రాయలసీమ అనగానే కొండలూ.. గుట్టలూ.. రాళ్లు రప్పలూ... బీడు భూములూ.. ఎటు చూసినా ఇవే కనబడతాయి. ఎందుకంటే, కరువు ప్రాంతంగా పేరొందిన నేల ఇది. అయితే, అదంతా గతం. వర్షాభావ పరిస్థితుల్లోనే అలా కనపడుతుంది ఈ నేల. చినుకు పడితే చాలు.. పచ్చని కొండలు.. నదులు... పక్షుల కిలకిలరావాలు.. ఎత్తయిన బండరాళ్లపై నుంచి జాలువారే జలపాతాలు ఇలా ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దశ్యాలే రాయలసీమలో దర్శనమిస్తాయి. అంతేకాదు, దేశంలో ఎక్కడా కనిపించని విలువైన ఎర్రచందనంతోపాటు వెదురు ఇంకా ఎన్నో ఔషధ మొక్కలు ఈ ప్రాంతంలోని నల్లమల అడవుల్లో పుష్కలంగా లభిస్తాయి. వర్షాకాలంలో పర్యాటక నెలవుగా మారిపోతుంది ఈ సీమ. అలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాయలసీమ అందాలను ఆస్వాదించిన మా బృందం అనుభవాలు మీ కోసం.
పచ్చని సీమలో దాగిన.. ప్రకృతి అందాలు!
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 22 కిలోమీటర్లు. సమీప పట్టణమైన నంద్యాలకు 65 కిలోమీటర్ల దూరంలోనూ, నల్లమల అడవుల్లో ఉంది అహోబిలం. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి. ఆహోబిలం పర్యాటక కేంద్రంగానూ ఎంతో పేరు పొందింది. ఇక్కడికి వచ్చిన యాత్రీకులు ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలను సందర్శించకుండా వెనుదిరగరు. ముందుగా ఎగువ అహోబిలం చేరుకునేందుకు మా బృందం ప్రణాళికలు వేసుకుంది. మేమంతా విజయవాడ నుంచి బయలుదేరాం. అక్కడ ఆహోబిలానికి దగ్గరగా ఉండే స్థానిక మిత్రుడుకి ముందే సమాచారం అందించాం. అలా విజయవాడ నుంచి ఆళ్లగడ్డ బస్సులో బయలుదేరాం. ఉదయం ఏడు గంటలకు ఆళ్లగడ్డ బస్టాండ్లో దిగాం. ఒక్క ఫోన్ కాల్తో అనుకున్నట్టుగానే మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు మా మిత్రుడు అక్కడ వాలిపోయాడు.
రాయలసీమ రుచులు..
బస్స్టాండ్లోనే ఫ్రెష్ ఆప్ అయ్యాం. ఆకలి వేయడంతో అక్కడి స్పెషల్ ఏంటని అడిగాం. బస్టాండుకు ఎదురుగా ఉన్న ఓ హోటల్లో రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానీ బజ్జీ టిఫిన్ను అందరికీ ఆర్డర్ ఇచ్చాం. అది మేం తినక చాలారోజులు అవుతుందనుకోండి. మా నోరూరింది. వేడివేడి ఉగ్గానీ నోట్లోకి వెళుతుంటే, రాయలసీమ రుచి ఆ కారానికి మా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చినట్లు అనిపించింది. అంతటి కారాన్ని కూడా నవ్వుతూ ఆరగిస్తోన్న స్థానికులను చూస్తే, అదే కదా.. రాయలసీమ పౌరుషానికి ప్రతీక అని మనసులో అనుకున్నాం. అక్కడి ఆహారపు అలవాట్లే కాదు, పలకరింపులు కూడా కాస్త కటువుగా అనిపించినా వారి మనసు చాలా సుతిమెత్తనిది. అంతేకాదు, ఎదుటవారి గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూసుకోవడంలో సీమ ప్రజలకు మంచి పేరుంది. మా టిఫిన్ అయిన తర్వాత మా మిత్రుడు సమకూర్చిన బైక్లపై ప్రయాణాన్ని మొదలుపెట్టాం.
పందిరిలా కప్పేసిన పచ్చని చెట్లు
అప్పటికే వర్షాలు కురవడంతో వాతావరణం చాలా ఆహ్లదకరంగా అనిపించింది. ఆళ్లగడ్డ నుంచి పది కిలోమీటర్లు రాగానే దారిపొడవునా పచ్చని, పొడవైన చెట్లు రోడ్డుకి ఇరువైపులా పందిరిలా కప్పేశాయి. కొన్నిచోట్ల కొన్ని మీటర్ల మేర సూర్యకిరణాలే పడలేనంత గుబురు ప్రాంతాలు దర్శనమిచ్చాయి. కాస్తో కూస్తో వర్షాలు పడటంతో చుట్టుపక్కల చేలన్నీ పచ్చదనంతో నిండుగా ఉన్నాయి. మధ్యలో నరసాపురం అనే గ్రామంలో ఆగి టీ తాగి బయలుదేరాం. మా బృందానికి నేచర్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఎటు చూసినా పచ్చదనం. ఆ సమయంలో మా ఆనందానికి హద్దులు లేవు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని, బైకులు పక్కపక్కనే నడుపుతూ, పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ ఈలలు వేస్తూ ఉల్లాసంగా వెళ్ళ సాగాం. ఎదురుగా వస్తున్న వాహనాలలో ఉన్న వారికి టాటాలు చెబుతూ భలే ఎంజాయ్ చేశాం. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా కోతులు నించొని మరీ అడుగడుగునా మాకు స్వాగతం పలికాయి. యాత్రీకులు వెళ్తూ వస్తూ తమ వెంట తెచ్చుకున్న పండ్లు వాటికి ఇస్తున్నారు. కొన్ని తమ పిల్ల కోతులతో ముచ్చట్లాడుతుండగా, మరికొన్ని పొట్టలకు.. తగిలించుకుని గెంతుతూ... వింత చేష్టలతో అక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకున్నాయి. మా ప్రయాణంలో ఎదురైన అసలైన రాయలసీమ అందాలను రెండో భాగంలో తెలుసుకుందాం.