హనీమూన్ ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. కొత్తగా పెళ్లయిన జంట వారి ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ఈ జర్నీ బాగా ఉపయోగపడుతుంది. అయితే హనీమూన్ వెళ్లాలనుకుంటున్న ప్రదేశాలు రొమాంటిక్గా ఉండాలి.
శీతల పవనాలు మేనిని తాకి గిలిగింతలు పెట్టాలి... మంచుదుప్పటి కప్పుకున్న గిరులు మదిని పులకరింపజేయాలి... నేలంతా పరుచుకున్న పచ్చదనం, ఆకాశాన్నంటే తరువులు హృదయాన్ని పరవశింపజేయాలి.. ఆశలు బాగానే ఉన్నాయి కాని, వేసవిలో ఇవన్నీ సాధ్యమా?! అని నిరుత్సాహపడకండి. సాధ్యమే! జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభవాలను మూటకట్టుకోవడానికి సిద్ధం కండి. ఎలా అంటారా..
బిడియాలకు గడియేసే మంత్రం.. భర్త నాడి పట్టే తంత్రం..భార్య మనసును అర్థం చేసుకునే మార్గం.. హనీమూన్. ఈ వేసవి ముహూర్తాల్లో ఒక్కటవుతున్న జంటల కోసం కొన్ని హనీమూన్ స్పాట్స్ ఉన్నాయి..మరి ఆ అందమైన భూతల స్వర్గాలేంటో తెలుసుకుందాం..
ఊటి:
కొత్తగా పెళ్లైన జంటలకు హనిమూన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఊటినే. మధ్య తరగతి కుటుంబ నుంచి కాస్త ఉన్నత స్థాయి కుటుంబాల వరకూ ఈ ప్రాంతాన్నే తమ హనీమూన్ డెస్టినిగా లేదా హాలిడే స్పాట్గా ఎన్ను కొంటారు. నీలగిరి పర్వత శ్రేణుల్లో పచ్చని చీర కట్టిన పర్వాతల ఒడిలో దాగిన ఊటీ... హానీమూన్కు భలే అనువైనది. బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్ ఇలా ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారికి ఇది దగ్గర కూడా.
మనాలి
హనీమూన్ వెళ్లాలనుకొనే వారి ఛాయిస్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న పట్టణం కూడా తప్పకుండా ఉంటుంది. ఇందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ప్రధాన కారణం. ఒక వైపున నదీ లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, ఆ పర్వతాల్లో రంగురంగుల పుష్పాలు ఇలాంటి ద`ష్యాల కంటే కొత్త జంటలు కోరుకునేది ఇంకేమి ఉంటుంది చెప్పండి. అందుకే సముద్రమట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణానికి హనీమూన్ జంటలు క్యూ కడుతుంటాయి. అదే విధంగా ఇక్కడి భౌగోళిక పరిస్థితులు సాహస క్రీడలకు పెట్టింది పేరు. అందువల్ల ఇటీవల కాలంలో యువకులు కూడా ఇక్కడకు ఎక్కువగా వెలుతుంటారు.
కేరళ
సముద్ర తీర ప్రాంతమైన ఈ రాష్ర్టం దేశంలో పర్యాటకంలో ముందుంటుంది. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. గాడ్స్ పేరడైజ్గా పేరొందిన కేరళాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. అందమైన కాలువలు, నదులు... ఇలా ఎన్నో అందాలకు నెలవైన ఈ ప్రాంతంలో కేరళా సాంప్రదాయ పద్ధతిలో మీ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హనీమూన్ బోటులో షికారు చేస్తే ఎంత మధురంగా ఉంటుందో కదూ.
గోవా:
సముద్ర తీర ప్రాంతమైన గోవా కేవలం మనకే కాకుండా విదేశీయులకు కూడా అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. చాలా మంది బ్యాచిలర్ పార్టీ కోసం ఇక్కడికే వస్తుంటాయి. కొన్ని కళాశాలలు కూడా తమ విద్యార్థులకు ఇక్కడకు ట్రిప్ కోసం తీసుకువెలుతుంటాయి. ఇక్కడి హోటల్, రిసార్టులు కూడా ప్రతి వర్గం కోసం అందుబాటు ధరల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ఉదయ్ పూర్ :
రాజస్థాన్ లో సిటీ ఆఫ్ సన్ సెట్ గా పేరుగాంచిన ఉదయ్ పూర్ అటు విద్యార్థులతో పాటు హనిమూన్ జంటలను బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటు వంటి సరస్సులే. ఏకాంతంగా గడపాలనుకొనే వారికి అనువైన వాతావరణంతో పాటు అడ్వెంచర్ టూర్ ను ఇష్టపడే యువతకు కూడా ఈ ఉదయ్ పూర్ లోని సరస్సులు అవకాశం కల్పిస్తాయి.
షిమ్లా, హిమాచల్ ప్రదేశ్:
హనీమూన్ గురించి చెప్పుకునేప్పుడు సిమ్లాను మరిచిపోతే ఎలా? ఎండాకలంలో సైతం రొమాంటిక్ వాతావరణంతో స్వాగతం పలికే సిమ్లాలో ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.న్, ఓక్ చెట్ల సౌందర్యం, ఉత్తరాన మంచుతో కప్పబడిన ప్రాంతాలు, విస్తారమైన లోయలను చూస్తుంటే అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. హిమాలయ పర్వత సానువుల్లో భాగమైన ఈ నగరంలో ఒక్కొక్కసారి నాలుగు డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ఆ చల్లని సమయంలో వెచ్చని కోరికలకు అంతే ఉండదేమో. టాయ్ ట్రైన్ ప్రయాణం అస్సలు మిస్ కావద్దు.
నైనితాల్, ఉత్తరాఖండ్:
ప్రకృతికి పుట్టినిల్లైన ఉత్తరాఖండ్లో నైనితాల్ హనీమూన్ కపుల్స్ మధురమైన అనుభూతి కలిగిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో సరస్సు.. లాహిరి లాహిరి లాహిరిలో అంటూ.. బోటు షికారు చేస్తే ఎంత రొమాంటిగ్ ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.
పగడపు దీవుల్లో.. లక్షద్వీప్
ఎంత హనీమూన్కొచ్చినా.. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు. పిల్లగాలితో అల్లరి చేయొద్దా! చల్లని సముద్ర గర్భంలో దాగిన అందాలు చూడొద్దా! ఇన్ని చేయాలంటే లక్షద్వీప్ వెళ్లాలి! ఈ పగడపు దీవుల్లోని ప్రకృతి సౌందర్యం బాలమిత్ర కథల్లో వర్ణించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. అరేబియా సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న ఈ ద్వీపాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మండువేసవిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటదు. సాయంకాలం.. సాగర తీరంలో.. శీతల పవనాలు వీస్తుంటాయి. లక్షదీప్ 36 దీవుల సమూహం. ఇందులో 10 ద్వీపాల్లో మాత్రమే జనాలున్నారు. వీటిలో బంగారం, కడమట్, అగట్టి ద్వీపాలు చాలా బాగుంటాయి. ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్లడానికి ఫెర్రీలు ఉంటాయి. కయాకింగ్, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహసక్రీడలకు వేదికలు ఈ ద్వీపాలు.
శ్రీనగర్లోని దాల్ సరస్సు
‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగుతాయ’ని ఓ సినీకవి సెలవిచ్చారు. అలాంటి మధురమైన భావన ఎక్కడ పడితే అక్కడ కలగదు. కొలనులో నీరు నిద్దురోయినట్టే ఉండాలి. కొత్త పెళ్లి కూతురు కుదురుగా కూర్చోవడానికి గూటి పడవ కావాలి. మంచుకౌగిట వణుకుతున్న కొండల ప్రతిరూపాలు.. నీలి నీటిలో తేలాడుతుండాలి. ఇవన్నీ ఉన్నాయంటే అది శ్రీనగర్లోని దాల్ సరస్సు అయి ఉంటుంది. మనదేశంలో ఎవర్గ్రీన్ హనీమూన్ స్పాట్ శ్రీనగర్.. కొత్త దంపతులకు ఇది ప్రేమ్నగర్. మదిని పరవశింపజేసే దాల్ సరస్సు.. ఆ పక్కనే ఊసులు పంచుకోవడానికి షాలీమర్ తోట.. దాని చెంతనే హౌస్బోట్లతో నగీన్ సరస్సు.. ఈ ఉత్సాహం నుంచి తేరుకోకముందే తులిప్ తోట.. స్వర్గమిక్కడే అంటుంది. కొత్తకాపురాన్ని దిద్దుకుంటున్న ఆలుమగలకు ఇంతకన్నా అనువైన చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే హనీమూన్ అనగానే టూరిస్ట్ ఆపరేటర్లు, ట్రావెల్ సంస్థలు కూడా ముందుగా కశ్మీర్ పేరే చెబుతారు. అందునా శ్రీనగర్ సౌందర్యం ప్రత్యేకమైనది. వేసవి ముహూర్తాల్లో ఒక్కటైన వారు.. మరింత దగ్గరవ్వడానికి ఇంతకన్నా మంచి ప్రదేశం మరొకటి ఉండదు.
అండమాన్-నికోబార్ దీవులు
కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులకు అండమాన్-నికోబార్ దీవులు అద్భుతమైన హనీమూన్ స్పాట్. అందమైన వాతావరణం, రకరకాల మనుషులు, కాస్త హడావుడి.. ఇంకాస్త కలివిడితనం కలగలసిన దీవులివి. బడ్జెట్ లెక్కలు చూసుకునే వారు, డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసే వారు.. ఎవరైనా అండమాన్లో జాలీగా గడిపేయొచ్చు. సాహస క్రీడలకు అండమాన్ కేరాఫ్. అండమాన్ రాజధాని పోర్ట్బ్లెయర్లో దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్ర సమరయోధులను అప్పట్లో బందీలుగా ఉంచిన కాలాపాని జైలును ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రోజూ సాయంత్రం స్వాతంత్య్ర సంగ్రామంపై లేజర్ ప్రదర్శన నిర్వహిస్తారు. పోర్ట్బ్లెయర్కు 35 కిలోమీటర్ల దూరంలోని హావెలాక్ బీచ్ చాలా అందంగా ఉంటుంది.
డార్జిలింగ్
హనీమూన్కు పశ్చిమ బంగలో అనువైన చోటేది అని అడిగితే టక్కున చెప్పే పేరు డార్జిలింగ్. ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో మరో అందమైన ప్రాంతం ఉంది. దాని పేరు కాలింపాంగ్. ఎత్తయిన కొండలు.. వాటిపై బౌద్ధారామాలు.. ప్రశాంతతకు చిరునామాగా ఉంటుందీ ఊరు. ఆమని రాకతో పర్వతాలన్నీ పచ్చటి దుప్పటి కప్పుకొని పసందుగా కనిపిస్తాయి. అరవిరిసిన ఆర్చిడ్ పూలు వసంతగాలికి వలపులు నేర్పిస్తాయి. తీస్తా నది తీరంలో విహారం, కొండల్లో లోయల్లో ప్రయాణం.. కాలింపాంగ్కు వెళ్లిన నూతన వధూవరులకు మధురమైన అనుభూతినిస్తాయి. పనిలో పనిగా పక్కనే ఉన్న డార్జిలింగ్నూ సందర్శించి రావొచ్చు.