రాజస్థాన్ రాష్ట్రంలోని ఐదో అతి పెద్ద అజ్మీర్ జిల్లాలో, రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. దీన్ని పూర్వం అజ్మీరీ లేదా అజయ్ మేరు అని పిలిచేవారు. ఈ ఊరికి రెండువైపులా ఆరావళి పర్వతాలు ఉన్నాయి. దేశంలోని పురాతన కోటల్లో ఒకటైన తారాఘర్ కోట అజ్మీర్ నగరాన్ని కాపాడుతోంది.ఈ నగరాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో అజయరాజ్ సింగ్ చౌహాన్ స్థాపించాడు. దీన్ని చాలా కాలం పాటు చౌహాన్ వంశీయులు పరిపాలించారు, వారిలో పృధ్వీ రాజ్ చౌహాన్ సుప్రసిద్ధుడు.
చరిత్ర పుటల్లో అజ్మీర్ :అజ్మీర్ ను క్రీ. శ.1193లో మొహమ్మద్ ఘోరీ చేజిక్కించుకున్నాడు. ఐతే, తనకు పెద్ద మొత్తంలో కప్పం కట్టాక చౌహాన్ వంశీయులకు అజ్మీర్ రాష్ట్రం పై స్వయం ప్రతిపత్తి ఇచ్చాడు. అజ్మీర్ ను తరువాత మేవార్ రాజు 1365 లోను, మార్వార్ రాజు 1532 లోను చేజిక్కించుకున్నారు. 1553 లో హేముగా పిలువబడే హేమ చంద్ర విక్రమాదిత్యుడు అజ్మీర్ ను గెలిచాడు – అతను 1556లో రెండో పానీపట్టు యుద్ధం లో చనిపోయాడు. 1559 లో అజ్మీర్ ముఘల్ చక్రవర్తి అక్బర్ అధీనంలోకి వచ్చింది – తరువాతా 18వ శతాబ్దంలో మరాఠాల చేతికి వెళ్ళింది.
1818 లో బ్రిటిష్ వారు 50000 రూపాయలు చెల్లించి మరాఠాల నుంచి అజ్మీర్ ను వశపరచుకున్నారు – దీంతో అది అజ్మీర్ – మేవార్ రాష్ట్రంలో భాగం అయింది. 1950 లో అది అజ్మీర్ రాష్ట్రంగా ఏర్పడి, తరువాత 1 నవంబర్ 1956న రాజస్థాన్ రాష్ట్రం లో కలిసింది.
రాజధాని జైపూర్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో వుంది అజ్మీర్. అజ్మీర్ లోని తారాఘర్ కోట సుప్రసిద్ధి చెందింది.
మనోహర ప్రాంతాల సమాహారం:గొప్ప సూఫీ ప్రవక్త ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ సమాధి వున్న దర్గా షరీఫ్ గురించి అజ్మీర్ బాగా సుప్రసిద్ధం. తరాఘర్ కోట మీట వున్న దర్గా షరీఫ్ ను అన్ని మతాలూ, ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తారు.నగరానికి ఉత్తరంలో అందమైన అనా సాగర్ అనే కృత్రిమ సరస్సు వుంది. షాజహాన్ నిర్మించిన బర్దారి మంటపాలు ఈ సరస్సును మరింత అందంగా తయారుచేస్తాయి. అటు యాత్రికులకు, ఇటు స్థానికులకు కూడా అనా సాగర్ మంచి విహార కేంద్రం.
ఒకప్పుడు అక్బర్ నివాస౦గా వున్న భవనంలో ప్రస్తుతం అజ్మీర్ మ్యూజియం వుంది. ఇక్కడ 6, 7శతాబ్దాల నాటి హిందూ దేవతలా విగ్రహాలు వున్నాయి. పెద్ద సంఖ్యలో శిల్పాలు, ముఘల్ చక్రవర్తులు, రాజపుత్రులు వాడిన ఆయుధాలు కూడా ఇక్కడ యాత్రికుల కోసం ప్రదర్శిస్తున్నారు.
రెండున్నర రోజుల్లో నిర్మించినట్టు చెప్పబడే అడాయి దిన్ కా ఝోమ్పడా అనే మసీదు ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రతీక. నసీయన్ (ఎర్ర) దేవాలయం, నింబార్క పీఠం, నరేలీ జైన దేవాలయం అజ్మీర్ లోని ఇతర ప్రధాన ఆకర్షణలు.
గత కాలపు భారత రాజవంశీకుల కోసం, ముఖ్యంగా రాజపుత్రుల కోసం ఏర్పాటు చేసిన మాయో కాలేజ్ ఇప్పుడు దేశంలోని అత్త్యుత్తమ స్కూళ్ళ లో ఒకటి.ఇక్కడికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో వున్న పవిత్ర పుష్కర్ నగరానికి వెళ్ళడానికి అజ్మీర్ ముఖద్వారం లా వుంటుంది. ప్రసిద్ది చెందిన ఇక్కడి బ్రహ్మ దేవాలయం, పుష్కర్ సరస్సు చూడ్డానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారు.
అజ్మీర్ చేరుకోవడం.. అజ్మీర్ కి వాయు, రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జైపూర్ లోని సంగనేర్ అజ్మీర్ కి సమీప విమానాశ్రయం. అజ్మీర్ దగ్గరి రైల్వే స్టేషన్, ఇక్కడినుండి భారతదేశం లోని అన్నిప్రధాన నగరాలకు రైళ్ళు ఉన్నాయి. అజ్మీర్ కు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుండి కూడా రోడ్డు మార్గ౦ ద్వారా అనుసంధానించబడి ఉ౦ది. శీతాకాలం లో ఇక్కడి వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక అజ్మీర్ వెళ్ళడానికి శీతాకాలం సరైన సమయం.