. ఈ కొలను కు చుట్టూ నాలుగు వైపులా గ్రానైట్ మెట్లు కలవు. జనవరి - ఫిబ్రవరి నెలలలో తెప్పకులంలో అనేక పండుగలు నిర్వహిస్తారు.
Photo Courtesy: எஸ்ஸார்
అలగిర్ కోవిల్
అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కళ లకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంఛి, సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు. ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు. Photo Courtesy: Vinoth Chandar
మదురై ఆహారాలు
దక్షిణ భారత దేశంలోని ఇతర పట్టణాల వలెనె, మదురై లో కూడా మీకు సాంప్రదాయక శాకాహార భోజనం, సాంబార్, అన్నం, కూతు, రసం, పెరుగు మొదలైన వాటితో అప్పడం, పచ్చళ్ళు, స్వీట్ లతో లభిస్తుంది. మాంసాహారులు తమ రుచికర భోజనం అలగర్ కోవిల్ స్ట్రీట్ లో కల అమ్మ మెస్ లో చేయవచ్చు.
Photo Courtesy: Jennifer
మదురై లో షాపింగ్
మదురై పట్టణం చేనేత వస్త్రాల తయారీ కు ప్రసిద్ధి. ఇక్కడ మీరు కాటన్, బాటిక్ , సన్ గుండి చీరలు సరసమైన ధరలలో కొనుగోలు చేయవచ్చు. ఇతర హస్త కళా వస్తువులకు ప్రభుత్వ హండి క్రాఫ్ట్ ఎంపోరియం కు లేదా పూమ్పుహార్ హండి క్రాఫ్ట్ దుకాణాలకు వెళ్ళవచ్చు.
Photo Courtesy: J'ram DJ
మదురై ఎలా చేరాలి ?
దక్షిణ భారత దేశంలోని ప్రధాన నగరాల నుండి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు మదురై కు తరచుగా కలవు. మదురై నుండి చెన్నై పట్టణం 464 కి. మీ. ల దూరం లో కలదు. 22 1 కి.మి. ల దూరంలో సమీపం గా వున్న నగరం కోయంబత్తూర్.
మదురై లో రైలు స్టేషన్ కలదు. ఇది దేశంలోని అనేక ప్రధాన నగరాలకు కలుపబడి వుంది.
విమాన ప్రయాణం కోరే వారికి మదురై లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సేవలు కలవు. సమీప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చెన్నై నగరంలో కలదు. మదురై పట్టణానికి 10 కి. మీ. ల దూరంలో మదురై ఎయిర్ పోర్ట్ కలదు.
వేసవి మినహా ఇతర అన్ని కాలాలలో మదురై పర్యటన సూచించ దగినది.
Photo Courtesy: Nsiddhu