మీకు చిరపుంజి గుర్తుందా!! అదేనండి దేశంలో కెల్ల ఎక్కువ వర్షపాతం నమోదైతుందే ఆ... గుర్తొచ్చిందా! అట్లాంటి చిరపుంజే మన దక్షిణ భారతదేశంలో కూడా ఉంది అదే అగుంబే . దీనిని ' దక్షిణాది చిరపుంజి' గా అభివర్ణిస్తారు. ఈ ప్రదేశం చాలా భయానకంగా ఉంటుంది. అంతేనా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తే ఇక అంతే సంగతులు!! అందుకే సరైనా సక్సెస్ రావాలని దర్శకుడు తేజ ఈ అడవులలోనే ఒక నెల రోజుల పాటు ఉండి లవ్ స్టోరీ సినిమా ప్లాన్ చేశాడు.
ఈ ప్రదేశం కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో కలదు. దట్టమైన అడవులు, ఎగిసిపడే జలపాతాలు అన్నింటిని మించి ఇక్కడున్న అందమైన పడమటి కనుమలు ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ ప్రదేశపు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల రావు చెప్పే ఒక ఫెమస్ డైలాగ్ ఉంది అదేనండి 'మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?' కళాపోషణ అంటే ఏదో అని ఆలోచించకండి. ఆది ఏదైన కావచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ చెప్పుకోవలసినది సాహసం. ఎందుకంటే ఈ ప్రదేశం సాహసికులకు ఒక నిజమైన సాహసమే మరి !! ఎందుకంటారా ఈ ప్రదేశంలో విషం జిమ్మె విష నాగులు అధికంగా అడుగడుగునా ఉంటాయట. అందుకే ఈ ప్రదేశం కింగ్ కొబ్రా కి పుట్టినిల్లు అయ్యింది. ఈ ప్రదేశంలో సంచరించాలంటే గొప్ప సాహసమే చేయాలి మరి !!
నేటి ఫ్రీ కూపన్లు : అన్ని థామస్ కుక్ ప్రయాణ కూపన్లను సాధించండి
మీకు దూరదర్శన్ ఛానెల్లో ప్రసారమైన మాల్గుడి డేస్ అనే ధారావాహిక నాటకం గుర్తుందా !! అవునులెండి నాదే పొరపాటు, మీరు ఇలాంటి కథలు చూస్తారా ఏంటి ? ఈ ధారావాహిక నాటకం అగుంబేలోనే చిత్రీకరించారు. ఇక్కడ కొన్ని జాగ్రత్తగా చూడాల్సిన కొన్ని ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ..
కింగ్ కోబ్రా
రాజనాగాన్ని (కింగ్ కోబ్రా) కనుగొన్నది ఇక్కడే...! సుప్రసిద్ధ సర్ప (పాముల) పరిశోధకుడు రోములస్ విట్టేకర్.. 1970వ సంవత్సరంలో ఆగుంబె ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా రాజనాగాన్ని (కింగ్ కోబ్రా) కనుగొన్నారు. ఇందుకుగానూ ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నుంచి విట్లీ అవార్డును కైవసం చేసుకున్నారు.
Photo Courtesy: Kalyanvarma
కుంచికాళ్ జలపాతం
ఇక్కడి అందమైన జలపాతాలు పర్యాటకులకు మరో ఆకర్షణ. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంచికాళ్ జలపాతం. ఇది భారతదేశంలో అత్యధిక ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలలో ఒకటి. అలాగే ప్రపంచ జలపాతాలలో 116వది. ఇది 1493 అడుగులు (455 మీటర్లు) ఎత్తు నుంచి పడుతూ... వరాహి నదికి జన్మనిస్తున్నది. కుంచికాళ్ జలపాతాలకు చూట్టూ పారే ఆ నీటి ధారాలు చూసేందుకు కన్నుల పండువగా కనపడుతూంటాయి.
Photo Courtesy: Manjunath Jois
బర్కానా జలపాతం
మరో జలపాతం బర్కానా జలపాతం. ఇది 850 అడుగుల (259 మీటర్లు) ఎత్తు నుంచి పరవళ్ళెత్తూ ఉంటుంది. ఇది మనదేశంలో అత్యంత ఎత్తునుంచి పడుతున్న జలపాతాలలో 10వ స్థానాన్ని ఆక్రమించింది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తూ బర్కానా జలపాతంగా మారే ఈ జలపాతానికి సీతా జలపాతం అనే మరో పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే పర్యాటకులు పడమటి కనుమలనుండి గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా మోటర్ బైక్ మార్గంలో కూడా వెళ్ళవచ్చు. ఈ జలపాతాల సందర్శనకు శీతాకాలం తగిన సమయం. ఈ జలపాతాల చుట్టూ దట్టమైన అడవులు, అనేక మొక్కలు, జంతువులు కనపడతాయి. కర్ణాటక రాష్ట్ర జలవిద్యుత్ ఉత్పత్తిలో ఈ జలపాతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
Photo Courtesy: Girish
ఒనకి అబ్బే ఫాల్స్
ఆగుంబెకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ఒనకి అబ్బే జలపాతం. కన్నడ భాషలో ఒనకి అంటే దంపుడు కర్ర (వడ్ల దంచేందుకు ఉపయోగించే కర్ర, లేదా రోకలి) అని అర్థం. ఈ జలపాతం ఉధృతిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఆ పేరు పెట్టినట్లు స్థానికుల కథనం. ఈ జలపాతం పైకి అక్కడే నిర్మించిన మెట్ల ద్వారా చేరవచ్చు. పర్యాటకులు జలపాతాన్ని, ప్రవాహాన్ని చూసి ఆనందిస్తారు.
Photo Courtesy:Sri Harsha
జోగి గుండి జలపాతాలు
జోగి గుండి జలపాతాలు చాలా పురాతనమైనవి మరియు సుమారు 1800 సంవత్సరంనుండి ఇవి ప్రవహిస్తూనే ఉన్నాయి. సుమారు 829 అడుగుల ఎత్తునుండి పడతాయి. వీటిని వర్షాకాలంలో తప్పక సందర్శించాలి. జోగిగుండి జలపాతాలు అగుంబేకు సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటాయి. సుమారు మూడు వంతుల దూరాన్ని వాహనంపై ప్రయాణించి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి. స్ధానికుల మేరకు జోగి అంటే రుషి అని, ఇక్కడికి సమీప గుహలోపల తపస్సు చేసేవాడని అతని పేరుతో జోగి గుండి జలపాతం పేరు పెట్టబడినదని చెపుతారు.
Photo Courtesy: umeshn2012
కూడ్లు తీర్ధ జలపాతాలు
పడమటి కనుమలలోని జలపాతాలలో బహు సుందరమైన జలపాతాలు ఈ కూడ్లు తీర్ధ జలపాతాలు. ఇవి పడమటి కనుమల మధ్య భాగంలో ఉన్నాయి. అగుంబే వచ్చిన ప్రతి పర్యాటకుడూ వీటిని చూసి తీరవలసిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుండి ఒక సరస్సులోకి పడుతుంది. ఇది సీతా నది నీరుగా చెపుతారు. పర్యాటకులు జలపాతాన్ని 3 నుండి 4 కి.మీ.ల ట్రెక్కింగ్ తో చూడగలరు.
Photo Courtesy: Vinu Varghese
మెక్కల సంరక్షణా స్థలం
అగుంబేలోనే 1999 సంవత్సరంలో ఔషధీ మెక్కల సంరక్షణా స్థలం స్థాపించబడింది. సముద్రమట్టానికి 600-700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం గార్సీనియా, మిరిస్టికా, లిస్టియేసి, డయోస్పోరస్, హోలిగ్రానా, యూజీనియా, ఫైకస్ తదితర ఓషధ ధర్మాలు కలిగిన మొక్కలకు నిలయంగా మారింది. ఇది అగుంబేలో చూడవలసిన పర్యాటక ప్రదేశంగా అక్కడి స్థానికులు చెబుతుంటారు.
Photo Courtesy: Nara Simhan
అగుంబే ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే...
పశ్చిమ కనుమలలో ఉన్న అగుంబేలో సూర్యాస్తమయం చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అరేబియా సముద్రం ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ... ఆకాశం నిర్మలంగా ఉన్న రోజుల్లో, సూర్యాస్తమయం సమయాల్లో అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్లిపోతున్నాడా అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ వీక్షకులకు కట్టిపడేస్తుంది.
Photo Courtesy: Arun ghanta
మాల్గుడి డేస్
సమయం ఇంకా వుంటే, సుమారు వంద సంవత్సరాలు పురాతన నివాసం అయిన కావేరి అక్క భవనం చూడండి. ఈమె ఆర్ కే నారాయణ్ రచించిన , టి వి సీరియల్ అయిన మాల్గుడి డేస్ లో అద్భుతంగా నటించిన నటీ మణి . ఇక్కడే కల ఒక రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ కూడా చూడవచ్చు.
Photo Courtesy: Sourav Roy
అగుంబే ఎలా చేరుకోవాలి ??
విమాన ప్రయాణం
అగుంబే కు సమీప విమానాశ్రయం మంగుళూరు లోని బాజ్ పే విమానాశ్రయం. ఇది 93 కి.మీ. దూరంలో ఉంది. విదేశాలనుండి, ఇండియాలోని ప్రధాన నగరాలనుండి విమానాలు ఇతర మార్గాల ద్వారా అనుసంధానించబడ్డాయి.
రైలు ప్రయాణం
అగుంబే కు రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ కొంకణ్ రైల్వే లోని ఉడుపి మాత్రమే. ఇది 53 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి పర్యాటకులు స్ధానిక బస్సులను లేదా క్యాబ్ లను తీసుకొని అగుంబే చేరవచ్చు.
బస్సు ప్రయాణం
బెంగుళూరు నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను నడుపుతోంది. పర్యాటకులు షిమోగా, ఉడుపి, మంగుళూరు లనుండి కూడా బస్సులలో 40 నిమిషాల వ్యవధిలో చేరవచ్చు.
సొంత వాహనాలలో వెళితే ..
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి అగుంబే 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బెంగళూరు నుంచి జాతీయ రహదారి 4 మీద తుముకూరు వరకు వెళ్ళి అక్కడ నుండి 206 నంబరు జాతీయ రహదారి మీద షిమోగా వరకు వెళ్లాలి. అక్కడినుంచి 13వ నంబరు జాతీయ రహదారిపై వెళ్తే ఆగుంబే దగ్గర్లోని తీర్థహళ్ళి పట్టణం వస్తుంది.
Photo Courtesy: Nara Simhan