బాదామి అరుదైన శిల్పకళలతో అలరారుతూ, అక్కడి దేవాలయాలు చారిత్రక వైభవానికి చెరగని సాక్షాలుగా నిలుస్తూ .. విరాజిల్లుతున్నాయి. హిందూ దేవతలను పూజించేందుకై నిర్మించిన అక్కడి గుహాలయాలు నిజంగా సదర్శకులను భలేగా ఆకట్టుకుంటున్నాయి. బాదామి పట్టణానికి గల మరొక పేరు 'వాతాపి'. పురాణగాథల ప్రకారం 'వాతాపి' అనే రాక్షసుడు అగస్య మహర్షి చే ఈ ప్రాంతంలోనే సంహరిచబడ్డాడు. ఆ సంఘటన కు గుర్తుగా ఈ ప్రాంతాన్ని 'వాతాపి' అని పిలుస్తుంటారు.
ఇది కూడా చదవండి : ఐహోలే - రాతి శిల్పాల నగరం !
కర్నాటక రాష్ట్రంలోని బాదామి బాగల్ కోట జిల్లాలో కలదు. ఇదొక పురాతన పట్టణం. క్రీ.శ. 5 నుండి క్రీ.శ.7 వరకు అంటే సుమారు 2 శతాబ్ధాల పాటు బాదామి చాళుక్యుల రాజధాని గా ఉండేది. ఇది బెంగళూరు నగరం నుండి 457 కి. మీ దూరంలో, హంపి నుండి 150 కిలోమీటర్ల దూరంలో కలదు. బాదామి వెళితే చాళుక్యుల కాలానికి ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఇది కూడా చదవండి : హంపి - హోస్పేట్ పర్యాటక ప్రదేశాలు !
బాదామి మరియు దాని పరిసరాలు సుందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవుగా ఉన్నాయి. అందమైన లోయ, దాని చుట్టూ బంగారు వన్నె కల ఇసుక తిన్నెలు, గుహాలయాలు, 18 ఆయుధాలు ధరించి నటరాజ రూపంలో దర్శనం ఇచ్చే శివభగవానుడు, చాళుక్యులు నిర్మించిన మరికొన్ని ఆలయాలు మరియు కోటలు, అగస్త్య చెరువు, మ్యూజియం లు చూడదగినవి.
ఇది కూడా చదవండి : బెలూరు - హాలిబెడు సందర్శనీయ స్థలాలు !
బాదామిని సందర్శించే ప్రతి యాత్రికుడు తప్పక చూడవలసిన మరొక ప్రదేశం పట్టడక్కాళ్. ఇది బాదామి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి వెళ్ళటానికి లోకల్ గా బస్సు సర్వీసులు, జీప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పట్టడక్కాళ్ వెళితే చాళుక్యుల యుగంలోకి ప్రయాణించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కూడా నవ హిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయం ఉన్నాయి. ఈ దేవాలయాల శిల్ప కళా వైభవం అద్భుతంగా ఉండి, దక్షిణ భారతదేశ శిల్ప కళా శైలిని గోచరిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా చాళుక్యుల కాలానికి ప్రయాణిద్దాం పదండి ..!

బాదామి
బాదామి చాళుక్యుల రాజధాని. చాళుక్యులు ఈ ప్రాంతంలో ఆలయాలను, కోటలను నిర్మించినారు. ఇక్కడ రాళ్ళను తొలచి గుహాలయాలుగా మార్చిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను కనులారా చూసి ఎవ్వరైనా ముగ్ధులు కావలసిందే ...! భారతదేశ చిత్ర పరిశ్రమ సైతం ఈ ప్రదేశ అందాలను ఎన్నో సినిమాల్లో చూపించింది కూడా ..!
చిత్ర కృప : Shashi Bhooshan

గుహాలయాలు
బాదామి లో ప్రముఖంగా చెప్పుకోవలసినది గుహాలయాలు. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయంలో చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యాన్ని చూడవచ్చు. అందులో మొదటి మూడు గుహాలయాలను హిందూ దేవతల కోసం, మిగిలిన గుహాలయం జైనుల కోసం నిర్మించినారు.
చిత్ర కృప : Sanyam Bahga

మొదటి గుహాలయం
మొదటి గుహాలయం అన్నింటికంటే ప్రాచీనమైనది(క్రీ.శ. 5 వ శతాబ్ధం నాటిది). ఇక్కడి ప్రధాన ఆకర్షణ నటరాజ రూపంలోని శివ భగవానుడు. భరతనాట్యం లో ఉండే 81 ముద్రణలని కళ్లముందు కనిపించేలా 18 చేతులతో నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఏ రెండు చేతులను కలిపి చూసిన ఒక ముద్ర వస్తుందంటారు ఇక్కడి పర్యాటకులు. ఈ వింత ప్రపంచంలో బహుశా .. మరెక్కడా కనిపించదేమో!
చిత్ర కృప : sonomama

రెండవ గుహాలయం
రెండవ గుహాలయం పూర్తిగా విష్ణుమూర్తి చెక్కాడాలతో ఉంటుంది. వరాహ మరియు త్రివిక్రమ అవతారాలలో విష్ణుమూర్తి ని చూపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి, గరుడ అవతారాలను ఆలయ పై భాగాన చూడవచ్చు.
చిత్ర కృప : Puru Shadows Galore

మూడవ గుహాలయం
మూడవ గుహాలయం 100 అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి త్రివిక్రమ మరియు నరసింహ అవతారాలలో కనపడతాడు. అంతేకాక గుహలో శివ పార్వతుల కళ్యాణ ఘట్టాలను చెక్కిన తీరును చూడవచ్చు.
చిత్ర కృప : Tushar D

నాల్గవ గుహాలయం
నాల్గవ గుహాలయం జైన మతానికి సంబంధించినది. ఇక్కడ కూర్చొని ఉన్న భంగిమలో మహావీరుడు, తీర్థంకరుడు పార్శ్వనాథుడు కనిపిస్తారు.
చిత్ర కృప : Andrea Kirkby

భూతనాధ దేవాలయం
భూతనాధ దేవాలయం భూతనాధ దేవాలయాల సమూహాలలో మొదటిది. ఇక్కడ శివుడు భూతనాధుడి గా ఆరాధించబడతాడు. ఇదొక ఇసుక రాతి దేవాలయం. ఈ దేవాలయాన్ని అగస్త్య సరస్సుకు తూర్పు భాగాన క్రీ.శ.5 వ శతాబ్ధంలో నిర్మించినారు.
చిత్ర కృప : Lipin Nair

మల్లికార్జున దేవాలయం
మల్లికార్జున దేవాలయం భూతనాధ దేవాలయాల్లో రెండవ ప్రధాన ఆలయం గా ముద్రపడింది. అగస్త్య సరస్సుకు ఈశాన్యాన ఉన్న ఈ ఆలయంలో కల్యాణి చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలు కనిపిస్తాయి. రథాలు, పిరమిడ్ నిర్మాణాలు, మండపాలు, దేవదూతలు ఇక్కడి ఆకర్షణలు నిలిచాయి.
చిత్ర కృప : Ankur P

బణశంకరి దేవాలయం
బణశంకరి దేవాలయం, చాళుక్యుల కుల దేవత పార్వతి దేవి ఆలయం. ఆలయంలోని దేవత నల్లని శిలతో చెక్కబడి ఉంటుంది. అమ్మవారు ఎనిమిది చేతులను కలిగి, సింహాసనం మీద కూర్చొని ఒక రాక్షసుడిని తన కాళ్ళకింద నలిపివేస్తున్నట్లు కనపడుతుంది.
చిత్ర కృప : Rolland Santimano

బాదామి కోట
బాదామి పట్టణంలో బాదామి ఫోర్ట్ ప్రధాన ఆకర్షణ. ఇది ఒకప్పుడు చాళుక్య సామ్రాజ్యంలో రాజుల నివాసంగా ఉండేది. ఈ కోటలో రెండు శివాలయ సముదాయాలుంటాయి. ఇవి శివభక్తుడైన రాజు పులకేశి 2 చే 5వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి.
చిత్ర కృప : lesterlester1

మాలేగిట్టి శివాలయ
మాలే గిట్టి శివాలయం బాదామి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పై కలదు. ఈ దేవాలయాన్ని ఒక పూల దండలు తయారు చేసే భక్తుడికి అంకితం చేశారు. ఇక్కడ రెండు శిలాశాశనాలు, కోట గోడలు, ధాన్యాగారం, భూగర్భ గది కూడా ఉన్నాయి.
చిత్ర కృప : David Haberlah

దత్తాత్రేయ దేవాలయం
క్రీ.శ. 12 వ శతాబ్ధంలో నిర్మించిన మూడు ముఖాల దత్తాత్రేయ ఆలయం తప్పక చూడాలి. ఇక్కడ గల ప్రధాన దైవం దత్తాత్రేయుడు. ఈ భగవంతుడిని బ్రహ్మ, విష్ణు మరియు పరమేశ్వరుల అవతారంగా పూజిస్తారు. ఈ దేవాలయంలో కూడా శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుంది.
చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU

పురావస్తు మ్యూజియం
బాదామి లోని పురావస్తు మ్యూజియం శిల్పకళ సంపద కు నిలయం. క్రీ.శ. 5 వ శతాబ్ధం నుండి క్రీ.శ. 16 వ శతాబ్ధం వరకు చీందిన అనేక శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. మ్యూజియం మొత్తం నాలుగు గ్యాలరీ లు కలిగి ఉండి, పురాతన రాతి ప్రదేశాన్ని తలపిస్తుంది.
చిత్ర కృప : Leo Koolhoven

పట్టడక్కాళ్
పట్టడక్కాళ్ బాదామి పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది కూడా చాళుక్యుల సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా ఉండేది. ఇక్కడికి చేరుకోగానే మలప్రభ అనే నది ఒడ్డున గల విశాలమైదానంలో 10 రకాల దేవాలయాలు ఎర్రటి రాయితో నిర్మించినట్లు కనిపిస్తాయి.
చిత్ర కృప : Manjunath Doddamani Gajendragad

పట్టడక్కాళ్
పట్టడక్కాళ్ అనే హేరిటేజ్ ప్రదేశంలో 9 హిందూ దేవాలయాలు, ఒక జైన దేవాలయం కనిపిస్తాయి. హిందూ దేవాలయాలు విషయానికి వస్తే గాల్గనాధ, మల్లికార్జున, కాడ సిద్దేశ్వర, జంబులింగేశ్వర, సంగమేశ్వర, విరూపాక్ష మరియు పాపనాధ ఆలయాలు ప్రముఖమైనవి మరియు ఒక జైన దేవాలయం కూడా ఉన్నది.
చిత్ర కృప : Nagarjun Kandukuru

భోజన, వసతి సదుపాయాలు
వచ్చిన సందర్శకులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించేందుకు బాదామిలో అనేక హోటళ్లు, రిశార్ట్ లు కలవు. విలాసవంతమైన హోటళ్లు సైతం పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల తాయిలాలను ఆఫర్ చేస్తున్నది. సంప్రదాయ వంటకాల రుచి ఇక్కడ అద్దిరిపోతుందట ...!
చిత్ర కృప : Tomas Belcik

బాదామి చేరుకోవటం ఎలా ?
బాదామి చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం
బాదామి పట్టణంలో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ 190 కి.మీ. దూరంలో ఉన్న బెల్గాం విమానాశ్రయం సమీప విమానాశ్రయం. బెంగళూరు, ముంబై, చెన్నై, హైద్రాబాద్ నగరాల నుండి ఇక్కడికి విమాన సర్వీసులను నడుపుతున్నారు. బెల్గాం నుండి ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి బాదామి చేరుకోవచ్చు.
రైలు మార్గం
హుబ్లీ రైల్వే స్టేషన్ బాదామికి 100 కి. మీ. దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడింది. హుబ్లీ రైల్వే స్టేషన్ లో దిగి ప్రభుత్వ బస్సులో ప్రయాణించి బాదామి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
హంపి నుండి, బెల్గాం నుండి బాదామికి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. బెంగళూరు, బీజాపూర్ మరియు హైదరాబాద్ నుండి కూడా బాదామికి బస్సులు కలవు. సమీప ప్రాంతాల నుంచి ఆటోలు, గుర్రపు బగ్గీలు ఎక్కి బాదామి చేరుకోవచ్చు.
చిత్ర కృప : Matthias Armbruster



Click it and Unblock the Notifications

