కడప రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్య పట్టణం మరియు జిల్లా . కడపను దివంగత నేత డా. వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారకార్ధం వైఎస్ ఆర్ జిల్లాగా ప్రకటించినారు. వాకిలి, ద్వారం, ప్రవేశ మార్గం అనబడే అర్ధాలు వచ్చే తెలుగు పదం 'గడప' నుండి కడప అనే పేరు ఈ నగరానికి వచ్చింది. కడపకి పశ్చిమవైపున ఉన్న పవిత్ర క్షేత్రం మైన తిరుమల కి ఈ నగరం ప్రవేశ మార్గం గా ఉండడం వల్ల ఈ నగరానికి ఈ పేరు వచ్చింది.
కడప చరిత్ర గురించి కొద్ది మాటల్లో ....
చోళ సామ్రాజ్యంలో ముఖ్య భాగంగా ఈ నగరం పదకొండు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్యలో పరిగణించబడింది. పద్నాలుగవ శతాబ్దం తరువాత, ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోయింది. విజయనగర చక్రవర్తుల యొక్క గవర్నర్స్ గా వ్యవహిరించిన గండికోట నాయకులు ఈ ప్రాంతం లో అనేకమైన టాంకులు అలాగే ఆలయాలు నిర్మించారు. కడప, 1565 లో గోల్కొండ ముస్లిం రాజు మీర్ జుమ్లా, అప్పటి రాజైన చిన్న తిమ్మ నాయుడు ని ఓడించి గండికోటని ఆక్రమించాడు. ఆ తరువాత, ఖుతుబ్ షాహీ పరిపాలకుడైన నేక్నం ఖాన్ కడప యొక్క సరిహద్దుల్ని విస్తరింపచేసి వాటిని నేక్నామాబాద్ గా పిలిచేవాడు. అయినప్పటికీ, చరిత్రకి సంబంధించిన విషయాల గురించి తెలియచేసేటప్పుడు చరిత్రకారులు 'నేక్నామాబాద్ నిజాములు' అని ప్రస్తావించడం కంటే 'కడప నిజాములు' గా నే ప్రస్తావిస్తారు. మసీదులు, దర్గాలు నిర్మించడం ద్వారా నవాబులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మరియు నిర్మాణ కళల కు ఏంతో దోహదపడ్డారు. 1800 సంవత్సరం సమయంలో, బ్రిటిష్ వారు కడపని వారి అధీనంలోకి తీసుకుని, మూడు చర్చిలని ఈ నగరం లో నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నగరం మున్సిసిపాల్ కార్పొరేషన్ లో భాగం అయ్యింది.
ఫ్రీ కూపన్లు : అన్ని థామస్ కుక్ ప్రయాణం కూపన్లు సాధించండి
కడప రుచులు
నన్నారి షర్బత్ & లస్సి, కారం దోశెలు, రాగి సంకటి - వంకాయ బజ్జీ, అలసంద వడలు, బొరుగుల వగ్గాని , బచ్చాలు, గువ్వల చెరువు పాలకోవా ,వీరబల్లె బెనీశా మామిడి పండ్లు, పులివెందుల అరటి, కడప దోశె పండ్లు, రైల్వే కోడూరు మామిడి, అరటి, బొప్పాయా, ఇక మాంసా హారుల విషయానికొస్తే ఫేమస్ కాంబినేషన్ అయిన రాజశేఖర్ రెడ్డి ఇష్టపడే వంటకం రాగి సంకటి - నాటు కోడి పులుసు, చెన్నూరు కుండా బిర్యానీ. ఇక బిర్యానీ తిని ఊరుకుంటామా ... తమలాపాకు వేసుకోవాలసిందే !! అదికూడా చెన్నూరు తమాలాపాకులు వేసుకుంటేనే మజా !!
Photo Courtesy: kadapa
ఆమీన్ పీర్ దర్గా
కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం ఈ అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ దర్గాకి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని మరియు అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు. ఈ దర్గాలో ఈ సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించడం ద్వారా కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం. ప్రవక్త మహమ్మద్ యొక్క వారసుడు పీరుల్లహ్ హుస్సేన్ అని ఎక్కువ మంది నమ్మకం. భారత దేశం లో ని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఇతను అజ్మీరు విన్నపం వల్ల కడప లో స్థిరపడ్డారు. ఈ దర్గాకి చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు వస్తుంటారు. ఇక్కడికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రెహమాన్ ఎక్కువగా సందర్శిస్తుంటాడు. అంతే కాదు సినిమా యాక్టర్లు, కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
Photo Courtesy: Satyanath Venkata Rajamahanti
భగవాన్ మహావీర్ మ్యూజియం
1982 లో నిర్మింపబడిన ఈ భగవాన్ మహావీర్ మ్యూజియం కడపలో తప్పక సందర్శించవలసిన ప్రాంతం. ఈ మ్యుజియం , నిర్మాణం కోసం భారీ విరాళాలు జైన్ సంఘం ఏర్పాటు చేసింది. ప్రాచీన కళాకృతులు అలాగే జైన మతానికి సంబంధించిన నిర్మాణ కళలు ఈ మ్యూజియం లో గమనించవచ్చు. ఈ మ్యూజియం లో రాతి నుండి చెక్కబడిన శిల్పాలు, కాంస్యం తో తయారు చేయబడిన చిహ్నాలు, మట్టితో చేయబడిన బొమ్మలు, శాసనాలతో ఉన్న రాళ్ళు ఇలా ఎన్నో ఈ మ్యూజియం లో గమనించవచ్చు. పురావస్తు శాఖ తవ్వకాలలో బయట పడిన కళాకృతులని భగవాన్ మహావీర్ మ్యూజియంలో భద్రపరిచేందుకు కడపకి తీసుకువచ్చారు. ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు, జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం, శివుని తలపై నుండి కాకుండా పక్క నుండి పారుతున్న గంగతో శివుని విగ్రహం వంటి కొన్ని అరుదైన కళాకృతులు ఈ మ్యూజియంలో గమనించవచ్చు.
Photo Courtesy: kadapa
దెవునికడప
హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన దెవునికడప అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునే భక్తులు వారి తీర్ధయాత్ర లు పూర్తి అయినట్టుగా భావించాలంటే తప్పకుండా ఈ దేవుని కడపని సందర్శించవలసిందే. విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్షీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. గురు కృపాచార్య చేత ఈ ఆలయం లో వెంకటేశ్వర స్వామీ వారి విగ్రహం ప్రతిష్టింపబడినది. కృపావతి క్షేత్రంగా ఆ కాలంలో ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. పూజలు చెయ్యడానికి ఏంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారం పొడవునా ఈ ఆలయం భక్తుల సందర్శనతో కిటకిట లాడుతూనే ఉంటుంది. శనివారాలు అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.
Photo Courtesy: kadapa
చాంద్ ఫిరా గుంబద్
సయ్యద్ షా మొహమ్మద్ హుస్సెఇన్ కి సంబంధించిన సమాధి, కడప లో ఉన్న ఈ చాంద్ ఫిరా గుంబద్. నగరానికి నడిబోడ్డులో ఉండడం వలన ఈ సమాధిని సందర్శించడం తేలికే. ఈ భవనం యొక్క నిర్మాణం మరియు ఆకృతి లో ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. చదరపు ఆకారం లో ఉన్న ఈ భవనం మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఈ భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు సమాధులకి రక్షణగా ఉంటాయి. లోపల బయటా ఈ భవనం అందంగా అలంకరించబడినది. ఈ భవనం వద్ద ఉన్న పిట్ట గోడ చిత్రవిచిత్రమైన నమూనాల తో కప్పబడి ఉన్నది. నిజాముల కాలం నాటి నిర్మాణ శైలి కి ఈ సమాధి ఒక చక్కటి ఉదాహరణ.
Photo Courtesy: kadapa
మసీద్ - ఎ- అజాం
17 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ మసీదు - ఎ- అజాం అనబడే అద్భుతమైన మసీదు కడప లో ఉంది. గండికోట కి అతి సమీపం లో ఈ మాస్క్ ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పాలనలో ఉన్న కాలంలో కడప లో ఈ మాస్క్ నిర్మింపబడినదని చరిత్రకారుల నమ్మకం. అందువల్ల, ఎన్నో పెర్షియన్ శిలా శాసనాలు ఈ మాస్క్ గోడలపై కనబడతాయి. కడపలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ మసీదుకి ఏంతో మంది ముస్లిం భక్తులు విచ్చేసి నమాజ్ లేదా ప్రార్ధనలు చేస్తారు. పెర్షియన్ నిర్మాణాల ఆరాధకుడైన ఔరంగజేబ్ వల్ల పెర్షియన్ శైలి యొక్క నిర్మాణ శైలి తో ఇక్కడి నిర్మాణం ప్రభావితమయింది. ఔరంగజేబ్ కాలం లో ఉత్తర భారత దేశం లో నిర్మింప బడిన ఇతర మసీదుల తో ఈ మాస్క్ కి పోలికలు ఉన్నాయి.
Photo Courtesy: kadapa
పుష్పగిరి
కడప నుంచి కర్నూల్ కి వెళ్లే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండ పై ఉంది. హరిహరాదుల క్షేత్రంగా గుర్తించబడిన పుష్పగిరి క్షేత్రంలో ప్రాచీన కాలంలో సుమారుగా 100 కి పై గా ఆలయాలు ఉన్నట్టు పురాణగాధలు చెబుతున్నాయి. ఆది శంకరులు పూజించిన విద్యారణ్యస్వామి ప్రతిష్టించిన శ్రీచక్రం ,చంద్రమౌలీశ్వర లింగంతో ఈ క్షేత్రం విరజిళ్లుతుంది. కడప జిల్లాకు 16 కి. మీ. దూరంలో ఉండి, దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక , దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
Photo Courtesy: kadapa
గండి కోట
101 బురుజులతో నిర్మితమైన గండి కోట ఎంతో సుందరంగా, ధృడంగా ఉంటుంది. చుట్టూ నాలుగు మైళ్ళ దూరంతో ఎంతో విశాలంగా ఉంటుంది. 40 అడుగుల ఎత్తు గల ఈ కోట చూడటానికి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ఈ కోట లో 15 ,16 వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాలు, మసీదులు అలనాటి ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. చుట్టూ కొండలతో , అడవులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఈ కోట. ఈ ప్రదేశంలోనే పెన్నానది ఉరుకలేస్తుంది.
Photo Courtesy: SAIKAT SARKAR
కడప ఎలా వెళ్ళాలి
వాయు మార్గం
కడపకు చేరువలో కడప దేశీయ విమానాశ్రయం ఉంది. ఇది నగరానికి సుమారుగా 8 కి. మీ. దూరంలో ఉంది.
రైలు మార్గం
కడపలో రైల్వే స్టేషన్ ఉంది .ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు.
రోడ్డు మార్గం
కడపకు రోడ్డుమర్గం చక్కగా ఉంది. ఈ నగరం గుండా జాతీయ రహదారి వెళుతుంది. కర్నూల్, తిరుపతి , హైదరాబాద్, విజయవాడ, చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల నుంచి బస్సులు తిరుగుతుంటాయి. కనుక బస్సు ప్రయాణం ఎంతో సులువుగా ఉంటుంది.
ప్రైవేట్ సౌకర్యం
నగరంలో ప్రయాణించాలంటే ఆటో రిక్షాలే గతి. ఎక్కడ నుంచి అయినా సరే 10 రూపాయల చార్జీ తో మొదలవుతుంది.
Photo Courtesy: Vinayaraj