సందర్శనీయ ప్రదేశాల చిరునామా.. కామ్షేట్!
కామ్షెట్ మహారాష్ట్రలోని పూణే నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూణే మరియు ముంబాయిలతో రోడ్డు, రైలు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ప్రకృతి సోయగాల నడుమ అందమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. మార్గంలో మట్టి, గడ్డితో సాంప్రదాయ శైలిలో నిర్మించబడిన అనేక చిన్న చిన్న గ్రామాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. ఇక్కడ ఏడాది పొడవునా సగటు ఉష్ణోగ్రత 20 °C నుండి 26 °C మధ్య ఉంటుంది.
అంతేకాదు, కామ్షెట్ ప్రజలు చాలా సహాయకులుగా, నిజాయితీగా ఉంటారని పేరుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో శాఖాహార, మాంసాహారులు ఇద్దరికీ అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటితో పాటు, కామ్షెట్లో అసంఖ్యాకమైన పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. కామ్షెట్లోని కొన్ని పేరొందిన పర్యాటక స్థలాలను చూద్దాం.
షిండే వాడి కొండలు
కామ్షెట్ పారాగ్లైడింగ్ అనుభవానికి ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు దీనిని పారాగ్లైడర్ల స్వర్గం అని పిలుస్తారు. ఈ సాహస క్రీడ పట్ల ఆసక్తి ఉన్నవారు నేర్చుకునేందుకు పారాగ్లైడింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి షిండే వాడి హిల్స్ ఒక ప్రసిద్ధ పారాగ్లైడింగ్ టేకాఫ్ పాయింట్. నేలపై నుండి కేవలం వంద అడుగుల నుండి రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నందున, పారాగ్లైడింగ్ కొత్తగా నేర్చుకునేవారికి అనువైన ప్రదేశంగా పేరుగాంచింది. బ్రిటీష్ వారితో యుద్ధ సమయంలో మాధవరావు షిండే (మరాఠా వంశానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు) సైనికులు ఈ కొండల కొండపై నుండి మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారని అంటారు.
కొండేశ్వరాలయం
కొండేశ్వర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇది చాలా దట్టమైన అడవి మధ్యలో నిటారుగా నిలబడి ఉన్న పురాతన దేవాలయం. ఈ ఆలయం నల్ల రాళ్లతో నిర్మించబడింది. దీని నిర్మాణ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ ఆలయం సందర్శించడానికి అనువుగా ఉండదు. ఎందుకంటే ఆ సీజన్లో ఇక్కడి రాతి భూభాగం బాగా కఠినంగా ఉంటుంది. మహాశివరాత్రిని ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుతారు. ఈ ఆలయానికి సమీపంలో శ్రీ ఖటేశ్వర్ మహారాజ్ సమాధి, ఒక చెరువు, అందమైన జలపాతం కూడా ఉన్నాయి.
భైరి గుహలు
భైరి గుహలు కామ్షెట్లోని ఎత్తయిన రాళ్లపై ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ జంతుబలులు జరుగుతాయని ప్రజలు చెబుతుంటారు. గుహలవద్ద అనేక వంట సామాగ్రి ఉన్నాయి. స్థానికుల విశ్వాసాల ప్రకారం, ఎవరైనా వాటిని దొంగిలించడానికి ప్రయత్నిస్తే, దేవుడిచే శిక్షించబడతారట. గుహలను ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. కానీ ఈ ట్రెక్ చాలా కఠినమై సవాలుగా ఉంటుంది. కొన్ని పాయింట్ల వద్ద చాలా ప్రమాదకంగా ఉంటుంది.
బెడ్సే గుహలు
ఈ గుహలు మహారాష్ట్రలోని పురాతన గుహలలో ఒకటి. అవి క్రీస్తు పూర్వం 60 నాటివి. ఇవి కామ్షెట్ నుండి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ, ఇక్కడికి సులభంగా ప్రయాణించవచ్చు. ఈ గుహలు ఏటవాలు కొండ ప్రదేశంలో ఉన్నాయి. వాటిలో ఇరవై ఐదు అడుగుల ఎత్తయిన నాలుగు స్తంభాలు ఉంటాయి. బెడ్సే గుహలు కూడా అందమైన శిల్పాలను కలిగి ఉంటాయి. అవి బౌద్ధ గుహలు. ప్రధాన గుహ చైత్య (చైత్యాలు బౌద్ధ ప్రార్థనా మందిరాలు) మధ్యలో ఒక భారీ స్థూపం ఉంటుంది.
పావనా సరస్సు
పావనా సరస్సు అనేది పవన ఆనకట్ట ద్వారా ఏర్పడిన ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సు సమీపంలో లోహ్గడ్, టికోనా మరియు తుంగి కోటలు అనే మూడు కొటలు ఉన్నాయి. ఈ సరస్సు బుషి డ్యామ్, నాఘంజ్ మరియు రాజ్మాచికి సమీపంలో ఉంది. పావనా సరస్సు చుట్టుపక్కల అనేక ఇతర సందర్శనీయ ప్రదేశాలను కలిగి ఉంది. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఈ సరస్సు కనువిందు చేస్తుంది. ఆకాశం యొక్క రంగు నీటిపై ప్రతిబింబించినప్పుడు తారసపడే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.