ప్రతి మనిషి జీవితంలో ప్రయాణాలు తప్పని సరి. అవి చేస్తేనే మనసు ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది నేనొక్కన్నే కాదు చెప్పేది .. ఎందరో మానసిక తత్వవేత్తలు, నిపుణులు సైతం బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రయాణాలు చేయమని. నిత్యం ఉండే పని ఒత్తిడిల నుండి ఉపశమనం చెందటానికి ప్రయాణాలు చేస్తుంటారు నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. పర్యాటకులు సహచర ఉద్యోగులతో, స్నేహితులతో, కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో కలిసి యాత్రలు చేయటం పరిపాటి.
ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి అద్భుత రోడ్ ట్రిప్ ప్రయాణాలు !
ఉదయం పూట ప్రయాణాలు మొదలు పెడితే టిఫిన్ ల కై తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట మీ వాహనాన్ని ఆపవలసి ఉంటుంది. అదేదో ఆపేది ఈ రెస్టారెంట్ల వద్ద ఆపేస్తే పోలా ..! అవునండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రెస్టారెంట్ల వద్ద తప్పకుండా మీ వాహనాన్ని ఆపితే మాంచి రుచికరమైన అల్పాహారాన్ని భోంచేసినవారవుతారు . అవేవో చూసేద్దాం పదండి.
బెంగళూరు - మైసూర్ రోడ్
చిత్ర కృప : Ammu Alayil
మీకు ఇక్కడ చెప్పబోయే రెస్టారెంట్ లు ప్రసిద్ధి చెందిన రూట్ బెంగళూరు - మైసూర్ (జాతీయ రహదారి 43/44) రోడ్డు మీద ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ రూట్ గుండా ప్రయాణించిన ఈ రెస్టారెంట్లను గమనించి ఉండరు. కప్పు కాఫీ తాగినా ఇక్కడ రుచికరంగానే ఉంటుంది.
కామత్ లోకరుచి
బెంగళూరు నుండి హైవే మీద మైసూర్ కు ప్రయాణం మొదలుపెడితే మీకు ఎన్నో రెస్టారెంట్ లు కళ్ళముందర కనిపిస్తుంటాయి. అందులో చెప్పుకోదగ్గది కామత్ లోకరుచి. ఉదయం పూట డ్రైవింగ్ మొదలు పెట్టిన వారు ఈ హోటల్ లోనికి వెళ్ళవచ్చు. మీరు లోనికి అడుగు పెట్టగానే బఫే పద్దతి స్వాగతం పలుకుతుంది. మీకు ఇష్టమొచ్చిన టిఫిన్ ను ఏరికోరి మరీ సర్వింగ్ ప్లేట్ లలో వేసుకోవచ్చు. బఫే పద్ధతి కాకుండా ఇక్కడ కూర్చొని తినే సదుపాయం కూడా ఉన్నది. వేడి వేడి ఇడ్లీల మీద నెయ్యి వేసి, అందులో సాంబార్ మరియు బుడ్డల (వేరుశెనగలు) చట్నీ వేసుకొని తింటుంటే ఆహా ..! అనిపించక మానదు.
వేడి వేడి రవ్వ ఇడ్లీ
చిత్ర కృప : Syedshah1314
షుగర్ పేషంట్ లకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. జొన్న రొట్టె, అందులోకి కాయగూరల పులుసు లేకుంటే కర్రీ మరియు మజ్జిగ వడ్డిస్తారు. నాన్ వెజ్ వాళ్లకి ఇదొద్దు ఇది ప్యూర్ వెజ్ హోటల్. అయిన ఉదయాన్నే చికెన్, మటన్ గోల ఏందండీ .. శుభ్రంగా టిఫిన్ లు తినకుండా !
కదంబం
మీకు కాస్త వెరైటీగా టిఫిన్ తినాలని అనిపిస్తుందా ? అయితే అదే హై వే మీద కొంత దూరం వెళితే కదంబం హోటల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈ హోటల్ లో పొంగల్ మరియు పులిహోర అద్దిరిపోతుంది. వేడి వేడి పొంగల్ లో పుల్ల పుల్లగా చింత పండు చట్నీ వేసుకొని తింటే ..! అద్భుతం. పులిహోర లో పెరుగు, చట్నీ లు అబ్బబ్బబ్బా ..!. ఇక్కడ లభించే పొంగల్ రకరకాల ఫ్లేవర్ లలో దొరుకుతుంది. అందులో స్వీట్ పొంగల్ తప్పక రుచి చూడండి. ఇంకెందుకు ఆలస్యం గబుక్కున పోయి వేడి వేడిగా నోట్లో వేసుకొని రుచిని ఆస్వాదించండి.
వేడి వేడి పొంగల్ తినండి
చిత్ర కృప : Kamala Swaminathan
అడిగాస్
అడిగాస్ వేడి వేడి ఆవిరి ఇడ్లీలకు, క్రిస్పీ వడ లకు పేరుగాంచినది. సుమారు 15 సంవత్సరాలకు పైగా పర్యాటకులకు రుచికరమైన అల్పాహారాన్ని, ఫాస్ట్ ఫుడ్ లను అందిస్తున్నది. హోటల్ బెంగళూరు - మైసూర్ పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. వీకెండ్ లలో, సెలవురోజులలో ఈ మరీ ఎక్కువ. హాట్ రవ్వ ఇడ్లీ లు, కరుంకరుం లాడే దోశలు, వడలు తప్పక తినండి. ఇడ్లీలు నోట్లో వేసుకుంటే యిట్టె కరిగి పోతాయ్ ..!
యమ్మి యమ్మి దోశ
చిత్ర కృప : Sameer.siddhanti
పైన పేర్కొన్న మూడు హోటల్లు కేవలం వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే అందిస్తాయి. కాబట్టి నాన్ - వెజ్ ప్రియులు వెళితే వెజిటేరియన్ ఆహారాన్ని మాత్రమే ఆర్డర్ ఇవ్వండి. మంచి నీటి బాటిళ్ళు, కూల్ డ్రింక్స్, ఐస్ - క్రీమ్స్, జ్యూస్ లు ఇక్కడ లభ్యమవుతాయి. తిరుగు ప్రయాణంలో ఫాస్ట్ ఫుడ్, రోటీస్, వెజ్ రోల్స్ ఆరగించవచ్చు.