తెలుగు రాష్ట్రాలలో వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియనివారుండరు. గొప్ప తత్వవేత్త , సంఘసంస్కర్త, మానవతావాది ఈయన. రాబోయే కాలములో జరిగే పరిణామాలను, సంఘటనలను ముందుగానే ఊహించి రాసిన 'కాలజ్ఞానం' అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక అద్భుతంగానే పరిగణించబడుతుంది. కాలజ్ఞానం లో పేర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో ఆయన్ను పూజించే వారి సంఖ్య కూడా పెరిగిపోతున్నది.
బ్రహ్మంగారు వివిధప్రాంతాలను తిరుగుతూ తిరుగుతూ కడప జిల్లా కందిమల్లయపల్లి లో జీవసమాధి చెందారు. కాలక్రమంలో ఇక్కడే ఆయన మఠం కూడా వెలిసింది. ఆయన తిరుగాడిన ఈ నేలను, వస్తువులను, సమాధిని దర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు.

బ్రహ్మగారిమఠం (కందిమల్లయపల్లె) ఎలా చేరుకోవాలి ?
కడప రవాణా పరంగా అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, బస్ స్టాండ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుండి కందిమల్లయపల్లె 60 కి. మీ ల దూరం. కడప నుండి వయా మైదుకూరు మీదుగా కందిమల్లయపల్లె చేరుకోవాలి. మైదుకూర్ నుండి 37 కి. మీ ల దూరం ఉంటుంది మఠం.

కందిమల్లయపల్లి
బ్రహ్మం గారు కందిమల్లయపల్లి లో వడ్రంగిగా జీవనాన్ని కొనసాగించాడు. అంతకు ముందు బనగానపల్లె లో 'గరిమిరెడ్డి అచ్చమ్మ' ఆశ్రయం పొంది, పశువుల కాపరిగా ఉండెను. అక్కడే రవ్వలకొండ వద్ద ఉన్న గుహలలో కూర్చొని కాలజ్ఞానం రచించెను మరియు దీనిని అచ్చమ్మ కు బోధించి అనుగ్రహించెను. వీరు మాట్లాడుకున్న ప్రదేశమే 'ముచ్చట్ల కొండ' గా పిలుస్తారు.
చిత్రకృప : Akshara Sathwika Ram

అరుదైన సంఘటన
కొంత కాలం గడిచిన తరువాత బ్రహ్మం గారు కందిమల్లయ పల్లి చేరుకొని వడ్రంగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఒక అరుదైన సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ ఊరి గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో జాతర నిర్వహించటానికి అందరూ చందాలు వేసుకుంటూ బ్రహ్మంగారిని అడుగుతారు. అప్పుడు అయన తాను నిరుపేదనని చందా ఇవ్వలేనని చెబుతారు. ఇవ్వాల్సిందేనని గ్రామస్థులు పట్టుబట్టడంతో సరే అని అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇస్తానిని చెప్పి రచ్చబండ వద్దకు వచ్చాడు బ్రహ్మంగారు.
చిత్రకృప : Kranthi Veer

అరుదైన సంఘటన
అక్కడే చుట్ట కాల్చు కోవడానికి నిప్పు కావాలని చుట్టు ఉన్నవారిని అడిగారు. వారు లేదనడంతో "పోలేరమ్మా చుట్టకాల్చుకోవాలి నిప్పుతీసుకురా!" అని పెద్దగా కేకపెట్టారట బ్రహ్మంగారు. వెంటనే మండే ఒక నిప్పుకర్ర స్వామి చెంతకు వచ్చింది. శ్రీ స్వామి వారు చుట్ట కాల్చుకొని "ఇక చాలు తల్లి తీసుకు పో" అనగానే పోలేరమ్మ గుడిలోకి వెళ్లి పోయిందట. ఇప్పటికీ రచ్చబండ, పక్కనే పోలేరమ్మగుడి కనిపిస్తుంటాయి.
చిత్రకృప : Raghuramacharya

ఇతర ఆకర్షణలు
శ్రీ ఈశ్వరమ్మ సమాధి :
శ్రీ ఈశ్వరమ్మ గారు బ్రహ్మంగారి మనువరాలు (రెండవ కుమారుడైన గోవిందయ్య కుమార్తె). ఈమె కూడా పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానిగా పిలువబడింది. ఈమె సమాధి కూడా కందిమల్లయపల్లె లో కలదు. నవరత్న మండపం కూడా సందర్శించదగినదే !
చిత్రకృప : Kranthi Veer

ఇతర ఆకర్షణలు
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్
ఈ రిజర్వాయర్ కు గల మరో పేరు సుండుపల్లి రిజర్వాయర్. ఇది తెలుగు గంగ ఇరిగేషన్ ప్రాజెక్టు లో ఒక భాగం. దీని శిలాఫలకాన్ని స్వర్గీయ ఎన్. టి. రామారావు స్థాపించాడు. చుట్టూ కొండలు, మధ్యలో రిజర్వాయర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
చిత్రకృప :Raghuramacharya

ఇతర ఆకర్షణలు
నారాయణ స్వామి ఆశ్రమం
కందిమల్లయపల్లె కు పొరుగున ఉన్న ఓబులరాజు పల్లె నారాయణ స్వామి ఆశ్రమానికి ప్రసిద్ధి చెందినది. అవధూత నారాయణస్వామి కర్నూలు జిల్లాలో విస్తృతంగా పర్యటించడం వలన కర్నూలు నారాయణ రెడ్డిగా అయన ప్రసిద్ధులు. బొమ్ము వంశానికి స్వామి వారు ఇలవేల్పు.
చిత్రకృప :Daiva Sannidhi

ఇతర ఆకర్షణలు
అనుభూతి
ఏమైనా కందిమల్లయపల్లె లో తిరుగ తుంటే ఒక వింత అనుభూతి కలుగుతుంది. అక్కడ తిరిగే భక్తులందరూ తల స్నానాలు చేసి జుట్టులు వదిలేసి, ముఖాన బొట్టు పెట్టుకొని కన్పిస్తారు.
చిత్రకృప : Sunkesula Ameer

ప్రత్యేక ఉత్సవాలు
ప్రతి మహా శివరాత్రి కి శ్రీ వీరబ్రహ్మం గారి దంపతులకు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశాఖ శుద్ద దశమి రోజున జరిగే శ్రీ స్వామి వారి ఆరాథనోత్సవాలకు వేలాదిగా భక్తులు హాజరవుతారు.
చిత్రకృప : vishwabrahmana

దృశ్యాలలో ..!
బ్రహ్మంగారి ఇల్లు
చిత్రకృప : venaktesh reddy

దృశ్యాలలో ..!
బ్రహ్మంగారు ఒక్కరాత్రిలో తన ఇంటి ఆవరణలో తావియునట్లు చెప్పబడుతున్న బావి
చిత్రకృప : venkatesh reddy



Click it and Unblock the Notifications













