దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపందాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై..కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ.., అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.
ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు 'మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు' అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి 'నీ జగన్మోహన రూపాన్ని చూపించు' అని అడిగాడు. పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి.. విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై..తనను తానే మరచి ఆ జగన్మోహిని వెంటబడ్డాడు.

ఎక్కడ ఉంది?
జగన్మోహిని శివుని చేతికి చిక్కక..చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకం వచ్చి ఆగి శిలారూపం దాల్చింది. అదే తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటకు పది మైళ్ల దూరంలో గల ‘ర్యాలి' అనే గ్రామంలో ఉన్న ‘జగన్మోహినీ కేశవస్వామి' దేవాలయం.
pc:youtube

ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెంకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ గ్రామం ఉంది. ఇక్కడ జగన్మోహినీ - చెన్న కేశవస్వామి ఆలయం ఉంది. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించాడని చెబుతారు.
pc:youtube

ఉట్టిపడే జీవకళ
ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం ఉంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది.
pc:youtube

పుట్టుమచ్చ
అమె సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడ సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం ఉరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది.
pc:youtube

జగన్మోహిని
విష్ణుదేవుని పాదాల దగ్గరేకదా గంగ పుట్టింది. ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు, శ్రీదేవి, భూదేవి, గంగ, గరుత్మంతుడు, చెక్కబడారు. దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని పంచివచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తియేనని మరచి, ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంటపడి పరుగెత్తాడట.
pc:youtube

బదలీ ఆలయం
ఆమె యిక్కడి వరకూ వచ్చి జగన్మోహినీ-చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని యిక్కడ జనం వాడుకగా చెబుతుంటారు.ఈ ఆలయాన్ని 'బదలీ ఆలయంగా' ప్రసిద్ధి చెందింది.
pc:youtube

నమ్మకం
ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదలీ అవుతారనే నమ్మకం ఆంధ్ర ప్రదేశ్ అంతటా వ్యాపించింది.
pc:youtube

రాజకీయ వేత్తలు
మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజార్లు చమత్కరిస్తుంటారు.
pc:youtube

ఘంటచోళుడు
పూర్వం ‘ర్యాలి' ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ‘ఘంటచోళుడు' అనే చక్రవర్తి పరిపాలిస్తూండేవాడు.
pc:youtube

ఘంటచోళుడు
ఒకసారి ‘ఘంటచోళుడు' వేటకని ఆ అరణ్యాలకు వచ్చి, చాలాసేపు వేటాడి, అలిసిపోయి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరిసంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి.
pc:youtube

ఘంటచోళుడు
చక్రవర్తి కన్నులు తెరిచి చూసాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ‘ఘంటచోళుడు' వేట చాలించి రాజథానికి వచ్చాడు. ఆ రాత్రి ‘ఘంటచోళుని' కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి ‘రాజా..ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు.
pc:youtube

రథం
ఆ రథం శీల ఎక్కడ ఊడి పడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమౌతుంది' అని ఆదేశించాడు. నిద్రనుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి, వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు.
pc:youtube

జగన్మోహిని
ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా ‘జగన్మోహిని' విగ్రహం బయటపడింది. మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒకప్రక్కన శ్రీ మహావిష్ణువు ఆకృతి ఉంటే... మరొకప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది.
pc:youtube

ర్యాలి
స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేయించాడు ‘ఘంటచోళ చక్రవర్తి'. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. అదే ప్రస్తుతం ‘ర్యాలి' గ్రామంలోనున్న ‘జగన్మోహిని కేశవస్వామి' దేవాలయం. ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంది.
pc:youtube

జగన్మోహిని
అదే.. నాడు జగన్మోహిని వెంట పరుగులు తీస్తూవచ్చిన పరమశివుని ఆలయం. ఆ స్వామిని ‘ఉమాకమండలీశ్వరుడు' అని అంటారు. శిల్పకళాచార్యుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం ‘జగన్మోహినీ కేశవస్వామి' దేవాలయం.
pc:youtube

జగన్మోహిని
సుమారు ఐదడుగుల ఎత్తు ఉన్న నల్లటిశిలలో నయన మనోహరంగా ఉండే ‘కేశవస్వామి' ఒకప్రక్క..భక్తుల హృదయాలను దోచుకునే రూపంతో ‘జగన్మోహిని'గా మరొకప్రక్క.. అందరినీ ఆకర్షించే ఆ నల్లని ఏకశిలా మూలవిరాట్టులో.., భక్తుని ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది.
pc:youtube

పద్మినీజాతి స్త్రీ
ఇదే ఆ సుందర,సుకుమార ‘జగన్మోహినీ కేశవస్వామి' శిల్పకళా వైభవ ప్రత్యేకత. అంతేకాదు.. పద్మినీజాతి స్త్రీకి వెనుకవైపున సహజంగా ఉండే పుట్టుమచ్చ ఈ ‘జగన్మోహిని' శిల్పానికి వెనుక భాగంలో ఉండి, భక్తులకు చక్కగా కనబడడం ఈ శిల్పం ప్రత్యేకత.
pc:youtube

విశ్వసృష్టి
విశ్వసృష్టికి మూలభూతమైన స్త్రీ, పుంసాత్మకమైన ఈ ‘జగన్మోహిని'కి మన ఆంధ్రదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడ దేవాలయం లేదు. ఈ ‘జగన్మోహిని' శిరో భూషణాలు, శరీర అలంకారాలు, ముఖ సౌందర్యం వర్ణనాతీతం.
pc:youtube

నిరంతరం ఉద్భవించు ‘జలం
ఇక ‘కేశవస్వామి' అరచేతిలోని రేఖలు, కంఠసీమ మీది మడతలు.,నాలుగు చేతులలోని శంఖ, చక్ర, గదా, పద్మాలు ఆనాటి శిల్పుల కళాచాతుర్యానికి తార్కాణాలు. ఆ ‘కేశవస్వామి' పాద పద్మాలనుంచి నిరంతరం ఉద్భవించు ‘జలం' భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
pc:youtube

మూర్తి సౌందర్యం
ఆ స్వామి పాదోద్భవ జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. పండుగల్లోను, పర్వదినాల్లోను ఈ స్వామికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ మూర్తి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీరాలి.
pc:youtube

ఆధ్యాత్మిక భావన
అలా చూడలేనివారు కళ్లుండి కూడా గ్రుడ్డివారే .. అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎంత ఆధ్యాత్మిక భావన మనసులో మెదలుతోంది.ఏమైనా సరే ఒక్కసారి మనం ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని దర్శించాల్సిందే.
pc:youtube

ఎలా వెళ్ళాలి?
హైదరాబాద్ నుండి సూర్యాపేట, విజయవాడ, ఏలూరు మీదుగా కారు ప్రయాణం 7గంలు పడుతుంది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి 1 గంట సేపు ప్రయాణం
PC:google maps



Click it and Unblock the Notifications













